ఆంధ్రప్రదేశ్

andhra pradesh

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల రద్దుతో కళంకం- నిమ్మకునీరెత్తినట్లు జగన్ సర్కార్!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 7:05 AM IST

2018 Group-1 Mains Exam Issue in AP: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల రద్దు ప్రభుత్వానికి మాయని మచ్చైనా జగన్ సర్కార్​లో చలనం లేదు. జవాబు పత్రాల్లో వేర్వేరు చేతిరాతలు ఉన్నా, నివేదిక రాకుండానే ఫలితాలు వెల్లడించినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదు. హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనంపై ఇంకా బుకాయిస్తోంది.
2018_Group1_Mains_Exam_Issue_in_AP
2018_Group1_Mains_Exam_Issue_in_AP

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల రద్దుతో కళంకం- నిమ్మకునీరెత్తినట్లు జగన్ సర్కార్!

2018 Group-1 Mains Exam Issue in AP: 2018 గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల రద్దుతో కళంకం ఏర్పడినా జగన్‌ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. హాయ్‌ల్యాండ్‌లో తొలివిడత మూల్యాంకనం జరగలేదని ఏపీపీఎస్సీ(APPSC) ఇప్పటికీ బుకాయిస్తోంది. తొలివిడత జవాబుపత్రాల మూల్యాంకనం 2021 డిసెంబరు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య హాయ్‌ల్యాండ్‌లో జరిగిందని తెలిపేలా కమిషన్‌ ద్వారా వివిధ సంస్థలతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఎస్​బీఐ(SBI) ద్వారా జరిగిన చెల్లింపుల వివరాలు కళ్లెదుటే ఉన్నా, అటు ప్రభుత్వం, ఇటు ఏపీపీఎస్సీ ఇప్పటికీ నోరు విప్పడంలేదు.

భారీగా ఖర్చు: తొలి విడత మూల్యాంకనానికి రూ.కోటి 19 లక్షలు, మలివిడత మూల్యాంకనానికి కోటి 23 లక్షల రూపాయల చొప్పున కమిషన్‌ ఖర్చుపెట్టింది. పోలీసు భద్రత, వాహనాల వినియోగం, ఉద్యోగుల హాజరు, ఇతర కార్యకలాపాలు హాయ్‌ల్యాండ్‌ కేంద్రంగా ఎందుకు జరిగాయో చెప్పట్లేదు. జవాబుపత్రాల్లో రెండు రకాల చేతిరాతలు ఉన్నట్లు ఏపీపీఎస్సీయే పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది.

గ్రూప్‌-1లో అక్రమాలు రుజువైనా బుకాయిస్తున్నారు- సవాంగ్ రాజీనామా చేయాలి: పట్టాభి

రెండోసారి మూల్యాంకనంలో 49 వేల ఓఎంఆర్‌ షీట్లు కావాలని కమిషన్‌ కార్యదర్శ డేటాటెక్‌కు లేఖ రాశారు. 2021 డిసెంబరు 21 నుంచి మూల్యాంకనం ప్రారంభమైంది. 2022 జనవరి 1న అప్పటి కార్యదర్శి ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మలివిడత మూల్యాంకనం విజయవాడలోని 3 కేంద్రాల్లో 2022 మార్చి 25 నుంచి మే 25 వరకూ జరిగింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి హోదాలో డాక్టర్‌ ఎ.బాబు డేటాటెక్‌కు 2022 మార్చి 9న రాసిన లేఖలో గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనం నిమిత్తం 49వేల ఓఎంఆర్‌ బార్‌కోడ్‌ షీట్లు, 2వేల 500 కంట్రోల్‌ బండిళ్ల స్లిప్పుల తయారీ, ఇతర పనులను అప్పగిస్తుట్లు పేర్కొన్నారు.

అదే ఏడాది మార్చి 25న కమిషన్‌ అదనపు కార్యదర్శి 3లక్షల 34 వేల 720రూపాయలను డేటాటెక్‌కు ఎస్​బీఐ ద్వారా చెల్లించారు. 'వర్క్‌డన్‌ సర్టిఫికెట్‌'లోనూ 2018 గ్రూప్‌-1 జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనం అని పేర్కొన్నారు. మూల్యాంకనం దశలవారీగా జరగడంతో జవాబుపత్రాలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌రూమ్​ను ఉపయోగిస్తారు. వీటి వద్ద, మూల్యాంకన పరిసరాల్లో పోలీసులు భద్రత కల్పించారు.

జవాబుపత్రాన్ని మొదటిసారి దిద్దాక నిపుణులు అభ్యర్థికి వచ్చిన మార్కులు ఓఎమ్​ఆర్ షీట్‌పై నమోదు చేస్తారు. ఒక సమాధానపత్రాన్ని ముగ్గురు దిద్దుతారు. ఓఎమ్​ఆర్ షీటులో 4భాగాలు ఉంటాయి. ఒక భాగంలో అభ్యర్థుల వివరాలు ఉంటాయి. 3భాగాల్లో నిపుణులు మార్కులు విడివిడిగా నమోదు చేస్తారు. తొలి ఇద్దరు మూల్యాంకనం చేసి, వేసిన మార్కుల మధ్య తేడా 15 శాతం దాటితేనే మూడో నిపుణుడికి జవాబుపత్రం వెళ్తుంది.

'2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు'- సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్

లేకపోతే ఆ ఇద్దరి మార్కుల సగటును నమోదు చేస్తారు. డిజిటల్‌ మూల్యాంకనంలో మూడో నిపుణుడు అవసరం రాలేదు. మలివిడతలో 4వేల 940 జవాబు పత్రాలు మూడో నిపుణుల వద్దకు వెళ్లినట్లు ఏపీపీఎస్సీ తన అఫిడవిట్‌లో తెలిపింది. కానీ అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన రుజువుల ద్వారా ఈ జవాబుపత్రాల సంఖ్య 5 వేల 957గా రుజువైంది. సాధారణంగా ఇలా వెళ్లేవి 8 శాతం లోపే ఉంటాయి. ఇక్కడ 12.3శాతంగా ఉండటం మూల్యాంకన ప్రమాణాల తీరును ప్రశ్నార్థకం చేస్తోంది.

మాన్యువల్‌ జవాబుపత్రాల మూల్యాంకనం సందర్భంగా 2 జవాబుపత్రాల్లో వేర్వేరు చేతిరాతలు ఉన్నట్లు గుర్తించి కమిషన్‌ దృష్టికి తెచ్చారు. ఇందులో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు విచారణ కమిటీని 2022 ఏప్రిల్ 130న కమిషన్‌ నియమించింది. దీని తుది నివేదిక రాకముందే ప్రధాన పరీక్షల ఫలితాలను మే 26న ప్రకటించారు. ఇలా ప్రకటించడంలో ఔచిత్యమేంటి అనేది ప్రశ్నార్థకం. సాధారణంగా మూల్యాంకన విధులకు హాజరయ్యే నిపుణుల వివరాలు గోప్యంగా ఉంటాయి. కానీ, మలివిడత మూల్యాంకనం ప్రారంభానికి ముందే నిపుణుల వివరాలు సబ్జెక్టుల వారీగా ఫోన్‌ నంబర్లు సహా వెలుగులోకి వచ్చాయి. వీటి ప్రకారం ఏమైనా జరిగే అవకాశం ఉంది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో తప్పులు - ‘అతివాద దశ’ బదులుగా తీవ్రవాద దశ!

ABOUT THE AUTHOR

...view details