Sunrisers Hyderabad IPL:ఐపీఎల్ 17వ సీజన్ ముంబయి వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో పరుగుల వర్షం కురిసింది. సన్రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్, అభిషేక్, క్లాసెన్ ఉప్పల్లో బీభత్సం సృష్టించారు. బంతి బౌలర్ చేతిలో కంటే బౌండరీలలోనే ఎక్కువగా కనిపిస్తుంటే ఇది సన్రైజర్స్ జట్టేనా? అన్న అనుమానం కూడా కలిగింది. ఎప్పుడూ బౌలింగ్ మీదే ఆధారపడి విజయాలు నమోదు చేసే సన్రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 277 పరుగులు నమోదు చేసి బెంగళూరు పేరిట ఉన్న రికార్డు (263-5)ను తుడిచేసింది.
అయితే అటువైపు ఉంది 5సార్లు ట్రోఫీని ముద్దాడిన ముంబయి జట్టు. ఇటేమో బౌలింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నా, బ్యాటింగ్లో కాస్త అటు ఇటూగా కనిపించే జట్టు. అదే అంచనాలతో టాస్ గెలవగానే బౌలింగ్ తీసుకున్నాడు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య. దీంతో మ్యాచ్ హైదరాబాద్ బౌలర్లు వర్సెస్ ముంబయి బ్యాటర్లకు మధ్యే ఉంటుందని అనుకున్నారు. కానీ, అందరి అంచనాలు తలకిందులయ్యాయి.
హైదరాబాద్ హీరోలు ట్రావిస్ హెడ్ (62 పరుగులు), అభిషేక్ శర్మ (68 పరుగులు), ఎయిడెన్ మర్క్రమ్ (42 పరుగులు), హెన్రీచ్ క్లాసెన్ (80 పరుగులు) ముంబయి బౌలర్లపై దాడి చేశారు. దీంతో సన్రైజర్స్ భారీ స్కోర్ సాధించగలిగింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ లేని సన్రైజర్స్ బ్యాటింగ్లో రాణించలేదు అన్నవారికి తాజా ఇన్నింగ్స్తో ఈ స్టార్లు దీటైన సమాధానం చెప్పారు. ముఖ్యంగా సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్లో రెచ్చిపోతున్నాడు. అతడు తొలి మ్యాచ్లోనూ అసాధారణంగా పోరాడాడు. కేకేఆర్పై 29 బంతుల్లోనే 63 పరుగులు సాధించాడు. అందులో ఏకంగా 8 సిక్స్లు ఉన్నాయి. ఇక ముంబయిపై కూడా 235 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు.