ETV Bharat / state

Portraits with Millets : చిరుధాన్యాలతో జీవం ఉట్టిపడే అందమైన చిత్రాలు

author img

By

Published : Jun 19, 2023, 11:23 AM IST

Updated : Jun 19, 2023, 1:35 PM IST

Vijayakumar Portraits with Millets in G20 Meeting : ఆయన సంప్రదాయ చిరుధాన్యాలతో అపురూప చిత్రాలు అద్భుతంగా సృష్టిస్తున్నారు. వృత్తి రీత్యా రైల్వేలో ఉద్యోగి. ప్రవృత్తి రీత్యా కళాకారుడైన ఆయన ప్రతిభా, పాటవాలకు దేశ, విదేశీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా జరిగిన జీ-20 సభ్య దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాల్లో తన చిత్రాలు అరుదైన గుర్తింపు పొందాయి. జీవం ఉట్టిపడే అందమైన చిత్రాలు చిరుధాన్యాలతో రూపొందించినవి.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ సహా జీ-20 సభ్య దేశాల వ్యవసాయ మంత్రులకు స్వయంగా అందజేయడం విశేషం.

VijayaKumar Portrait painting News
VijayaKumar Portrait painting News

చిరుధాన్యాలతో జీవం ఉట్టిపడే అందమైన చిత్రాలు

Vijayakumar Portraits received recognition at G20 : విశ్వనగరం హైదరాబాద్ వేదికగా విజయవంతంగా జరిగిన జీ-20 సభ్య దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాల్లో చిరుధాన్యాల సాగు, వినియోగం, వ్యాప్తిపై విస్తృత చర్చ సాగింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంకు చెందిన చిత్రకారుడు మోకా విజయకుమార్‌ వినూత్న రీతిలో ఆలోచించారు. తన సృజనకు పదను పెట్టి చిరుధాన్యాలతో అద్దిన చిత్రాలను అతిధులకు అందజేశారు.

Special Story On Vijayakumar Portrait Painting : తన కళకు ఓ ప్రత్యేకత ఉండాలన్న లక్ష్యంతో తన చేతుల నుంచి జాలువారిన చిరుధాన్యాలు అద్ది అద్భుతంగా తీర్చిదిద్దిన కళాఖండాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర సహాయ మంత్రులు కైలాష్‌చౌదరి, శోభ కరంద్లాజేకు స్వయంగా అందజేశారు. భారత్ ఆహ్వానం మేరకు జీ-20 సదస్సుకు హాజరైన పలు దేశాల వ్యవసాయ మంత్రులకు తన వేసిన చిరుధాన్యాల చిత్ర పటాలు అందజేశారు. ఆ చిత్ర పటాలు స్వీకరించిన తోమర్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మొత్తం 35 మంది ప్రతినిధులు అబ్బురపడ్డారు. విజయకుమార్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. సమకాలీన, వర్తమాన అంశాలపై చిత్రాలు గీసే తాను ఎంచుకున్న చిరుధాన్యాలతో రూపొందించిన చిత్ర పటాలు ప్రపంచ ప్రముఖులకు అంజేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

Vijayakumar Paintings in G20 Meeting : సహజ సిద్ధంగా వృత్తి రీత్యా విశాఖపట్నంలో రైల్వే శాఖలో గ్రేడ్-1 పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న విజయకుమార్.. ప్రవృత్తి రీత్యా కళాకారుడు. పోర్ట్రెయిట్ అనేది పెయింటింగ్‌లో ఒక అద్భుతమైన శైలి కావడంతో అది అందిపుచ్చుకుని 2017 నుంచి తానా వంటి సంస్థల ఆహ్వానం మేరకు ఏటా అమెరికాలో ఓ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. 2018 మే మాసంలో అట్లాంటాలో ఓ ఆర్ట్ ఈవెంట్ ద్వారా 200 మంది చిన్నారులకు చిత్ర కళపై శిక్షణ ఇచ్చారు.

Vijayakumar Painting CM KCR and KTR with small grains : 2000 మేలో కాపిటల్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు సొసైటీ నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ.. కరోనా మహమ్మారి వల్ల వెళ్లలేకపోయారు. 2022లో న్యూజెర్సీలో తొలిసారిగా తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ ఆహ్వానం మేరకు వెళ్లి నిర్వహించిన పోర్ట్రెయిట్ పెయింటింగ్ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో విశాఖ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో దిగ్గజ కంపెనీలైన రిలయెన్స్, అదానీ, గూగుల్, విప్రో, యాపిల్, గోద్రెజ్, మహింద్రా, మైక్రోసాఫ్ట్‌, టాటా తదితర 12 కంపెనీల సీఈఓల చిత్ర పటాలు చిరుధాన్యాలు అద్ది రూపొందించినవి ప్రదర్శించారు. తన భర్త విజయకుమార్‌ను చూసి ఆయన సతీమణి సునీత కూడా తన వంతు సహకారం అందిస్తూ వస్తుంది. తాను కూడా కళకారిణిగా రాణిస్తూ విశాఖలో ఆర్ట్స్ స్కూల్ నిర్వహిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలు కూడా చిరుధాన్యాలతో అద్ది అందంగా రూపొందించినవి సమయం ఇస్తే స్వయంగా కలిసి ఇవ్వాలని చూస్తున్నామని సునీత తెలిపారు.

VijayaKumar Portrait painting News : ప్రతి వేసవి సెలవు దినాల్లో పలు సంస్థల ఆహ్వానం మేరకు భారతీయ-అమెరికా పిల్లలకు ఆన్‌లైన్‌లో పెయింట్ క్లాసులు తీసుకుంటున్న విజయకుమార్.. ప్రధాని నరేంద్రమోదీ చిత్ర పటం కూడా చిరుధాన్యాలతోనే తీర్చిదిద్దారు. ఆ పోర్ట్రెయిట్ పెయింటింగ్స్ కోసం ఐదు రకాల షేడ్స్ ఎంచుకున్నారు. తన కొత్త కొత్త ఊహలు, ఆలోచనలకు ప్రాణం పోసేందుకు నాణ్యమైన ఊదలు, సామలు, అరికలు, రాగులు, కొర్రలు ఉపయోగించారు. తద్వారా ప్రధానిసహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల చిత్రాలు కూడా రూపొందించారు.

"మిల్లెట్స్​తో పోర్ట్రెయిట్ చేయడానికి వాటిలో ఉండే కలర్స్​నే ఒక ఐదు కలర్స్ తీసుకున్నాను. వాటినే షేడ్స్​లాగా చూపిస్తూ.. పోర్ట్రెయిట్ ఆకారంలో ఉండే ఫేస్​ని క్రియేట్ చేసి దాని మీద మిల్లెట్స్ అంటించి చేశాను. చిరుధాన్యాలతో రూపొందించిన చిత్ర పటాలు ప్రపంచ ప్రముఖులకు అంజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది". -మోకా విజయకుమార్, పోర్ట్రెయిట్ పెయింటింగ్ కళాకారుడు

పాన్ ఇండియా కధానాయకులు అల్లుఅర్జున్, రాంచరణ్‌, ప్రఖ్యాత అగ్రదర్శకులు ఎస్‌ఎస్ రాజమౌళి, వీవీవీ వినాయక్ వంటి ప్రముఖులకు కూడా తాను గీసిన చిత్రాలు అందజేశారు. హీరో అల్లుఅర్జున్ తన పిల్లల చిత్రాలు చూసి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కళాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన ఆదరణ లేదని, రాబోయే రోజుల్లో తమ విద్యను పది మంది నేర్పితే చిత్ర కళ వర్థిల్లుతుందని విజయకుమార్ చెప్పారు.

Portrait Artist Vijayakumar in G20 Meeting : బహుళ పోషకాల గని.. చిరుధాన్యాల పంటలు, సాగు, వినియోగం, మార్కెటింగ్ పట్ల అన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నది చిత్రకారుడు మోకా విజయకుమార్ లక్ష్యం. ఎప్పటికప్పడు సమకాలీన అంశాలపై భవిష్యత్తులో కూడా సమాజానికి ఉన్నత సందేశం అందించేందుకు చిత్రాలు తీర్చిదిద్దుతానని ఆయన చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 19, 2023, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.