ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భీమిలి సముద్ర తీరంలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు కొరడా - చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 12:50 PM IST

Updated : Feb 28, 2024, 1:50 PM IST

CRZ Constructions in Bheemili Beach: భీమిలి సీఆర్‌జడ్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై హైకోర్టు చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలపై తీసుకున్న చర్యలను ఓ నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

crz_constructions_in_bheemili_beach
crz_constructions_in_bheemili_beach

CRZ Constructions in Bheemili Beach: విశాఖ జిల్లాలోని భీమిలి సాగర తీరంలోని సీఆర్​జడ్​ నిర్మాణాలపై వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‌జడ్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. బీచ్‌ వద్ద శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారని మూర్తి యాదవ్ పిటిషన్​లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి చర్యలకు ఆదేశించింది.

నిర్మాణ స్థలంలో సంబంధిత కట్టడాలకు వినియోగిస్తున్న యంత్రాలను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా నిర్మాణాలపై ఆదేశాల అనంతరం తీసుకున్న చర్యలపై ఓ నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

అధికార పార్టీ ఆక్రమణ పర్వం - ఓటు వేసినందుకు అన్యాయం చేశారని బాధిత మహిళ ఆవేదన

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు: జిల్లాలోని భీమిలి పరిధిలో సాగర తీరానికి అతి సమీపంలో నిర్మాణాలు జరుగుతున్న అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయంశంగా మారింది. యంత్రాలను వినియోగించి ఇసుక దిబ్బలను ధ్వంసం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విధ్వంసకాండలో తీరప్రాంత నియంత్రణ జోన్‌ నిబంధనలేవి పాటించటం లేదని ఆరోపణలున్నాయి. భారీగా తవ్వకాలు సైతం చేపట్టారు. సముద్రానికి సమాంతరంగా ఓ ప్రహరీని నిర్మిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు : ఈ నిర్మాణాలను పర్యావరణ, అటవీ సంరక్షణ చట్టాలను పట్టించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా అటువైపు అధికారులు కన్నతైనా చూడడం లేదు. గత కొన్ని రోజుల క్రితం ఈ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. వారి పరిశీలన అనంతరం కూడా నిర్మాణా పనులు జోరుగా సాగుతుండటం విమర్శలకు దారి తీస్తోంది.

విశాఖ కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు

గతంలో కూల్చివేతలు : వైఎస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నుంచి భీమిలి వరకు గల సాగర తీరంలోని అక్రమ కట్టడాలన్నింటిని పెద్దల ఒత్తిడితో విశాఖ మహా నగరపాలక సంస్థ కూల్చివేసింది. ఈ కట్టడాలన్నీ సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఆ తర్వాత చేపట్టిన కార్యకలాపాలకు కూడా జీవీఎంసీ అనుమతించలేదు.

విచారణకు ఆదేశాలిచ్చి ముగించేశారు : సామాన్య ప్రజలకు చెందిన నిర్మాణాలను సైతం అప్పుడు నేల మట్టం చేశారు. చిన్న చిన్న దుకాణాలను సైతం అప్పుడు వదలలేదు. కానీ, ఇప్పుడు అదే జీవీఎంసీ అదే ప్రదేశంలో భారీ నిర్మాణాలు జోరుగా సాగుతున్న అసలు పట్టించుకోవడమే లేదు. నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న నిర్మాణాలు చేపట్టిన తక్షణమే కూల్చివేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి చర్యలు లేవు. కొంతమంది ఫిర్యాదుల మేరకు మహానగరపాలక సంస్థ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేసి నివేదిక కోరి మిన్నకుండిపోయారు. ఇప్పుడు జరుగుతున్నవి ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన నిర్మాణాలు కాబట్టే, చర్యలు లేవనే విమర్శలున్నాయి.

విజయవాడలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు - 'అంతా నా ఇష్టం' అంటున్న వైసీపీ ఎమ్మెల్యే!

Last Updated :Feb 28, 2024, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details