ETV Bharat / state

Huzurabad Bypoll Results: భాజపా-తెరాస హోరాహోరీ పోరులో.. వికసించిన కమలం

author img

By

Published : Nov 3, 2021, 4:50 AM IST

Huzurabad Bypoll Results: భాజపా-తెరాస హోరాహోరీ పోరులో.. వికసించిన కమలం
Huzurabad Bypoll Results: భాజపా-తెరాస హోరాహోరీ పోరులో.. వికసించిన కమలం

తెరాసకు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఉపఎన్నికల కంటే.. హుజురాబాద్ పోరు (HUZURABAD BYPOLL) చాలా ప్రత్యేకం. హుజురాబాద్ ఉపఎన్నికను తెరాస సవాల్‌గా తీసుకుంది. ఈటల వంటి సీనియర్‌ నేతను ఓడించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తమకు ఎదురులేదని నిరూపించాలని గులాబీ దళం ఉవ్విళ్లూరింది. కమల దళం సైతం హుజురాబాద్ గెలుపు.. అధికార మార్పునకు మలుపు అనే నినాదంతో పనిచేసింది. తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న భాజపా .. తెరాసను హుజురాబాద్ గడ్డపై ఓడించి గట్టి సందేశం ఇవ్వాలని సంకల్పించింది. గెలుపును రెండు పార్టీలు సవాల్‌గా తీసుకుని పోరాడాయి.

ఈటల రాజేందర్‌ (ETELA RAJENDHAR) బలమైన అభ్యర్థి. అందులోనూ సిట్టింగ్‌ స్థానం. ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం. రెండుసార్లు మంత్రిగా సేవలు. అలాంటి అభ్యర్థిని ఢీకొట్టడం అంటే అంత సులువుకాదు. అందులోనూ రాష్ట్రంలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న భాజపాకు అందివచ్చిన అస్త్రంగా మారారు. ఈ పరిణామాలన్నీ అంచనా వేసిన గులాబీ దళం. ఈటలకు ఎలాగైనా చెక్‌పెట్టాలని శాయశక్తులా ప్రయత్నించింది. భాజపా సైతం ఈటల వంటి నేత ఓటమి పాలైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించింది. ఈటల విజయం కోసం అలుపెరగని పోరాటం చేసింది.

ఫలించని 'దళితబంధు' వ్యూహాం

దళితబంధు పథకం హుజురాబాద్ ఉపఎన్నిక (HUZURABAD BYPOLL) నేపథ్యంలో ప్రధానంగా తెరపైకి వచ్చింది. దళితులకు 10 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. హుజూరాబాద్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇక్కడ పథకం అమలు చేసి తర్వాత రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపింది. కొందరు లబ్ధిదారులకు యూనిట్లను అందజేసింది. ఉపఎన్నిక కోసమే దళితబంధు పథకం తెరపైకి తెచ్చారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ ఆరోపణలను ఖండిస్తూ మరో నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని పథకం అమలు చేస్తామని సర్కార్‌ ప్రకటించింది. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోనూ అమలుకు శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ గెలుపోటములతో సంబంధం లేకుండా పథకం అమలు కొనసాగిస్తామంది. దళితులతోపాటు ఇతర వర్గాలకూ పథకం అమలు చేయాలనే డిమాండ్లు తెరపైకి రాగా క్రమంగా విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.

హోరాహోరీ ప్రచారం...

దళిత బంధు పథకం అమలు నిలిపివేత తెరాస-భాజపా మధ్య విమర్శలకు తావిచ్చేలా చేశాయి. ఎన్నికల సంఘానికి భాజపా నేతలు లేఖలు రాశారని గులాబీ దళం ఆరోపించగా.. అవి నకిలీవంటూ కమలనాథులు తిప్పికొట్టారు. ఈసీ తీరును స్వయంగా ముఖ్యమంత్రి తప్పుపట్టారు. ఎన్నికల ప్రచారం విషయంలోనూ అడ్డుపడుతోందని ప్లీనరీ వేదికగా ఆరోపించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్నారు. నియోజకవర్గం ఆవల సభ నిర్వహించకుండా చేయడం సరికాదన్నారు. బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సభకు అనుమతిచ్చి సీఎం సభ నిర్వహించకూడదని చెప్పడాన్ని ముఖ్యమంత్రి తప్పుపట్టారు. తాను ప్లీనరీ వేదికగా చేస్తున్న ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని దీన్ని ఎలా అడ్డుకోగలరని ప్రశ్నించారు.

ఎన్నో విమర్శలు..

దుబ్బాక ఫలితాలను ప్రస్తావిస్తూ అక్కడ రఘునందన్‌ గెలిచినా ఏం చేయలేకపోతున్నారని.. అధికార పార్టీ అభ్యర్థినే గెలిపించాలని తెరాస బలంగా ప్రచారం చేసింది. హుజూర్‌నగర్‌లో జానారెడ్డి వంటి సీనియర్‌ నేతకు ఓటమి తప్పలేదని గుర్తుచేసింది. ఏడేళ్లు మంత్రి పదవిలో ఉండీ ఏమీ చేయని ఈటల .. ఇప్పుడు గెలిచినా ప్రయోజనం లేదని గళమెత్తారు. కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. కనీసం విభజన హామీలు నెరవేర్చలేదని ఎండగట్టారు. రాష్ట్రం నుంచి వెళ్తున్న పన్నుల్లో సగం కూడా తిరిగి దక్కడం లేదని ప్రచారం నిర్వహించారు. ఓవైపు ఎన్నికను సవాల్‌గా తీసుకుంటూనే మరోవైపు తమకు అంత ప్రాధాన్యమైన అంశం కాదని కేటీఆర్ వంటి నేతలు చిట్‌చాట్‌లో ప్రకటిస్తూ వచ్చారు.

తెరాస వరాలు గుప్పించినా.. దక్కని ఫలితం

గెలుపు బాధ్యతలు భుజానికెత్తుకున్న ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు.. తెరాస ప్లీనరీకి సైతం హాజరుకాలేదు. నియోజకవర్గంలోనే మకాంవేసి ఓటర్ల నాడి పట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. నియోజకవర్గ అభివృద్ధికి వరాలు గుప్పించారు. కులాలు, సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించి ఓటర్లు చేజారకుండా జాగ్రత్తపడ్డారు. హరీశ్‌ ప్రచార తీరును ఈటల తీవ్రంగా తప్పుపట్టారు. పింఛను తదితర లబ్ధిదారులను బెదిరించారని ఆరోపించారు. ఏదేమైనా ఈటల రాజేందర్‌ వంటి సీనియర్‌ను భారీ మెజార్టీతో గెలవకుండా చేయడంలో తెరాస, హరీశ్‌రావు సఫలమయ్యారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇదీ చూడండి: Etela Rajender leads : ఉపపోరులో ఈటల జోరు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.