ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో జోరుగా కూటమి నేతల ప్రచారాలు- భారీగా కొనసాగుతున్న చేరికలు - Election Campaign in Andhra Pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 7:05 AM IST

Alliance Leaders Election Campaign in Andhra Pradesh: రాష్ట్రంలో ఎన్నికల ప్రచార జోరుతోపాటు చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల వేళ ఊరూవాడా ప్రచారాలతో కూటమి నేతలు హోరెత్తిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. వైసీపీ నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు అడుగడుగునా గజమాలలు, మంగళహారతులతో ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు.

Alliance Leaders Election Campaign in Andhra Pradesh
Alliance Leaders Election Campaign in Andhra Pradesh

రాష్ట్రంలో జోరుగా కూటమి నేతల ప్రచారాలు- భారీగా కొనసాగుతున్న చేరికలు

Alliance Leaders Election Campaign in Andhra Pradesh:ఎన్నికల వేళ ఊరూవాడా ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీల నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏన్డీయే కూటమి నేతలు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీను వీడి భారీగా తెలుగుదేశంలో నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు.

'అమరావతిని బతికించుకోవాలంటే టీడీపీని గెలిపించుకోవాలి' ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు

ఎన్డీయే అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన అభ్యర్థులు బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి అవనిగడ్డ వరకు నిర్వహించిన సంకల్ప ర్యాలీకి విశేష స్పందన లభించింది. శ్రీకాకుళేశ్వరస్వామి సన్నిధిలో అభ్యర్థులు పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టారు. కొడాలి, చల్లపల్లి, మోపిదేవి మీదుగా అవనిగడ్డ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. అభ్యర్థులకు అడుగడుగునా గజమాలలు, మంగళహారతులతో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో పలువురు అవనిగడ్డ నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి జనసేనలో చేరారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన సింహాద్రి పవన్ ఆధ్వర్యంలో అవనిగడ్డలో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు.

విజయవాడలో వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరుగా సాగింది. కొండ ప్రాంతాల్లోని ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రచారం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి కోటేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు.

'టీడీపీతోనే గ్రామస్వరాజ్యం సాధ్యం'- ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన పయ్యావుల

ప్రకాశం జిల్లా ఒంగోలులో రెవెన్యూ కాలనీలో తెలుగుదేశం కార్యాలయాన్ని దామచర్ల జనార్దన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని తెలుగుదేశానికి మద్దతు తెలిపారు. స్థానికులు తమ సమస్యలను దామచర్లకు విన్నవించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఇంటింటికీ తిరుగుతూ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ప్రచారం నిర్వహించారు. కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ప్రచారం జోరు పెంచారు. ఆయన సమక్షంలో బంగారు పేట కాలనీలో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగలలో వైసీపీ నాయకురాలు సువర్ణలత, ఆమె అనుచరులు టీడీపీలో చేరారు. బుచ్చిబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. చల్లంగి గ్రామంలోనూ బీసీ వర్గాలకు చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

వైసీపీ నేతల కుట్రలు - ఆ పార్టీ కార్యకర్తలకే కండువా కప్పి టీడీపీ నుంచి చేరినట్టు ప్రచారం

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీని వీడారు. ఎంపీపీ, రూరల్ మండల వైసీపీ అధ్యక్షుడు కేత వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గోపాల్‌రెడ్డితోపాటు రావులకొల్లు సర్పంచ్ రామిరెడ్డి మోహన్‌రెడ్డి కూడా పసుపు కండువా కప్పుకున్నారు.

'ఐదేళ్ల నష్టాన్ని వివరిస్తూ- భవిష్యత్​ భరోసా కల్పిస్తూ' - ఇంటింటికీ కూటమి అభ్యర్థుల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details