ETV Bharat / state

సత్ఫలితాలిస్తోన్న సంగారెడ్డి సైన్స్‌ మ్యూజియం.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుకు చర్యలు..

author img

By

Published : Apr 28, 2022, 5:11 AM IST

Updated : Apr 28, 2022, 6:27 AM IST

సైన్స్‌... చాలామంది విద్యార్థులకు భయం కలిగించే సబ్జెక్ట్‌. అందులోని ప్రయోగాలు, సిద్ధాంతాలు అర్థంకాక...తలలు పట్టుకుంటారు. అలాంటి వాటిని విద్యార్థులకు కళ్లకు కట్టినట్టు చూపించాలని.... సైన్స్ పట్ల ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా అధికారులు చేసిన ప్రయత్నం..రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. అందులోని విషయాలు ప్రయోగాత్మకంగా తెలుసుకునేలా ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం సత్పలితాలిస్తోంది.

Sangareddy Science Museum is useful to students and  Steps to establish statewide
Sangareddy Science Museum is useful to students and Steps to establish statewide

సత్ఫలితాలిస్తోన్న సంగారెడ్డి సైన్స్‌ మ్యూజియం.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుకు చర్యలు..

విద్యార్థులుకు సైన్స్ సబ్జెక్టుల పట్ల రోజురోజుకూ భయం పెరుగుతోంది. ఫలితంగా సబ్జెక్టుల పట్ల నిరాసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు... ఆరు సంవత్సరాల క్రితం జిల్లా సైన్స్ కేంద్రం పేరుతో ఓ ప్రయత్నం మొదలు పెట్టారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వారి పాఠ్యపుస్తకాల్లో ఉన్న వందలాది ప్రయోగాల నమూనాలు తయారు చేశారు. సైన్స్ కేంద్రానికి వచ్చిన విద్యార్థులే స్వయంగా ప్రయోగాలు చేసి అందులో విషయాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టారు.

సైన్స్ సెంటర్ ప్రయత్నం సత్ఫలితాలివ్వడంతో మరో అడుగు వేశారు. సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. వినోదంతో విజ్ఞానం పంచాలన్న ఉద్దేశంతో నిర్మించారు. బిర్లా సైన్స్ మ్యూజియం సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి సైన్స్ మ్యూజియాన్ని సంగారెడ్డి పట్టణంలో నిర్మించారు. ఇందులో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, అంతరిక్షం, గణితం, ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన ప్రధానమైన 58ప్రయోగాలు ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో సైన్స్ మ్యూజియాలు అందుబాటులో ఉన్నా.. అందులో గణిత విభాగం అరుదుగా కనిపిస్తాయి. కానీ, సంగారెడ్డిలో పది ప్రయోగాలతో వంద సిద్ధాంతాలను వివరించేలా ప్రత్యేకంగా గణిత విభాగం ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో వచ్చే మొక్కలతో బోటానికల్ గార్డెన్ తీర్జిదిద్దారు. మ్యూజియంను సందర్శించిన తర్వాత విద్యార్థులు సైన్స్ కు సంబంధించిన విడియోలు చూడటానికి ప్రత్యేకంగా మిని థియేటర్ను రూపొందించారు.

పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రధాన ప్రయోగాలు, సిద్ధాంతాలను విద్యార్థులకు కళ్లకు కట్టేలా ఈ మ్యూజియం నిర్మించారు. సైన్స్ ఫేయిర్, సైన్స్ కాంగ్రెస్, మానక్ ఇన్ స్పైర్ వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గోనేలా ఈ మ్యూజియం ప్రోత్సహిస్తుంది. మ్యూజియం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా ఉందని తల్లిదండ్రులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి మ్యూజియంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే సిద్దిపేటలో చర్యలు ప్రారంభం కాగా.. పలు జిల్లాల నుంచి బృందాలు ఇక్కడికి వచ్చి సమాచారం సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated :Apr 28, 2022, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.