ETV Bharat / sports

హాకీలో భారత జట్లకు ఓటమి.. ఆ క్రీడల్లో తెలుగు తేజాల జోరు

author img

By

Published : Feb 28, 2022, 7:09 AM IST

FIH pro hockey league: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు పరాజయం చెందాయి. మెన్స్​టీమ్​ 3-5 గోల్స్‌తో స్పెయిన్‌ చేతిలో ఓటమి చెందగా.. ఉమెన్స్​ టీమ్​ 3-4తో స్పెయిన్‌ చేతిలో ఓడింది. కాగా, తెలుగుతేజం రాగాల వెంకట రాహుల్‌, వికాశ్‌ ఠాకూర్‌ ఈ ఏడాది జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పంచ్‌.. పసిడిని ముద్దాడింది. మరోవైపు జాతీయ సీనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు జోరు ప్రదర్శిస్తున్నారు.

FIH pro hockey league
హాకీలో భారత జట్లకు ఓటమి

FIH pro hockey league: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌లో భారత పురుషులు, మహిళల జట్లకు ఓటమి ఎదురైంది. పురుషుల్లో భారత్‌ 3-5 గోల్స్‌తో స్పెయిన్‌ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే భారత్‌ మెరుగ్గానే ఆడినా ఆఖర్లో తడబడి ఓటమి చవిచూసింది. భారత్‌ తరఫున అభిషేక్‌ (6వ ని), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (27వ ని), సుఖ్‌జీత్‌ సింగ్‌ (51వ ని) గోల్స్‌ కొట్టగా.. స్పెయిన్‌ జట్టులో సోదరులు పా కనిల్‌ (14వ ని, 24వ ని), పెప్‌ కనిల్‌ (54వ ని) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మార్క్‌ (59వ) టారెస్‌ (14వ ని) చెరో గోల్‌ కొట్టారు.

మహిళల పోరులో భారత్‌ 3-4తో స్పెయిన్‌ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఒక దశలో స్కోరు 3-3తో సమమైంది. అయితే ఆఖరి సెకన్లలో జాంటల్‌ (60వ ని) కొట్టిన గోల్‌తో స్పెయిన్‌ గెలిచింది. భారత్‌ తరపున సంగీత (10వ), సలీమా (22వ), నమిత (49వ) తలో గోల్‌ కొట్టారు. ప్రత్యర్థి జట్టులో బెగోనా గార్సియా (4వ, 24వ) రెండు గోల్స్‌తో సత్తా చాటగా.. మైయాలెన్‌ (15వ) ఓ గోల్‌ చేసింది. శనివారం మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి స్పెయిన్‌ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది.

కామన్వెల్త్‌కు రాహుల్‌

Common wealth games Telugu state players: తెలుగుతేజం రాగాల వెంకట రాహుల్‌, వికాశ్‌ ఠాకూర్‌ ఈ ఏడాది జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నారు. సింగపూర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ టోర్నమెంట్లో పురుషుల 96 కేజీల విభాగంలో వికాశ్‌ స్వర్ణం, రాహుల్‌ కాంస్యం గెలిచి కామన్వెల్త్‌ బెర్తు సంపాదించారు. ఈ పోటీలో స్నాచ్‌లో 151 కేజీలు ఎత్తిన వికాశ్‌.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 188 కేజీలు, మొత్తంగా 339 కేజీలు లిఫ్ట్‌ చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు స్నాచ్‌లో 146 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 188 కేజీలు ఎత్తిన రాహుల్‌.. మొత్తం 328 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. రిడ్జ్‌ బారెడో (ఆస్ట్రేలియా, 336 కేజీలు) రజతం గెలుచుకున్నాడు.

నిఖత్​ పసిడి పంచ్​

Telangana boxer Nikhat win gold: తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పంచ్‌.. పసిడిని ముద్దాడింది. స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆమె మరోసారి స్వర్ణాన్ని అందుకుంది. 2019లో ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన ఈ 25 ఏళ్ల అమ్మాయి.. మరోసారి ఆ ప్రదర్శన పునరావృతం చేసింది. ఆదివారం మహిళల 52 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్‌ 4-1 తేడాతో టెటియానా (ఉక్రెయిన్‌)ను ఓడించింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించిన నిఖత్‌ ముష్టిఘాతాలతో విరుచుకుపడింది. మరో భారత బాక్సర్‌ నీతూ కూడా బంగారు పతకాన్ని గెలుచుకుంది. 48 కేజీల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. హరియాణాకు చెందిన 21 ఏళ్ల నీతూ తుదిపోరులో 5-0తో ఎరిక (ఇటలీ)ని చిత్తుచేసింది. ఆరంభం నుంచే ఎదురు దాడికి దిగిన నీతూ ధాటికి ప్రత్యర్థి నిలవలేకపోయింది. తన కెరీర్‌ కోసం మూడేళ్ల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టిన తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఆమె గొప్పగా రాణించింది. నందిని (81+ కేజీలు) ఇప్పటికే కాంస్యం నెగ్గడంతో భారత్‌ మొత్తం మూడు పతకాలతో పోటీలను ముగించింది. గత టోర్నీ (దీపక్‌కు రజతం, నవీన్‌కు కాంస్యం) కంటే ఈ సారి భారత్‌ (రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం) మెరుగైన ప్రదర్శన చేసింది.

తెలుగు గ్రాండ్​మాస్టర్లు జోరు

National chess championship: జాతీయ సీనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు జోరు ప్రదర్శిస్తున్నారు. అయిదు రౌండ్లు ముగిసే సరికి మొత్తం 4.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి అర్జున్‌ ఇరిగేశి, లలిత్‌ బాబు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆదివారం అయిదో రౌండ్లో గుకేశ్‌తో గేమ్‌ను తెలంగాణ కుర్రాడు అర్జున్‌ డ్రా చేసుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను ఈ టోర్నీలోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. మరోవైపు అయిదో రౌండ్లో ఆర్యన్‌ చోప్రాను ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు లలిత్‌ బాబు చిత్తుచేశాడు. వీళ్లతో పాటు గుకేశ్‌, అభిజీత్‌, కౌస్తవ్‌ ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. మరో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరత్‌కోటి అయిదో రౌండ్లో అధిబన్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. నాలుగు పాయింట్లతో అతను మరో 13 మందితో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు.

పూజకు రజతం

పారా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆర్చర్‌ పూజ రజతం గెలుచుకుంది. ఫైనల్లో ఆమె 3-7తో ఇటలీకి పెట్రిలి విన్సెంజా (ఇటలీ) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీస్‌లో 6-2తో హేజెల్‌ చైస్టీ (ఇంగ్లాండ్‌)పై గెలిచిన పూజ... పారా ప్రపంచ ఆర్చరీ వ్యక్తిగత ఈవెంట్లో ఫైనల్‌ చేరిన భారత తొలి ఆర్చర్‌గా ఘనత సాధించింది. టీమ్‌ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగే పోరులో మంగోలియా జోడీతో పూజ- పూజ ఖన్నా జంట పోటీపడనుంది. మరోవైపు కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ జోడీ శ్యాంసుందర్‌ స్వామి- జ్యోతి బలియాన్‌ జంట రజత పతకం గెలుచుకుంది. ఈ పతకమే పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం. 2017 బీజింగ్‌, 2019 డెన్‌ బాష్‌ (నెదర్లాండ్స్‌) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో భారత్‌ బరిలో దిగింది. 2019లో రాకేశ్‌ కాంస్యానికి దగ్గరగా వచ్చినా.. పతకం సాధించలేకపోయాడు.

ఇదీ చూడండి: స్కేట్​బోర్డింగ్.. నేరుగా కుర్రాళ్ల మనసుల్లోకే..


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.