ETV Bharat / state

TRS on Bayyaram Steel Plant : 'ఫ్యాక్టరీ తెస్తే దండేసి దండంపెడతాం'

author img

By

Published : Feb 22, 2022, 5:31 PM IST

Updated : Feb 22, 2022, 10:50 PM IST

TRS on Bayyaram Steel Plant : విభజన హామీల అమలు విషయంలో భాజపా, అధికార తెరాస మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బయ్యారం ఉక్కుకర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై తెరాస లోక్​సభపక్ష నేత నామ నాగేశ్వరరావు మండిపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా విభజనచట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కుకర్మాగారం హామీ నుంచి కేంద్రం తప్పించుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆక్షేపించారు.

TRS on Bayyaram Steel Plant
TRS on Bayyaram Steel Plant

'ఫ్యాక్టరీ తెస్తే దండేసి దండంపెడతాం'

TRS on Bayyaram Steel Plant : తెలంగాణపై భాజపాకి కక్ష ఉన్నందునే అభివృద్ధికి సహకారం అందించడంలేదని తెరాస ఎంపీలు ఆరోపించారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను సైతం కేంద్రం అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, మాలోత్ కవిత, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు.

ఫ్యాక్టరీ తెస్తే దండేసి దండంపెడతాం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కు పరిశ్రమ తెచ్చి ఆ క్రెడిట్‌ను మీరే తీసుకోవాలని నామ నాగేశ్వర్‌రావు అన్నారు. తెలంగాణకు బయ్యారం ఫ్యాక్టరీ తెస్తే దండేసి దండంపెడతామన్నారు. బయ్యారం ఉక్కు అంశంపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను రాబోయే పార్లమెంట్‌లో లెవనెత్తుతామని నామ వెల్లడించారు. కేంద్రం వద్ద ఉన్న అధికారాలు రాష్ట్రానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తుందన్నారు. చట్టం మార్పులు చేసి కొత్త యాక్టు తీసుకువచ్చి రాష్ట్రాలకు హక్కులివ్వాలని డిమాండ్ చేశారు.

'పథకాల అమలులో తెలంగాణపట్ల కేంద్రం వివక్ష చూపుతోంది. రాష్ట్రంలో మిషన్‌ భగీరథ కింద ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నాం. రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీకొట్టి హర్‌ఘర్‌ జల్‌ ప్రవేశ పెట్టింది. ఇంటింటికీ నీటి పథకం కింద కేంద్రం నుంచి 50 శాతం నిధులు రావాలి. నీతిఆయోగ్‌ సిఫార్సు చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదు. మిగతా రాష్ట్రాలకు మాత్రం కేంద్రం నిధులు ఇస్తోంది.' - నామ నాగేశ్వరరావు, తెరాస లోక్​సభ పక్షనేత

కేంద్రానికి అన్ని రకాలుగా సహకరిస్తాం

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రం కోసం ఎందుకు కొట్లాడడంలేదని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ ఇక్కడ పెడితే అన్ని రకాలుగా కేంద్రానికి సహకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాణ్యమైన ఐరన్‌ఓర్‌ లభించకపోతే ఛత్తీస్‌గఢ్‌ నుంచి సరఫరా చేయాలని కోరినట్లు తెలిపారు. ఐరన్‌ఓర్‌ రవాణా ఖర్చులు భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని వివరించారు. ఖర్చులు భరిస్తామని కేంద్రానికి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ లేఖలు రాశారని వెల్లడించారు. పైప్‌లైన్‌ ద్వారా ముడి ఇనుము సరఫరా చేసినా ఖర్చు భరిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కొట్టిపారేశారని మండిపడ్డారు.

వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి

విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎంపీ మాలోత్ కవిత్ పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు- తెలంగాణ హక్కని అన్నారు. రాష్ట్రానికి సహకరించని భాజపా నేతలు తెలంగాణలో తిరిగితే ప్రజలు ఒప్పుకోరని తెలిపారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : 'బయ్యారంపై కేంద్రానిది తుక్కు సంకల్పం'

Last Updated : Feb 22, 2022, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.