ETV Bharat / sports

నిఖత్‌ పంచ్​.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లోకి..

author img

By

Published : May 17, 2022, 6:55 AM IST

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ వేదికపై అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని అందుకుంది. బాక్సింగ్‌లో అత్యున్నత టోర్నీ అయిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌ చేరడం ద్వారా ఆమె పతకం ఖరారు చేసుకుంది. ఇంకో రెండు విజయాలు సాధిస్తే ప్రపంచ ఛాంపియన్‌ అవుతుంది.

Nikhat Zareen
నిఖత్‌

జూనియర్‌ స్థాయిలో సంచలనాలు నమోదు చేస్తూ ప్రపంచ ఛాంపియన్‌ కూడా అయిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.. ఇప్పుడు సీనియర్‌ స్థాయిలోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన 25 ఏళ్ల నిఖత్‌.. ఇప్పుడు ఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసింది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న టోర్నీలో 52 కేజీల విభాగంలో ఆమె సెమీస్‌ చేరుకుంది.

Nikhat Zareen
నిఖత్‌

సోమవారం క్వార్టర్‌ ఫైనల్లో నిఖత్‌ 5-0తో ఇంగ్లాండ్‌ బాక్సర్‌ చార్లీ సియాన్‌ డేవిసన్‌పై విజయం సాధించింది. ఇటీవలే స్ట్రాంజా బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణం గెలిచి ఊపుమీదున్న నిఖత్‌.. చార్లీతో పోరుతో వ్యూహాత్మకంగా ఆడింది. ఇరువురు బాక్సర్లూ దూకుడుగానే బౌట్‌ను మొదలుపెట్టారు. అయితే నిఖత్‌ కచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలి రౌండ్‌లో చార్లీ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ నిఖత్‌దే పైచేయి అయింది. రెండో రౌండ్లో పూర్తిగా తన ఆధిపత్యమే సాగింది. వరుసగా రెండు రౌండ్లలో పైచేయి సాధించడంతో తర్వాత నిఖత్‌ దూకుడు తగ్గించింది.

సెమీస్‌లో నిఖత్‌.. కరోలిన్‌ డి అల్మీడియా (బ్రెజిల్‌)ను ఢీకొంటుంది. టోర్నీలో భారత్‌కు ఇంకో రెండు పతకాలు ఖరారయ్యాయి. 57 కేజీల విభాగంలో మనీషా, 63 కేజీల్లో పర్వీన్‌ కూడా సెమీస్‌ చేరుకున్నారు. క్వార్టర్స్‌లో మనీషా 4-1తో నమున్‌ (మంగోలియా)ను ఓడించగా.. పర్వీన్‌ 5-0తో షోయిరా (తజికిస్థాన్‌)ను చిత్తు చేసింది. 48 కేజీల విభాగంలో నీతుకు, 81 కేజీల్లో పూజా రాణికి నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌లో నీతు 2-3తో అలువా (కజకిస్థాన్‌) చేతిలో, పూజా రాణి 2-3తో జెస్సికా (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు. అనామిక (50 కేజీలు), జాస్మిన్‌ (60 కేజీలు), నందిని (81+) కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టారు.

"ఈ రోజు ప్రత్యర్థి నా కంటే పొడవుగా ఉంది. ఆమెకు కుడి చేయే ప్రధాన బలం. దాన్ని సమర్థంగా అడ్డుకోవడమే నా వ్యూహం. అది ఫలించింది. దేశానికి తొలి పతకం ఖరారు చేయడం సంతోషంగా ఉంది. స్వర్ణం కూడా గెలవగలను"

- నిఖత్‌

ఇదీ చదవండి: కోల్​కతాకు షాక్​.. టోర్నీ నుంచి రహానె​ ఔట్​.. ఇంగ్లాండ్​ సిరీస్​కు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.