ETV Bharat / state

'నిరుద్యోగులకు ఇచ్చిన హామీలకు అనుగుణంగానే ఉద్యోగాల భర్తీ'

author img

By

Published : Dec 4, 2022, 6:49 PM IST

Updated : Dec 4, 2022, 7:17 PM IST

KTR wrote a letter to youth: మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదని.. సంఘర్షణకు ప్రతిరూపమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. యువతకు ఆత్మీయలేఖ రాసిన కేటీఆర్​.. సీఎం కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకొని వెళ్తోందన్నారు. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో.. దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని వివరించారు.

minister ktr
మంత్రి కేటీఆర్​

యువతను ఉద్దేశించి మంత్రి కేటీఆర్​ లేఖ

KTR wrote a letter to youth: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షల కల సాకారమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్​ఎస్​ సర్కార్‌.. దేశంలో నవశకానికి నాంది పలికిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 9 ఏళ్ల వ్యవధిలో సుమారు 2లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసిన ఏకైక రాష్ట్రంగా దేశంలో సరికొత్త చరిత్ర లిఖించామన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తోందని.. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీని తొలిసారి విజయవంతంగా పూర్తిచేసినట్లు చెప్పారు.

ప్రజల ఆశీస్సులతో.. మరోసారి అధికారంలోకి వచ్చాక.. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిబద్ధతతో వేగంగా చేపట్టామని చెప్పారు. ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాలకు టీఎస్​పీఎస్సీతో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు వచ్చాయని.. అతి త్వరలో గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణతో ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ఉద్యోగాల్లో 95శాతం స్థానికులకే దక్కుతున్నాయన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాము: విద్యార్థులు, యువకుల కోరికమేరకు ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచామని మంత్రి కేటీఆర్​ గుర్తుచేశారు. ప్రభుత్వఉద్యోగాలు భర్తీ చేస్తూనే, వివిధశాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే.. మరో 10 వేలమందిని క్రమబద్ధీకరించనున్నట్లు వివరించారు. రాష్ట్రం ఏర్పడక ముందు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వంటి రాజ్యాంగసంస్థలు భర్తీ చేసే ఉద్యోగాల నియామక ప్రక్రియపై ఎన్నో ఆరోపణలు, వివాదాలు వచ్చాయని కేటీఆర్ అన్నారు​.

టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక ప్రతి ఉద్యోగాన్ని పారదర్శకంగా భర్తీ చేస్తున్నట్లు గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో సుమారు 17లక్షలమందికి పైగా ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణదేనని గుర్తుచేశారు. ఔత్సాహిక యువతకోసం దేశంలో ఎక్కడాలేని విధంగా స్టార్టప్ ఎకో సిస్టంను అందుబాటులోకి తెచ్చామని.. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టీ-హబ్, టీ- వర్క్​, వీ-హబ్, టాస్క్‌ వంటివాటిని ఏర్పాటుచేసినట్లు కేటీఆర్‌ వివరించారు.

నిరుద్యోగులకు శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి: కేసీఆర్‌ సూచన మేరకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువత కోసం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు కోచింగ్‌ సెంటర్లు ఇతర వసతులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ శాఖల తరపున నిరుద్యోగులకు శిక్షణా తరగతుల నిర్వహణ పెద్దఎత్తున సాగుతోందని తెలిపారు. కేసీఆర్​ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోందని చెప్పారు. పనికి మాలిన ప్రచారాలు పట్టించుకోకుండా అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదే గురిపెట్టాలని యువతకు సూచించారు. సానుకూల దృక్పథంతో సాధనచేసి, స్వప్నాన్ని సాకారంచేసుకోవాలన్న కేటీఆర్​.. కాలం తిరిగి రాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని యువతకు రాసిన లేఖలో సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 4, 2022, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.