Yellur pump house No Repairs For Motors: ఉమ్మడి పాలమూరు జిల్లా జలప్రదాయని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొదటిదైన ఎల్లూరు పంపుహౌస్ మునిగి రెండేళ్లు గడుస్తున్నా నేటికి దెబ్బతిన్న మోటార్లకు మరమ్మతులు పూర్తి కాలేదు. ఎల్లూరు పంపుహౌస్లో ఐదు మోటార్లుంటే అందులో 1, 2, 4వ మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన3, 5వమోటార్లు పనిచేయడం లేదు. రెండేళ్ల కిందట పంపుహౌస్ ముంపునకు గురికాగా 3వ మోటారు పూర్తిగా దెబ్బతినగా ఐదోవది సాంకేతిక సమస్యలతో పనిచేయడం లేదు.
శ్రీశైలం వెనక జలాల నుంచి ఎల్జీకేఎల్ఐ పథకానికి నీళ్లెత్తి పోసే మొదటి పంపుహౌస్ ఎల్లూరే. ఇక్కడి మోటార్లను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే శ్రీశైలంలో వెనుక జలాలున్నప్పుడు వాటిని ఎత్తిపోసుకోగలం. నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోని రైతుల భూములకు సాగునీరు, ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి జిల్లాకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందాలంటే ఎల్లూరు లిఫ్ట్లో పంపులు సక్రమంగా పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది.
ఎల్లూరు పంపుహౌస్ ద్వారా 2012 నుంచి సాగునీరు అందిస్తున్నారు. 2014 అక్టోబరులో సాంకేతిక కారణాలతో పంపుహౌస్ నీటమునగ్గా మరమ్మతులు చేసి 5మోటార్లు వినియోగంలోకి తెచ్చారు. ఆతర్వాత 2019 అక్టోబరు 19న మరోసారి నీటమునిగ్గా మరమ్మతులు చేసి 1, 2, 4వ మోటార్లును వినియోగంలోకి తెచ్చారు. పూర్తిగా దెబ్బతిన్న 3వ మోటారు మరమ్మత్తుల కోసం రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.16 కోట్లు కేటాయించింది.
ఈమేరకు బీహెచ్ఈఎల్కి పనుల బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం 3వ మోటారు విడిభాగాలు విడదీసి పంపుహౌస్ పైకి తరలించారు. సామాగ్రి తెప్పించినా మరమ్మతులు పూర్తికాలేదు. వచ్చే వేసవిలో 5వ మోటారు రిపేర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. సాగు, తాగునీటికి ఇబ్బందిరాకుండా ఎత్తిపోతలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. శ్రీశైలం వెనకజలాల్లో నీటినిల్వ అధికంగా ఉన్నప్పుడే మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకానికి నీటిని తోడి పోసుకోగలం. 5 మోటార్లు పనిచేస్తే వీలైనంత ఎక్కువగా తోడుకోగలం. సాధ్యమైనంత త్వరగా మరమ్మత్తులు పూర్తిచేస్తామన్న అధికారులు.. రెండేళ్లు గడిచినా వినియోగంలోకి తీసుకురాకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: రసవత్తరంగా మునుగోడు పోరు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు
కేదార్నాథ్లో మోదీ ప్రత్యేక పూజలు.. రూ.3400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన