Minister Niranjan Reddy: హైదరాబాద్ నగర శివారు కొహెడలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పండ్ల మార్కెట్ నిర్మాణంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. 178ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పండ్ల మార్కెట్ ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా దేశంలో అతిపెద్ద దిల్లీ ఆజాద్పూర్ మండీని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సందర్శించారు. పండ్లు, కూరగాయలు, పసుపు మార్కెటింగ్ విధానాన్ని పరిశీలించారు.
మార్కెట్ వర్తకులు, రైతులు, అధికారులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమయ్యారు. దిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల రైతుల సౌకర్యార్థం 1975లో 90 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ మార్కెట్.. ఏటా 100 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తుందని అధికారులు మంత్రి నిరంజన్రెడ్డికి తెలిపారు. మారుతున్న జీవనశైలి నేపథ్యంలో పండ్ల ప్రాధాన్యత పెరిగిన దృష్ట్యా అధిక శాతం ప్రజలు ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. అనూహ్య వాతావరణ మార్పులు కాలానికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల్లో ఆహారపు అలవాట్లు మారుతున్నాయని తెలిపారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కొహెడలో శీతల గిడ్డంగి ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ పంటల విస్తీర్ణం అధికంగా ఉన్నా... ఉద్యాన పంటల ప్రాధాన్యత, విలువ సైతం ఎక్కువేనని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆజాద్పూర్ మండీ ఛైర్మన్ అదిల్ఖాన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Nama Comments: 'రాష్ట్రంపై చాలా విషయాల్లో కేంద్రం అన్యాయం చేస్తోంది..'