ETV Bharat / state

Police flag day: రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

author img

By

Published : Oct 21, 2021, 8:22 PM IST

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను పోలీసుశాఖ స్మరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ శ్రద్ధాంజలి(Police flag day) ఘటించారు. అమరుల స్ఫూర్తితో మరింత నిబద్ధతతో పనిచేస్తూ ప్రజాసేవకు పునరంకితమవుతామని రక్షకభటులు ఉద్ఘాటించారు.

Police flag day: రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
Police flag day: రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

చైనా సరిహద్దులో 1959లో పోలీసుల త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న దేశమంతటా సంస్మరణ దినోత్సవం(Police flag day) నిర్వహిస్తుంటారు. హైదరాబాద్ గోషామహల్‌లో గవర్నర్ తమిళిసై, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలంగా పనిచేస్తోందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అధునాతన సాంకేతికత, సీసీ కెమెరాలు, వాహనాల అందజేతతో సర్కారు అండగా నిలుస్తోందన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మహమూద్ అలీ అమరుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనకాడరని.. అమరులైన పోలీసులు మనకు, సమాజానికి నిరంతరం గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సహకారంతో సాంకేతికతను వినియోగించి పోలీసు సేవలలో నాణ్యతను పెంచడానికి నిరంతర కృషి జరుగుతున్నది. పోలీసు అమరవీరుల త్యాగాలను మరొక్కసారి స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. -మహేందర్​ రెడ్డి, డీజీపీ

ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి..

జిల్లాల్లోనూ పోలీసు అమరవీరులకు అధికారులు, పోలీసు కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి(Police flag day) ఘటించారు. ఆదిలాబాల్‌లో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు బహుమతులు అందించారు. నిజామాబాద్‌లో పోలీసు కమిషనర్‌ కార్తికేయ, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా అమరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నిర్మల్ , సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అమరవీరుల త్యాగాలను పోలీసు శాఖ స్మరించుకుంది. అమరుల స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో.. శాంతి భద్రతల పరిరక్షణకు పోరాడతామని చెప్పారు.

పోలీసు కుటుంబాలకు సన్మానం

మహబూబాబాద్‌లో ఎస్పీ కోటిరెడ్డి, కలెక్టర్‌ శశాంక జిల్లా పోలీసు కార్యాలయంలో స్మృతి పరేడ్‌కు హాజరయ్యారు. పోలీసు సిబ్బంది సేవలను కొనియాడారు. ఖమ్మం పరేడ్‌ మైదానంలో పోలీసు అధికారులు అమరులకు నివాళులు అర్పించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో, స్మృతి పరేడ్ నిర్వహించారు. సిద్దిపేటలో పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్ అమరులైన పోలీసు కుటుంబాలను సన్మానించారు. మంచిర్యాల పోలీసులు, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

ఇదీ చదవండి:

ETELA ON KCR: నిజం ఎప్పటికైనా బయటికి రాక తప్పదు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.