ETV Bharat / state

అయ్యన్నకు ఊరట.. రిమాండ్​ను తిరస్కరించిన కోర్టు

author img

By

Published : Nov 3, 2022, 7:27 PM IST

AYYANNA ARREST UPDATES: ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ ఏపీలో అరెస్టు కాబడిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్నపాత్రుడికి కోర్టులో ఊరట లభించింది. ఆయనకు రిమాండ్ విధించాలన్న సీఐడీ విజ్ఞప్తిని విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో 467 సెక్షన్‌ వర్తించదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ayyanna
ayyanna

AYYANNA ARREST UPDATES: ఆంధ్రప్రదేశ్​లో తెదేపా నేత అయ్యన్న పాత్రుడికి విశాఖ కోర్టులో ఊరట లభించింది. తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడు రాజేశ్​లను సీఐడీ పోలీసులు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. అయ్యన్నపాత్రుడి రిమాండ్‌ను తిరస్కరించింది. ఈ కేసులో 467 సెక్షన్‌ వర్తించదని స్పష్టం చేసింది. 41ఏ నోటీసు ఇచ్చి ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఆదేశాలిచ్చింది.

సింహాచలం ఆసుపత్రిలో వైద్యపరీక్షలు : ఇంటి గోడ కూల్చివేత ఘటనలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ సీఐడీ పోలీసులు అరెస్ట్​ చేసిన తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడు రాజేశ్​లను విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే అయ్యన్న తరఫు న్యాయవాదులకు సీఐడీ అధికారులు రిమాండ్‌ రిపోర్టు ఇచ్చారు. కోర్టులో హాజరుపరిచేముందు వారిద్దరిని సింహాచలం ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.

సుమారు 20 నిమిషాల పాటు ప్రభుత్వ వైద్యాధికారి భాస్కరరావు పరీక్షలు చేశారు. అయ్యన్న ఒత్తిడికి లోనవుతున్నారని.. బీపీతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. మరోవైపు కోర్టు దగ్గరకు తెదేపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తమను కోర్టు ప్రాంగణంలోకి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. కోర్టు ప్రాంగణం బయట రహదారిపై ధర్నా చేపట్టారు.

అసలేం జరిగిందంటే: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున పెద్దసంఖ్యలో అయ్యన్న ఇంటికి వెళ్లిన పోలీసులు, ఆయనతోపాటు చిన్న కుమారుడు రాజేశ్​నూ అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడిని ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

దుస్తులు మార్చుకుని వస్తానని, అయ్యన్నపాత్రుడు చెప్పినా సీఐడీ పోలీసులు దానికి అంగీకరించలేదు. అక్కడే మార్చుకోవాలని స్పష్టం చేశారు. మెడిసిన్ తెచ్చుకుంటానని చెప్పినప్పటికీ ఆయన్ను ఇంటి లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తమతో రావాలని బలవంతపెట్టారు. ఈ సమయంలో అయ్యన్న కుటుంబసభ్యులతోపాటు స్థానికులు.. పోలీసుల్ని ప్రతిఘటించారు. దీంతో స్థానికుల సెల్ ఫోన్లను పోలీసులు లాక్కున్నారు.

ఆయ్యన్నతోపాటు.. ఆయన చిన్న కుమారుడు చింతకాయల రాజేశ్​ను కూడా అరెస్టు చేశారు. కుటుంబసభ్యులకు వారిద్దరి అరెస్టు సమాచారం ఇచ్చిన పోలీసులు.. వారిని ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఏలూరు సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్తామని చెప్పి సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడు, రాజేశ్​ని విశాఖ సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. చివరకు విశాఖ సీఐడీ కార్యాలయానికి తరలించామని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.