'కేంద్రంలో మోదీ గ్యాస్​ ధర పెంచితే.. ఇక్కడ మేం తగ్గిస్తున్నాం'

author img

By

Published : Apr 20, 2022, 1:47 PM IST

Updated : Apr 20, 2022, 3:22 PM IST

Minister KTR Warangal Tour

Minister KTR Warangal Tour: ప్రధాని మోదీ వల్ల గ్యాస్‌ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటిందని.. మంత్రి కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వరంగల్​ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి తక్కువ ధరకే ఇంటింటికీ వంటగ్యాస్​ సరఫరా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేను కేటీఆర్​ అభినందించారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పర్యటించిన కేటీఆర్​ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Minister KTR Warangal Tour: రాష్ట్ర ప్రయోజనాలను ఎప్పటికీ కాపాడేదీ తెరాస మాత్రమేనని.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల బాగోగుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్​కు తప్ప.. విపక్ష నాయకులకు పట్టదని విమర్శించారు. వరంగల్​ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్ నగర్ వద్ద మెగా కంపెనీ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ప్లాంట్​ను కేటీఆర్​ ప్రారంభించారు. ఈ మేరకు సుదర్శన్​ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్రంలో ప్రధాని మోదీ గ్యాస్ సిలిండర్ రూ. వెయ్యికి పెంచితే... ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే ఎమ్మెల్యే పెద్ది సుదర్శనరెడ్డి గ్యాస్​ను ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకూ తక్కువ ధరకే పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో కేటీఆర్​ పర్యటన

కేటీఆర్​ పర్యటన: వరంగల్​, హనుమకొండ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్​.. ఇరు జిల్లాల్లో రూ. 193 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. హెలికాప్టర్​లో హనుమకొండ ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానానికి చేరుకున్న కేటీఆర్​కు... ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్​, మహబూబాబాద్ ఎంపీ కవిత.. కేటీఆర్ వెంట హెలికాప్టర్​లో చేరుకున్నారు.

రూ. 20 కోట్ల 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వరంగల్ మహానగర పాలక సంస్థ పరిపాలన భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు. రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన స్మార్ట్ రోడ్డు పనులు, రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కౌన్సిల్ హాల్​, రంగంపేటలో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రూ. 15 కోట్లతో నాలాల నిర్మాణం, పబ్లిక్ గార్డెన్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి కేటీఆర్​ రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

స్మార్ట్​ పనులకు శ్రీకారం: స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ. 71 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, రూ. 8 కోట్లతో మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రం, రూ. 2 కోట్లతో స్పెషల్‌ పార్కు, రూ. 9 కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు, రూ. 1.50 కోట్లతో వరంగల్‌ పోతననగర్​ శ్మశాన వాటిక అభివృద్ధి, రూ. 80 లక్షలతో కేఎంజీ పార్కులో జాతీయ పతాకం, రూ. 4 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్సు పనులు, హనుమకొండలో రూ. 22 కోట్లతో వరదనీటి కాల్వలకు రిటైనింగ్ వాల్స్, రూ. 15 కోట్లతో కల్వర్టులు, ఆర్​అండ్​బీఆర్​ సీసీ రిటైనింగ్ వాల్స్​కు శంకుస్థాపనలు చేశారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు బయలుదేరారు.

బహిరంగ సభలో కేటీఆర్​: నర్సంపేటలో రూ. 43.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్​ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్యాలయంలో రూ. 4.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్​వెజ్ మార్కెట్​కు శంకుస్ధాపన చేశారు. రూ. 50 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ నూతన భవనం రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన మెప్మా నూతన భవనం, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాల్లో రూ. కోటి వ్యయంతో చేపట్టిన మహిళా సమాఖ్య భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. అశోక్ నగర్ వద్ద మెగా కంపెనీ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందుబాటులో వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ప్లాంట్​ను ప్రారంభించారు. అనంతరం నర్సంపేట బైపాస్ రోడ్​లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ ప్రసంగించారు.

"కేంద్రంలో భాజాపా మాటలు తప్ప చేతలు కనిపించట్లేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధిలో ఒక్కో అడుగు ముందుకేసి వెళ్తున్నాం. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి. గతంలో రైతులకు పెట్టుబడి ఇచ్చిన సీఎంలు ఎవరైనా ఉన్నారా.?. రైతుబంధు కింద రైతులకు ఇప్పటికే రూ.50 వేల కోట్లు ఇచ్చాం. రుణమాఫీ పథకానికి దాదాపు రూ.25 వేల కోట్లు కేటాయించాం. కోతలు లేకుండా సాగుకు 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. త్వరలో వ్యవసాయ ఆధార, ఆహారశుద్ధి పరిశ్రమలు తీసుకువస్తాం." -కేటీఆర్​, పురపాలక శాఖ మంత్రి

ప్రజాప్రతినిధులకు షాక్​: కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు.. నిబంధనలనకు విరుద్ధంగా భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. దీనిపై వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. పలువురు నేతలకు అధికారులు జరిమానా విధించారు. ఎలాంటి అనుమతి లేకుండా మంత్రి కేటీఆర్, మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్​తో కూడిన కటౌట్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జీడబ్ల్యూఎంసీ అధికారులు.. మేయర్ గుండు సుధారాణికి రూ.2 లక్షలు, తెరాస నేత కేశవరావుకు రూ.50 వేల జరిమానా విధించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని వరంగల్ బల్దియా అధికారులు ముందుగానే సూచించినా.. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు బేఖాతరు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చదవండి: తల్లీకుమారుడి ఆత్మాహతి కేసు.. సీఐ నాగార్జున గౌడ్ ఎక్కడ..?

'కేజీఎఫ్' థియేటర్​లో..​ కాలు తాకిందని కాల్చేశాడు..

జహంగీర్​పురిలో బుల్​డోజర్లు.. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీం స్టే

Last Updated :Apr 20, 2022, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.