మూడ్రోజుల పర్యటన కోసం ఈ నెల 25న తెలంగాణకు మోదీ - 27న హైదరాబాద్లో రోడ్ షో

మూడ్రోజుల పర్యటన కోసం ఈ నెల 25న తెలంగాణకు మోదీ - 27న హైదరాబాద్లో రోడ్ షో
PM Modi Road Show in Hyderabad : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈ నెలాఖరులో మరోసారి రాష్ట్రానికి రానున్నారు. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్న ఆయన.. కరీంనగర్, నిర్మల్లో జరిగే సభలు, హైదరాబాద్లో రోడ్ షోలో పాల్గొననున్నారు.
PM Modi Road Show in Hyderabad : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు.. ముఖ్య నేతలతో బహిరంగ సభలు, రోడ్షోలు నిర్వహిస్తూ అభ్యర్థులకు మద్దతు కూడగడుతున్నారు. భారత్ రాష్ట్ర సమితిలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ హరీశ్రావులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ పదేళ్ల ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుండగా.. బీజేపీ, కాంగ్రెస్లు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రచారం చేయిస్తున్నారు.
PM Modi Election Campaign in Telangana 2023 : భారతీయ జనతా పార్టీ తరఫున పలువురు కేంద్రమంత్రులు ఇప్పటికే రాష్ట్రంలో తిష్ట వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు నిర్వహిస్తుండగా.. ప్రధాని మోదీ సైతం విడతల వారీగా ప్రచారాల్లో పాల్గొంటూ నేతల్లో జోష్ నింపుతున్నారు. ఈ నెల 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మ గౌరవ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి.. నేడు మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే మాదిక ఉప కులాల విశ్వరూప మహాసభలో పాల్గొననున్నారు. సభా వేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సభ అనంతరం తిరిగి దిల్లీ వెళ్లిపోనున్న నరేంద్ర మోదీ.. ఈ నెల చివర్లో మరోసారి ఎన్నికల ప్రచారానికి రానున్నారు. మూడు రోజుల పాటు (25, 26, 27) తెలంగాణలోనే ఉండి పలు బహిరంగ సభలు, రోడ్షోలలో పాల్గొననున్నారు. 25వ తేదీన కరీంనగర్, 26న నిర్మల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని.. చివరగా 27న హైదరాబాద్లో నిర్వహించే భారీ రోడ్షోలో పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన వివరాలు..:
- ఈ నెల 25న కరీంనగర్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
- ఈ నెల 26న నిర్మల్ సభలో పాల్గొననున్న పీఎం మోదీ
- ఈ నెల 27న హైదరాబాద్లో రోడ్ షోలో పాల్గొననున్న ప్రధాని
