ETV Bharat / state

'ఫొటోలతో సహా యాదాద్రి పనుల నివేదిక కావాలి'

author img

By

Published : Dec 20, 2020, 7:01 AM IST

యాదాద్రిలో పంచనారసింహుల దివ్య సన్నిధి పనులు ఏ మేరకు పూర్తయ్యాయో ఫొటోలతో సహా తనకు నివేదికను అందజేయాలని ‘యాడా’ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. అభివృద్ధి పనుల తీరును తెలుసుకోవాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డికి పురమాయించారు.

cm kcr inquiry on yadadri temple work
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు ఎక్కడిదాకా వచ్చాయోనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఫొటోలతో సహా పనుల నివేదికను పంపించాలని యాడా అధికారులను ఆదేశించారు. యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్​రెడ్డి ఆలయ పనులన్నింటినీ పరిశీలించారు. భక్తులకు త్వరలో స్వయంభువుల దర్శన భాగ్యం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి అభిలాష. ఆ నేపథ్యంలో భూపాల్‌రెడ్డి ఇటీవలే రెండ్రోజులు ‘యాడా’ నిర్వాహకులు, సంబంధిత అధికారులతో హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పనులపై సమీక్షించారు. నివేదికలను పరిశీలించాక సీఎం యాదాద్రికి ఎప్పుడైనా రావొచ్చని తెలుస్తోంది.

డ్రోన్‌ ఫొటోల విడుదల

యాదాద్రి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి డ్రోన్‌ కెమెరాతో తీసిన చిత్రాలను యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. భక్తులకు వసతులు కల్పించడంలో భాగంగా కొండ కింద గండిచర్ల ప్రాంగణంలో పుష్కరిణి, కల్యాణ కట్ట, వ్రత మండపాల నిర్మాణం, పెద్దగుట్టపై ఆలయ నగరి పేరిట 250 ఎకరాల్లో చేపట్టిన విశాల రహదారులు, పచ్చదనం, శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం చుట్టుపక్కల నిర్మాణాల చిత్రాలను డ్రోన్‌ ద్వారా యాడా తీయించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.