ETV Bharat / international

చైనాలో మరణ మృదంగం.. వైరస్ ధాటికి రోజుకు 9వేల మంది మృతి!

author img

By

Published : Dec 31, 2022, 10:52 PM IST

చైనాలో కరోనా మహమ్మారి సునామీ విరుచుకుపడుతున్న వేళ బ్రిటన్‌కు చెందిన పరిశోధనా సంస్థ నివేదిక అంశాలు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు 9వేల మంది మరణిస్తున్నట్లు తెలిపింది. ఆంక్షలు సడలించక ముందు కొన్ని ప్రావిన్స్‌ల్లో కొవిడ్‌ తీవ్రత నిబంధనలు ఎత్తివేసిన తర్వాత నమోదైన కేసుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు పరిశోధకులు తెలిపారు.

airfinita-report-on-china-corona-deaths
చైనాలో రోజుకు దాదాపు 9వేల కరోనా మరణాలు ఎయిర్ఫినిట నివేదిక

చైనాలో జీరో కొవిడ్‌ నిబంధనలు ఎత్తివేయడం వల్ల కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశంలో లేని విధంగా చైనాలో వైరస్‌ విజృంభిస్తోంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా వేలల్లో మరణాలు సంభవిస్తున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన పరిశోధనా సంస్థ ఎయిర్ఫినిటీ చైనాలో రోజుకు దాదాపు 9వేల మంది కరోనాతో చనిపోతున్నట్లు అంచనా వేసింది. ఈ అధ్యయన నివేదికను ఆస్ట్రేలియా మీడియా సంస్థ న్యూస్‌ డాట్‌ కామ్‌ ప్రచురించింది. కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేయక ముందు కొన్ని ప్రావిన్స్‌లలో ఉన్న కొవిడ్‌ తీవ్రతను రికార్డు చేసినట్లు ఎయిర్ఫినిటీ తెలిపింది. ఆంక్షల సడలింపు తర్వాత కొవిడ్‌ తీవ్రతను పరిగణలోకి తీసుకుని చైనాలో మరణాలను లెక్కగట్టినట్లు పేర్కొంది.

చైనాలో ఒక్క డిసెంబర్‌ నెలలోనే కోటి 80లక్షల కేసులు వచ్చి ఉండొచ్చని ఎయిర్ఫినిటీ అంచనా వేసింది. అందులో సుమారు లక్ష మంది మరణించి ఉంటారని పేర్కొంది. జనవరి మధ్యలో రోజుకు 37లక్షల మంది మహమ్మారి బారిన పడతారని హెచ్చరించింది. జనవరి చివరినాటికి చైనాలో 5లక్షల 84వేల మంది చనిపోయే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేసింది. అయితే కరోనా ఉద్ధృతిపై అంతర్జాతీయ అధ్యయన నివేదికలు, కథనాలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చైనాలో ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తి ప్రపంచం ఇప్పటివరకు చూడనంత అతిపెద్దదని.. అక్కడి ఆరోగ్య కమిషన్‌ పేర్కొనటం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఇప్పటికే చైనా జనాభాలో 30శాతం అంటే 40కోట్ల మంది ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు న్యూస్‌డాట్‌ కామ్‌ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.