ETV Bharat / state

INDIA JOY 2022: డిజిటల్‌ రంగంపై ఆసక్తి ఉంటే.. ఇండియా జాయ్‌-2022 ప్రదర్శన మీ కోసమే..

author img

By

Published : Nov 3, 2022, 2:51 PM IST

INDIA JOY 2022 IN HYDERABAD: సరికొత్తగా ఆలోచించటం..! ఆ ఆలోచనలకు మరింత మెరుగైన రూపం కల్పించటం..! ఇవే డిజిటల్ రంగంలో ఎవరినైనా ఉన్నత స్థానంలో నిలబెట్టగల ప్రధాన అంశాలు. రోజు రోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న విఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాల్లో.. ఇది తప్పనిసరి. సాంకేతికతతో పాటు.. డిజిటల్ రంగంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు మరోమారు మన ముందుకు వచ్చింది ఇండియా జాయ్.

INDIA JOY 2022 SHOW IN HYDERABAD
ఇండియా జాయ్‌ 2022

అట్టహాసంగా ప్రారంభమైన ఇండియా జాయ్‌ ప్రదర్శన

INDIA JOY 2022 IN HYDERABAD: డిజిటల్ రంగంలో రాణించాలని తహతహలాడుతున్న వారికి ఆధునిక సాంకేతికను పరిచయం చేస్తూ.. అట్టహాసంగా కొనసాగుతోంది ఇండియా జాయ్‌-2022. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా మంగళవారం ప్రారంభమైన ప్రదర్శనలో గ్రాఫిక్స్‌, యానిమేషన్, గేమింగ్‌ దిగ్గజ సంస్థలతో పాటు, అంకుర సంస్థల ఉత్పత్తులు కొలువుదీరాయి. సినిమా రంగాన్ని దాటి డిజిటల్ రంగంలోకి వస్తున్న సృజనాత్మకతను కళ్లకు కడుతున్నాయి. భవిష్యత్‌లో ఆయా విభాగాల్లో అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవచ్చన్న అంశాలపై చర్చా కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

కొత్త ఒరవడులు సృష్టిస్తున్న వీఎఫ్ఎక్స్‌ను పరిచయం చేస్తూ.. ఇండియా జాయ్‌లో ఔత్సాహికుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగు దశాబ్దాల్లో గ్రాఫిక్స్ రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? వాటిని వినియోగిస్తూ ఎటువంటి అద్భుతాలు చేయొచన్న అంశాలపై నిపుణులు అవగాహన కలిగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను విద్యరంగానికి అనుసంధానించడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

ఈటీవీ బాలభారత్‌లో మూస్‌ కామిక్స్‌, 2-డి సాంకేతికతో పిల్లల కోసం నీతి కథలు అందిస్తున్నాం. రానున్న ఎపిసోడ్‌ల్లో మరింత మెరుగుపరుస్తున్నాం. సాంకేతికతను విద్యారంగానికి అనుసంధానించాలి. ఒక్కసారి సైన్స్‌ ప్రాక్టికల్స్‌ను వర్చువల్‌, అగ్యుమెంటెడ్‌ రియాలిటీ లేదా వీటన్నింటిని కలిపి ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీలో విద్యార్థులు గుండెను చూపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అయితే విధాన రూపకర్తలు ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు, పిల్లలు దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. -ఎస్‌.పి.సింగ్‌, ఈటీవీ బాల భారత్ ఆపరేషన్స్ హెడ్

టాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు సినిమాలకు వాడే విభిన్న రకాల కెమెరాలు, అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చే చిన్న చిన్న కెమెరాలు, విభిన్న రకాల లెన్స్‌లు, లైటింగ్ కిట్‌లు, అత్యాధునిక మానిటర్‌లు ప్రదర్శనలు కొలువుదీరాయి. చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన గేమింగ్‌జోన్‌తోపాటు.. పిల్లల కోసం కార్టూన్ క్యారెక్టర్లతో తయారు చేసిన టీ-షర్ట్ లు, డ్రాయింగ్ బుక్స్, కార్టున్ బొమ్మలు ఎంతగానో అలరిస్తున్నాయి. ఓటీటీ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టి విజయవంతమైన తారలతోనూ చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అన్ని ఒకే చోటే ఉండడం ఎంతో మంచి అనుభూతిని ఇస్తోందని గాలోర్స్‌ సిస్టమ్స్‌ ప్రతినిధి ప్రభంజన్‌ తెలిపారు. ఇండియా జాయ్ లాంటి కార్యక్రమాల ద్వారా డిజిటల్ రంగంలో రాణించాలనుకునే వారికి సరికొత్త అవకాశాలు రావటం తోపాటు... ఆయా రంగాలకు చెందిన సంస్థలకు మంచి మార్కెట్ లభిస్తుందని ఇండియా జాయ్ లో పాల్గొన్న వారు అభిప్రాయపడుతున్నారు. నవంబర్ 1 ప్రారంభమైన ఇండియా జాయ్‌ ప్రదర్శన ఐదు రోజులపాటు కొనసాగనుంది. చిన్నా పెద్దా అంతా ఇండియా జాయ్ లో పాల్గొని... వీఎఫ్ ఎక్స్, గేమింగ్ లను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.