ETV Bharat / state

కామారెడ్డిలో నీటి సమస్య... పైపులైన్ల పగుళ్లతో అవస్థలు

author img

By

Published : Jan 31, 2021, 7:25 PM IST

కామారెడ్డి బల్దియాలో ఇంటింటికి మంచినీరు అందక ప్రజల గొంతెండుతోంది. 30 ఏళ్ల జనాభాను ఉద్దేశించి అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూగా పగిలిపోతున్న పైపులైన్లు ఈ పరిస్థితికి కారణం అవుతున్నట్లు ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ పరిశీలనలో తేలింది.

కామారెడ్డిలో నీటి సమస్య... పైపులైన్ల పగుళ్లతో అవస్థలు
కామారెడ్డిలో నీటి సమస్య... పైపులైన్ల పగుళ్లతో అవస్థలు

ఏటా ఇదే పరిస్థితి

గోదావరి జలాల పంపిణీ అంతా అస్తవ్యస్తంగా మారింది. వారం రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. అధికారులను అడిగితే పైప్‌లైన్లు పగిలినవి ఏం చేయాలంటూ సమాధానమిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. ఇంటింటికి మిషన్‌ భగీరథ జలాలు పంపిణీ కార్యరూపం దాల్చలేదు. - బాలయ్య, గోదాంరోడ్డు

ఎనిమిది రోజులకోసారి

ఎనిమిది రోజులకోసారి నీళ్లొస్తున్నాయి. ఇప్పుడే ఇట్లా ఉంటే వేసవిలో ఎలా ఉంటుందో. రోజూ నీటిని సరఫరా చేసేలా అధికారులు, పాలకవర్గ ప్రతినిధులు ఏర్పాట్లు చేయాలి. బోరుబావులు తవ్వి ఇస్తామంటున్నారు ఇప్పటి వరకు ఏం చేయడం లేదు. - సత్తమ్మ, బతుకమ్మకుంట

కామారెడ్డి జిల్లా కేంద్రానికి 86 కి.మీ దూరంలో ఉన్న శ్రీరాంసాగర్‌ జలాశయం నుంచి నీటి సరఫరా అవుతోంది. అక్కడ నుంచి గోదావరి జలాలు జలాల్‌పూర్‌ మీదుగా అర్గుల్‌, ఇందల్‌వాయి పంప్‌హౌస్‌ల ద్వారా మల్లన్నగుట్టకు చేరుతాయి. ఇందుకు సంబంధించి 2006లో వేసిన పైపులైన్ల అమరిక నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల తరుచూ పగిలిపోతున్నాయి. నీటి సరఫరాకు ఆటంకాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా అర్గుల్‌ నుంచి ఇందల్వాయి పంప్‌హౌస్‌ వరకు మధ్యలో 27 కి.మీ వద్ద పైపుల్లో ఈ సమస్య నెలకొంటుంది. పైపులైన్ల సామర్థ్యం తట్టుకోవడం లేదన్న ఉద్దేశంతో ప్రధాన పంప్‌హౌస్‌ నుంచి తక్కువ నీటిని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా కొన్ని కాలనీల్లో అరకొరగా, శివారు కాలనీల్లో మూడు, నాలుగు రోజులకోసారి సరఫరా అవుతున్నాయి.

ఇక్కడి నుంచే కామారెడ్డి పట్టణానికి

● మల్లన్నగుట్ట వద్ద నిత్యం 70 ఎం.ఎల్‌.డీ నీటిని శుద్ధిచేసేలా రెండు పంప్‌హౌస్‌లు నిర్మించారు.

● 40 ఎం.ఎల్‌.డీ సామర్థ్యం ఉన్న పంప్‌హౌస్‌ నుంచి శుద్ధిచేసిన జలాలు 320 గ్రామాలకు పంపిణీ చేస్తున్నారు.

● 30 ఎం.ఎల్‌.డీ సామర్థ్యం ఉన్న పంప్‌హౌస్‌ నుంచి పట్టణంలోని శుద్ధజల కేంద్రానికి రోజుకు 10 ఎం.ఎల్‌.డీ జలాలు సరఫరా చేయాల్సి ఉన్నా కేవలం 4.6 ఎం.ఎల్‌.డీలు సరఫరా చేస్తున్నారు. పైపులైన్లు పగలడంతో జనవరిలో పది రోజులపాటు నిలిపివేశారు.

తాత్కాలిక చర్యలతో సరి

● నీటి ఎద్దడి నివారణకు పురపాలక శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సింది పోయి తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు. ఫలితంగా పట్టణంలో నీటి సమస్య పరిష్కారం కావడం లేదు.

● ఈ వేసవిలోనూ మరో 34 బోరుబావుల తవ్వకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సరఫరా సవ్యంగా సాగేలా.. శుద్ధజల కేంద్రానికి నీటి కేటాయింపులు పెంపొందించే చర్యలు చేపట్టాలి. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి.

ప్రధాన నీటి వనరు లేకనే

ఇంటింటికి భగీరథ జలాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. పైప్‌లైన్లు పగలడంతో అంతరాయం కలుగుతోంది. అలాగే నిర్దేశించిన మేర భగీరథ జలాలను గ్రిడ్‌ అధికారులు పంపిణీ చేయలేకపోతున్నారు. పట్టణంలో ప్రధాన నీటి వనరు లేకపోవడం సమస్యగా మారింది.వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. - వాసుదేవరెడ్డి, ఎంఈ, పురపాలక శాఖ, కామారెడ్డి

తక్షణ మరమ్మతులు చేపట్టాం

శ్రీరాంసాగర్‌ నుంచి గోదావరి జలాలు తరలించే పైప్‌లైన్లు పగిలిపోతుండడం సమస్యగా మారింది. వాటి స్థానంలో కొత్తవి అమర్చుతున్నాం. పంపిణీ సవ్యంగా సాగేలా చర్యలు చేపట్టాం. - నరేష్‌, ఈఈ, గ్రిడ్‌, మిషన్‌ భగీరథ

ఇదీ చదవండి: 'తెలంగాణకు వరద సాయంలో కిషన్​రెడ్డిది కీలకపాత్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.