ETV Bharat / international

బైడెన్​ సర్కార్​కు 'వలస' తలనొప్పులు

author img

By

Published : Mar 22, 2021, 1:07 PM IST

Biden aims to prevent border crossings
అక్రమ వలసల కట్టడే లక్ష్యంగా బైడెన్​ చర్యలు!

అగ్రరాజ్యం ముంగిట వలసల సంక్షోభం పొంచి ఉందా? మెక్సికో సరిహద్దులు దాటి, దేశంలోకి పోటెత్తుతున్న వలసదారుల్ని కట్టడి చేయడం ప్రభుత్వానికి సవాల్​గా మారిందా? అసలు... శరణార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగేందుకు కారణమేంటి? పరిస్థితిని చక్కదిద్దేందుకు బైడెన్​ సర్కార్​ ఏం చేస్తోంది?

అమెరికా-మెక్సికో సరిహద్దులో పెరుగుతున్న మానవీయ, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది జో బైడెన్​ పరిపాలనా విభాగం. భారీగా పెరుగుతున్న వలసలు తమ ప్రభుత్వ అజెండాపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో హుటాహుటిన చర్యలకు ఉపక్రమించింది.

ఏం జరుగుతోంది?

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్​ అధికారం చేపట్టిన తర్వాత తొలినాళ్లలో.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీసుకున్న పలు నిర్ణయాలను మార్చారు. అనేక నిబంధనలను సడలించారు. వలసల విషయంలో ట్రంప్ విధానాలను బైడెన్​ మరింత సరళతరం చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. దాంతో చాలా దేశాల వారు సరిహద్దులకు చేరుకున్నారు. మరోవైపు.. పొరుగున ఉన్న గ్వాటెమాల, హోండురస్​, ఎల్​సాల్వెడార్​లోని అంతర్గత గొడవల కారణంగా అక్కడి నుంచి కూడా భారీగానే వలస వచ్చారు. ఇప్పటికే వేలాది మంది సెంట్రల్​ అమెరికన్​ ప్రజలు కొన్నినెలలుగా సరిహద్దుల్లోనే చిక్కుకుపోయారు. ఇది కూడా సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్రంగా మారేందుకు కారణమైంది.

బైడెన్​ అధికారం చేపట్టిన తర్వాత గత ఫిబ్రవరిలో 18,945 కుటుంబాలు, 9,297 మంది అనాథ చిన్నారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది జనవరితో పోలిస్తే 168 శాతం పెరిగినట్లు పేవ్​ పరిశోధన కేంద్రం వెల్లడించింది. పెద్ద సంఖ్యలో వలసలతో వారికి సౌకర్యాలు, రవాణాలో సవాళ్ల ఎదురువుతున్నట్లు తెలిపింది.

కొవిడ్​ మహమ్మారిపైనే తన తొలి పోరాటంగా ప్రకటించిన బైడెన్​ అజెండాపై వలసలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల మైనర్లు, కుటుంబాలు సరిహద్దులను దాటి ఆశ్రయం పొందాలని పెద్ద సంఖ్యలో వేచిచూస్తున్నారనే కథనాలు పెరిగిపోయాయి. ఫలితంగా... బైడెన్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 1.9 ట్రిలియన్​ డాలర్ల కరోనా ఉపశమనం బిల్లు, కొవిడ్​పై పోరు వంటి కీలకాంశాలకు మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఎక్కడ చూసినా వలసలే హాట్​ టాపిక్​గా మారాయి. దీంతో బైడెన్​ తక్షణం చర్యలకు ఉపక్రమించక తప్పటం లేదు.

అధ్యక్షుడు ఏం చెబుతున్నారు?

వలసదారులతో పరిస్థితులు తీవ్రంగా మారిన క్రమంలో తాను త్వరలోనే సరిహద్దులను సందర్శిస్తానని తెలిపారు అధ్యక్షుడు బైడెన్​. సరిహద్దుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకు తెలుసునన్నారు. శ్వేతసౌధంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వలసలపై మాట్లాడారు.

'సరిహద్దుల్లో చాలా చేయాల్సింది ఉంది. ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నంలోనే ఉన్నాం. ముఖ్యంగా గతంలోని వాటిని తిరిగి ఏర్పాటు చేస్తాం. అక్కడే ఉండి వారి స్వదేశం నుంచి సాయం పొందొచ్చు.'

- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

కప్పిపుచ్చే యత్నం..

సరిహద్దుల్లో పరిస్థితులు చేయిదాటిపోతున్న క్రమంలో తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పేందుకు యత్నించింది శ్వేతసౌధం.

'సరిహద్దులు మూసివేశాం. మేము కుంటుంబాలు, ఒంటరిగా వచ్చిన పురుషులను తిరిగి పంపేస్తున్నాం. అయితే.. యువకులు, చిన్నారులను తిప్పి పంపటం లేదు. గతంలో భారీ సంఖ్యలో వలసలు చూశాం. వాటిని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. మాకు ఓ ప్రణాళిక ఉంది. మా ప్రణాళికను అమలు చేసి విజయం సాధిస్తాం. అయితే దానికి కాస్త సమయం పడుతుంది. ముఖ్యంగా ప్రస్తుత క్లిష్టమైన, సవాళ్ల సమయంలో అది ఎక్కువ కాలం తీసుకుంటుంది'

- అలెజాండ్రో మేయర్​కోస్, అమెరికా అంతర్గత భద్రతా శాఖ మంత్రి

అయితే.. సరిహద్దుల్లో పరిస్థితులు సంక్షోభాన్ని తలపిస్తున్నాయని చెప్పేందుకు శ్వేతసౌధం నిరాకరిస్తోంది. అది దేశంలో ఆందోళనలకు దారితీస్తుందని పేర్కొంది. మరోవైపు.. ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థపై ట్రంప్​ తీసుకున్న నిర్ణయాలే వలసల పెరుగుదలకు కారణంగా పేర్కొన్నారు అధికారులు.

సౌకర్యాల లేమి..

మాజీ అధ్యక్షుడు ట్రంప్..​ ఒబామా హయాంలోని సౌకర్యాలనే వినియోగించారు. దాంతో ప్రస్తుతం భారీగా పెరిగిన వలసలకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఫెడరల్​ కస్టడీలో ఉన్న 14వేల మందికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారు అధికారులు. త్వరలోనే మరిన్ని అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో సౌకర్యాల లేమిపై విమర్శలు చేస్తున్నారు పలువురు నేతలు. ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. సరిహద్దుల్లో మానవీయ సంక్షోభాన్ని సృష్టించారని ఆరోపించారు రిపబ్లికన్ నేత మైకేల్​ మెక్​కౌల్​.

ఇదీ చూడండి: పెరిగిన వలసలు- మళ్లీ మెక్సికో సరిహద్దు మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.