ETV Bharat / state

'ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక'

author img

By

Published : Apr 2, 2022, 10:38 AM IST

Updated : Apr 2, 2022, 12:11 PM IST

Vice President Venkaiah naidu : మన సంస్కృతి, వారసత్వం చాలా గొప్పదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక అని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్​ ట్రస్టులో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక: ఉపరాష్ట్రపతి
ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక: ఉపరాష్ట్రపతి

Vice President Venkaiah naidu : ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ శుభకృత్‌ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ అనేది వసంత ఋతువు ఆగమనానికి నిదర్శమని.. సమానత్వానికి సంకేతమన్నారు.

Ugadi at Swarna Bharat Trust : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్​ ట్రస్టులో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కామినేని శ్రీనివాస్‌, చిగురుపాటి ఉమాదేవి హాజరయ్యారు. ఓయూ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సాగి కమలాకరశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఉగాదిలో ప్రాచీనమైన సాంప్రదాయాలు కూడా దాగి ఉన్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. ఉగాది రోజున చేసుకునే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలకు ప్రతీక అని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలని ఇది సూచిస్తుందని చెప్పారు.

Venkaiah naidu About Ugadi : "కాలాన్ని గౌరవించి.. ప్రకృతిని రక్షించుకోవడమే ఉగాది సందేశం. భిన్నత్వంలో ఏకత్వం చాటే సంస్కృతికి ఉగాది ప్రతీక. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశమే.. వ్యక్తిత్వ వికాస పాఠం. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం విజ్ఞులకు తగదు. మనవైన వేషభాషలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలి. ఆచరణ సాధ్యం కాని విద్య వల్ల ప్రయోజనం లేదు. ఉన్నతమైన కలలు, ఆచరణ, చేతల్లో చిత్తశుద్ధే.. విజయ రహస్యం. మన సంస్కృతి, వారసత్వం గొప్పది. భారతదేశ ఎదుగుదల చూసి పాశ్చాత్య దేశాలకు అసూయ కలుగుతోంది. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వార్తలపై జాగ్రత్తగా ఉండాలి. వేటికి ప్రాధాన్యం ఇస్తున్నామో మీడియా ఆలోచించాలి. చట్టసభల్లో సభ్యుల వ్యాఖ్యలు హుందాగా ఉండాలి. సాంఘిక వివక్ష పాటించకూడదని అందరూ ప్రతిజ్ఞ చేయాలి. కులం కంటే గుణం మిన్న.. అనేదాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి."

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

మన ఉనికి కాపాడుకునేందుకు ఎల్లవేళలా ప్రయత్నించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇంట్లో, వీధిలో, బడిలో, గుడిలో మాతృభాషలోనే మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలని వెంకయ్య పేర్కొన్నారు. అమ్మభాష రాకుంటే అంతకు మించిన దారుణం మరొకటి లేదన్నారు. సంప్రదాయ దుస్తులు, భోజనం.. పెద్దలు మనకిచ్చిన ఆస్తి అన్న ఉపరాష్ట్రపతి.. వాతావరణానికి అనుకూలంగా దుస్తులు వేసుకోవాలని, ఆహారం తీసుకోవాలని సూచించారు.

ఉగాది పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీక : ఉపరాష్ట్రపతి
Last Updated :Apr 2, 2022, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.