ETV Bharat / international

తుపాకులతో తాలిబన్ల గర్జన.. అఫ్గాన్​లో రాక్షస పాలన!

author img

By

Published : Aug 17, 2021, 7:54 AM IST

కళ్లెదుట తుపాకులతో తాలిబన్ల గర్జన.. కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న రేపటి రాక్షస పాలన.. నేటి పరిస్థితులు బాగోలేవన్న ఆవేదన.. రేపన్నది మరింత దారుణంగా ఉండబోతోందన్న భయాందోళన.. పోరు మధ్యలోనే కాడి వదిలేసిన అమెరికా బలగాలు.. పోరాటమన్న పదమే తమకు తెలియదన్నట్లు దాసోహమన్న స్వదేశీ దళాలు.. అఫ్గానిస్థాన్‌ పౌరులు అల్లాడుతున్నారు. బతుకు జీవుడా అంటూ దేశం విడిచి వెళ్లేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Taliban
తాలిబన్లు

  • దేశం వీడేందుకు విమానాశ్రయానికి పోటెత్తిన జనం
  • సిటీ బస్సుల్ని తలపించిన విమానాలు.. ఎటుచూసినా భీతావహ దృశ్యాలు
  • విమానం పట్టుకు వేలాడుతూ వెళ్లి.. జారిపడి ముగ్గురి మృత్యువాత
  • జనాన్ని అదుపు చేసేందుకు గాల్లోకి అమెరికా బలగాల కాల్పులు
  • ఇద్దరు సాయుధుల కాల్చివేత
  • ఎవరికీ హాని చేయబోమంటూ మళ్లీ తాలిబన్ల హామీ
  • రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసిన అమెరికా
  • రక్తపాతాన్ని నివారించేందుకే దేశాన్ని వీడానన్న అష్రఫ్‌ ఘనీ

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌ అల్లకల్లోలమవుతోంది. దాదాపు 20 ఏళ్ల కిందటి ముష్కర పాలన మళ్లీ రాబోతోందన్న చేదు నిజం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని కాబూల్‌లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి. దేశం విడిచి వెళ్లేందుకు జనం సోమవారం విమానాశ్రయానికి పోటెత్తారు. అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేనంతగా.. అనుమతులు, వీసాలు, టికెట్లేవీ లేకుండానే విమానాలు ఎక్కేశారు. ఓ దశలో తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. జన సందోహాన్ని అదుపు చేసేందుకు అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. ఓ విమానం రెక్కలు/టైర్ల భాగం వద్ద దాక్కొని ప్రయాణించేందుకు ముగ్గురు ప్రయత్నించడం.. టేకాఫ్‌ అయ్యాక చాలా ఎత్తు నుంచి కిందపడి వారు ప్రాణాలు కోల్పోవడం.. దేశం విడిచి వెళ్లేందుకు అఫ్గాన్‌ పౌరులు తపిస్తున్న తీరుకు అద్దం పడుతోంది. విమానాశ్రయం వద్ద ఇద్దరు సాయుధులను అమెరికా బలగాలు కాల్చిచంపాయి. మొత్తంగా అక్కడ సోమవారం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు.

Taliban
విమానం టేకాఫ్ అయిన క్రమంలో..

ప్రస్తుతం శాంతిమంత్రమే..

మరోవైపు- అఫ్గాన్‌ మొత్తాన్నీ తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. ప్రస్తుతానికి శాంతిమంత్రమే జపిస్తున్నారు. సోమవారం ఎక్కడా విధ్వంసాలకు పాల్పడలేదు. అయితే పరిస్థితులు విషమిస్తుండటంతో బ్రిటన్‌, రష్యా సహా పలు దేశాలు అఫ్గాన్‌ నుంచి తమ పౌరులు, దౌత్య సిబ్బందిని స్వదేశాలకు తీసుకెళ్లే ప్రక్రియను వేగవంతం చేశాయి. తాలిబన్లను సమర్థించే వ్యాఖ్యలు చేయడం ద్వారా పాకిస్థాన్‌, చైనా మరోసారి తమ కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నాయి. దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తాజాగా ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. రక్తపాతాన్ని నివారించేందుకే తాను దేశాన్ని వీడినట్లు చెప్పారు.

Taliban
విమానం ఎక్కేందుకు తాపత్రయం

రన్‌వేపై పరుగో పరుగు

సాధారణంగా రద్దీ వేళల్లో రైళ్లు, బస్సుల్లో సీట్ల కోసం జనం పరుగులు తీయడం మనం చూస్తుంటాం. విమానాల్లో చోటు కోసం అలా ఉరుకులు పరుగులతో ఎగబడటం ఎప్పుడైనా చూశామా? కానీ కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదే జరిగింది! సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్‌ను వీడటమే లక్ష్యంగా కాబూల్‌ విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం నుంచి వేల మంది తరలివచ్చారు. ప్రహరీ పైనుంచి దూకి, ఇనుప కంచెలను దాటుకొని వారంతా లోపలికి ప్రవేశించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. రన్‌వేపై జనం పరుగులు తీశారు. ఓ దశలో తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. నిలిపి ఉన్న విమానాల్లోకి ఎక్కే క్రమంలో జనం ఒకర్నొకరు తోసుకున్నారు. వేల మంది రాకతో విమానాశ్రయం జన సంద్రాన్ని తలపించింది. అక్కడ కాపలాగా ఉన్న అమెరికా సైనికులు వారిని నిలువరించలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో గాల్లోకి కాల్పులు జరిపారు. బాష్పవాయువును ప్రయోగించారు. అయినా జనం వెనక్కి తగ్గలేదు.

Taliban
విమానం నుంచి కిందకు జారిపడి..

విమానం నుంచి జారిపడి

అమెరికా వాయుసేన విమానమొకటి టేకాఫ్‌ అవుతుండగా.. కొందరు దాన్ని పట్టుకొని వేలాడారు. సిటీ బస్సుల్లో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న తరహాలో ఓ విమానం వెంట ప్రజలు పరుగులు తీశారు. దానికి సంబంధించి పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓ దశలో విమానాశ్రయం వెలుపల కూడా కాల్పుల శబ్దం వినిపించింది. మొత్తంగా విమానాశ్రయం వద్ద ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. విమానం నుంచి జారిపడినవారు కూడా ఈ లెక్కల్లో ఉన్నట్లు అమెరికా బలగాలు తెలిపాయి.

Taliban
విమానాశ్రయం ప్రధానద్వారం మూసివేత

ఊపిరి పీల్చడమూ కష్టమై..

సాధారణ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ముందే ప్రకటించినా కాబూల్‌ విమానాశ్రయానికి జనం సోమవారం భారీగా తరలివచ్చారు. రన్‌వేపై ఉన్న విమానాల్లోకి ఇష్టారీతిన ఎక్కేశారు. పలు విమానాల్లో కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా పోయింది. లోపల ఊపిరి పీల్చడమూ కష్టమైంది. చిన్నారుల ఏడుపులు, మహిళల అరుపులతో విమానాల్లో పరిస్థితులు దయనీయంగా కనిపించాయి. కొంతమంది స్పృహ కోల్పోయారు కూడా. ఆ పరిస్థితులకు భయపడి కొందరు విమానాలు దిగేశారు. తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.

విధ్వంస చర్యలకు దూరంగా తాలిబన్లు

విమానాశ్రయానికి వెళ్లినవారిని మినహాయిస్తే.. కాబూల్‌లో అత్యధిక మంది సోమవారం ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో తాలిబన్‌ ఫైటర్లు వాహనాలను తనిఖీ చేశారు. బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు. ఇప్పటికే కారాగారాలను ఆక్రమించుకున్న తాలిబన్లు.. వేలమంది ఖైదీలను విడుదల చేశారు. ప్రభుత్వ బలగాలకు చెందిన ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎక్కడా విద్రోహ చర్యలకు పాల్పడలేదు. తమ ఆక్రమణతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించే ప్రయత్నాలను వారు కొనసాగించారు. ఎవరికీ హాని తలబెట్టబోమంటూ మరోసారి భరోసా ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించొద్దంటూ తాము ఫైటర్లను ఆదేశించామని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు జారీ చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు.

Taliban
దేశం దాటేందుకు ఓ కుటుంబం

ప్రతీకారం తీర్చుకోం

అమెరికా నేతృత్వంలోని కూటమి తరఫున పనిచేసినవారిపై తామేమీ ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ హామీ ఇచ్చారు. అఫ్గాన్‌ ప్రజల్లో అనవసరపు భయాందోళనలను రేకెత్తించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. యథావిధిగా పనులకు వెళ్లాలని తాలిబన్లు టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. కాబూల్‌లో విదేశీ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలకు నెలవైన గ్రీన్‌ జోన్‌ ప్రాంతంలో తాలిబన్‌ ఫైటర్లు రైఫిళ్లతో తిరగాడుతూ కనిపించారు.

Taliban
విమానం ఎక్కేందుకు పోటెత్తిన జనం

దిగిపోయిన అమెరికా జెండా

కాబూల్‌ పూర్తిగా తాలిబన్ల వశమవ్వడంతో.. అక్కడి రాయబార కార్యాలయాన్ని అమెరికా ఖాళీ చేసింది. సిబ్బందిని విమానాశ్రయానికి తరలించింది. మరోవైపు- కాబూల్‌ విమానాశ్రయానికి సంబంధించి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)ను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది. తరలింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకుగాను రెండు రోజులపాటు ఆ విమానాశ్రయం వద్ద 6 వేలమంది సైనికులను మోహరించనున్నట్లు తెలిపింది.

Taliban
తాలిబన్లు పహారా

భారతీయుల తరలింపు ఎలా?

కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంలో 200 మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి ఎలా తీసుకురావాలన్నదానిపై విదేశీ వ్యవహారాల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. వాస్తవానికి కాబూల్‌ విమానాశ్రయంలో భారత విమానం ఒకటి ప్రస్తుతం నిలిపి ఉంది. అయితే, నగరంలో తాలిబన్లు కర్ఫ్యూ విధించడంతో.. రాయబార కార్యాలయం నుంచి వారందర్నీ విమానాశ్రయానికి చేర్చడం సవాలుగా మారింది. కార్యాలయంలో చిక్కుకున్నవారిలో దౌత్య అధికారులు, సిబ్బంది, పారామిలటరీ సైనికులు ఉన్నారు.

ఇవీ చదవండి:

తాలిబన్ల ఆక్రమణతో మళ్లీ చీకటిరాజ్యం!

అఫ్గాన్​ పరిస్థితులపై జో బైడెన్‌ కీలక ప్రకటన

'ఉగ్రవాద సంస్థలకు మరోసారి వేదిక కానీయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.