ETV Bharat / state

గ్రేటర్‌పై వైరల్‌ పంజా.. ఆసుపత్రులకు క్యూకడుతున్న రోగులు..

author img

By

Published : Jul 7, 2022, 7:00 AM IST

హైదరాబాద్​పై వైరల్​ జ్వరాలు పంజా విసురుతున్నాయి. మారిన వాతావరణంతో చిన్నారులు,పెద్దలు జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బయట రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.

మారిన వాతావరణం.. గ్రేటర్‌పై వైరల్‌ పంజా..!
మారిన వాతావరణం.. గ్రేటర్‌పై వైరల్‌ పంజా..!

మారిన వాతావరణంతో గ్రేటర్‌పై వైరల్‌ జ్వరాలు పంజా విసురుతున్నాయి. చిన్న, పెద్ద జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షం, చల్లటి గాలులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బయట రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో గత రెండు రోజులుగా ఓపీ సంఖ్య 2 వేలు దాటుతోంది. నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి సాధారణ రోజుల్లో 200-300 రోగులు వస్తే.. ప్రస్తుతం 500 దాటుతోంది. ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి వేగంగా వైరల్‌ జ్వరాలు సోకుతున్నాయి. రోగుల్లో 70-80 శాతం మంది ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, తుమ్ములు, దగ్గు, కళ్ల వెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు, జ్వరం తదితర లక్షణాలతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు.

తేడా గుర్తించాలి..

* వానాకాలంలో వైరల్‌ ఫీవర్లతోపాటు డెంగీ, మలేరియా జ్వరాలు పొంచి ఉంటాయి. ఇంటి చుట్టూ, రోడ్లపై వాన నీరు నిల్వ ఉండటం.. మురుగు కాల్వలు పొంగి, డెంగీ, మలేరియా కారక దోమలు పెరగటానికి దోహదపడతాయి.

* పసి పిల్లలు, వృద్ధులు, మధుమేహం బాధితులు, గర్భిణులు, గుండె జబ్బులున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ. వీరు త్వరగా వైరల్‌ జ్వరాల బారిన పడే ప్రమాదం ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

* వైరల్‌ జ్వరాల్లో తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు నుంచి నీళ్లు కారడం, తీవ్ర బడలిక, పిల్లల్లో నీళ్ల విరోచనాలు, వాంతులు అవుతాయి. కొందరిలో ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. 3-4 రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయి.

* జ్వరంగా తీవ్రంగా ఉంటే డెంగీ లేదా మలేరియాగా అనుమానించి వైద్యులను సంప్రదించాలి. డెంగీలో ఒంటిపై దద్దుర్లు రావడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కళ్ల వెనకాల నొప్పి ఉంటుంది.

* చలితో కూడిన తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు ఉంటే మలేరియా లక్షణాలుగా గుర్తించాలి. తక్షణం రక్తపరీక్షలు చేయించుకోవాలి.

* కొందరిలో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు కన్పిస్తాయి. తీవ్రమైన నీరసం, బడలిక, ఏమీ తినలేకపోవడం.. వాంతులు, వికారం తదితర లక్షణాలు ఉంటాయి. జ్వరం 3-4 రోజులు పైన కొనసాగడం.. తీవ్ర నీరసం లాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* కరోనాలోనూ వైరల్‌ లక్షణాలే కన్పిస్తాయి. శ్వాసకోశ ఇబ్బందులైన దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం తదితర లక్షణాలుంటాయి. ఒకట్రెండు రోజులపాటు 101-102 డిగ్రీల జ్వరం వస్తుంది. కరోనా పరీక్షల చేయించుకొని చికిత్స పొందాలి.

ఇవీ చూడండి..

'కలిసికట్టుగా పోరాడదాం..' వైరలవుతోన్న రైతుబిడ్డ వీడియో సందేశం..

నత్తనడకన ప్రాంతీయ రింగు రోడ్డు పనులు.. అదే కారణమా?

58 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన ఎమ్మెల్యే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.