ETV Bharat / crime

సామాన్యుల నుంచి సైనికుల వరకూ కలవరపెడుతున్న 'హనీట్రాప్‌'

author img

By

Published : Apr 3, 2022, 6:52 AM IST

honey trap
honey trap

అందం మనిషిని ఆకట్టుకుంటుంది. అది స్త్రీ అందం అయితే ఇక చెప్పేదేముంది. దానికోసం ఒకప్పుడు రాజులు రాజ్యాలనే పణంగా పెట్టి యుద్ధాలు చేస్తే ఇప్పటి వారు ఉద్యోగాలనీ ఆస్తుల్నీ ఆఖరికి దేశ భద్రతనీ కూడా పణంగా పెడుతున్నారు. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ‘వలపు వల’లో చిక్కుకోవద్దంటూ వివిధ స్థాయుల్లో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కంపెనీలు చైతన్యశిబిరాలు పెట్టి మరీ విలువల పాఠాలు నేర్పుతున్నాయి. సామాన్యుల నుంచి సైనికుల వరకూ ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న సమస్య ‘హనీట్రాప్‌’.

ఆకాశ్‌ కష్టపడి సైన్యంలో చేరాలన్న కల నెరవేర్చుకున్నాడు. విధుల్లో చేరాక మొదటిసారి సెలవులకు బిహార్‌ లోని సొంతూరికి వెళ్లాడు. ‘మా ఊరి ముద్దుబిడ్డ’ అంటూ ఊరంతా అతడికి స్వాగతం చెప్పింది. ఆ ఆనందం ఆవిరైపోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఒకరోజు పోలీసులు వచ్చి ఆకాశ్‌ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఎందుకూ అంటే- సైన్యానికి చెందిన రహస్యాలను విదేశీ గూఢచారులకు చెప్పినందుకు. పగలంతా ఒళ్లు పులిసిపోయేలా శిక్షణలో పాల్గొన్నాక గదికి చేరిన ఆ పాతికేళ్ల యువకుడిని సోషల్‌ మీడియా సేదదీర్చేది. అక్కడ పరిచయమైన అందమైన అమ్మాయిల మత్తెక్కించే సంభాషణలూ వాళ్లు పంపించే నగ్నచిత్రాలూ పిచ్చివాణ్ణి చేసేవి. వాటికోసం వాళ్లు ఆడమన్నట్టల్లా ఆడాడు. తన ఉద్యోగ విషయాలన్నీ వారికి చెప్పి చివరికి కటకటాల వెనక్కి చేరాడు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న యువకుడికి ఫేస్‌బుక్‌లో ఒక యువతి పరిచయమైంది. అందమైన పేరూ అంతకన్నా అందమైన ఫొటోలూ చూసేసరికి ఒళ్లు మరిచిన అతడు మెసెంజర్‌లోకి వెళ్లి ఆమెతో చాటింగ్‌ మొదలెట్టాడు. కవ్విస్తూ నవ్విస్తూ ఆమె చెప్పే కబుర్లకు పూర్తిగా పడిపోయాడు. ఒకరోజు ఆమె నగ్నంగా వీడియోలో మాట్లాడమని కోరగానే ముందూ వెనకా ఆలోచించకుండా పోజులిచ్చేశాడు. ఆమె మాత్రం కనపడకుండా ఊరిస్తూ అతడి వీడియోలను సేకరించింది. ఆ తర్వాత వాటిని బయటపెట్టకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటూ పలు విడతల్లో పన్నెండు లక్షలు తీసుకుంది. దాచుకున్న డబ్బంతా అయిపోయాక కానీ తాను మోసపోయినట్లు తెలియలేదు సదరు యువకుడికి. అప్పుడు పోలీసు స్టేషన్‌కి వెళ్లాడు.
నగరానికే చెందిన ఒక వైద్యుడూ అదే విధంగా మోసపోయాడు. 15 లక్షలు చెల్లించాక పోలీసుల దగ్గరికి వెళ్లాడు. ఇలాంటి కేసులే మరికొన్ని రావడంతో పోలీసులు పరిశోధించగా వాళ్లు అసలు అమ్మాయిలే కాదనీ, సైబర్‌ నేరస్థులే అమ్మాయిల పేర్లతో ఈ మోసాలకు పాల్పడుతున్నారనీ తెలిసింది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఉన్న సైబర్‌ దొంగల ముఠాగుట్టు రట్టయింది. వాళ్లని అరెస్టు చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చి జైలుకు పంపారు. కేవలం ఆరేడు నెలల్లోనే ఆ ముఠా ఇలాంటి నేరాల ద్వారా పాతిక కోట్లు దోచుకుందట.

కారు డ్రైవరుగా పనిచేసే ఒక వ్యక్తి ఆ ఆదాయం సరిపోవడం లేదని పెద్ద ప్లానే వేశాడు. నలుగురు స్నేహితులతో ఒక ముఠాని తయారుచేసుకున్నాడు. అందులో ఒక అందమైన అమ్మాయి ఉంది. యువకులను ఆకర్షించి వలలో వేసుకోవడం ఆమె పని. అప్పుడు తీసిన ఫొటోలను ఆ యువకులకు పంపి బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు సంపాదించడం మిగిలినవారి పని. అలా వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌కీ ఊరికీ కారులో తిరుగుతూ జల్సాలు చేస్తున్న ఆ వ్యక్తినీ ఈమధ్యే పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడలో ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు డేటింగ్‌ ఆప్‌లో థాయ్‌ మోడల్‌ని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ బెంగళూరులో కలుసుకోవాలనుకుని విమాన ఛార్జీల కోసం 50 వేలు ఆమె ఎకౌంట్‌లో వేశాడు. హోటల్‌ రూమ్‌ కూడా బుక్‌ చేశాడు. ఆ తర్వాత చూస్తే ఆమె ఖాతా డీయాక్టివేట్‌ అయింది. పోలీసుల దర్యాప్తులో ఆమె అడ్రసు మిజోరం అని తెలిసింది. యాభైవేలతో అయిపోలేదు, అతని వ్యక్తిగత వివరాలన్నిటినీ ఆమె ఇతర వెబ్‌సైట్లకు అమ్ముకుని కూడా డబ్బు సంపాదిస్తుంది. చాలావరకూ ఈ బ్లాక్‌మెయిల్‌ చేసేవాళ్లు బాధితుల్ని నేరుగా కూడా కలవడం లేదు. వీడియోకాల్‌తోనే దోపిడీ అయిపోతోంది. విలాసాలకు అలవాటు పడిన కొందరు చదువుకున్న యువకులు కూడా అమ్మాయిల పేర్లతో ఈ పని చేస్తున్నారు.
ఇటువంటి సంఘటనలు ఈ మధ్య తరచుగా వార్తల్లోకి వస్తున్నాయి. సైన్యమూ రాజకీయాల నుంచీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజల్లోకి వచ్చేసిన ‘వలపు వల’ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతోంది. అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

ప్రపంచమంతటా... గత కొంతకాలంగా ప్రపంచ దేశాలన్నీ ‘హనీట్రాప్‌’ అనేమాట వింటేనే వణికిపోతున్నాయి. రష్యా గూఢచర్య కార్యకలాపాల నుంచి అప్రమత్తంగా ఉండాలని అమెరికా రక్షణశాఖ తరచూ తమ సిబ్బందిని హెచ్చరిస్తూనే ఉంటుందట. చైనా వలలో చిక్కకుండా చూసుకోమని తమ రాజకీయ నాయకులకు ప్రత్యేక తరగతులు పెట్టి మరీ చెబుతుంటుంది. ఆ మధ్య చైనా కూడా తమ విద్యార్థులను తైవాన్‌ దేశీయుల వలలో పడొద్దంటూ మార్గదర్శకాలు జారీచేసింది. యూరోపియన్‌ యూనియన్‌ దౌత్యవేత్తలకైతే విదేశాల్లో పర్యటించేటప్పుడు ‘ఒళ్లు దగ్గర పెట్టుకోమని’ కాస్త గట్టిగానే చెబుతారట. అందుకు కారణం లేకపోలేదు. కొంతకాలం క్రితం ఇటలీ పాస్‌పోర్టు కార్యాలయ ఉన్నతాధికారి బెల్జియంలో ఓ సమావేశానికి హాజరయ్యాడు. అక్కడ పరిచయమైన ఒక యువతి గలగలా మాట్లాడుతూ వెన్నంటే తిరుగుతోంటే బాగా చదువుకున్న అమ్మాయని గౌరవంగా చూశాడు. రెండు రోజులయ్యేసరికి ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. చివరి రోజు రాత్రి హోటల్లో ఇద్దరూ ఒకే గదిలో గడిపారు. తెల్లారుతూనే ఆ యువతి లేచివెళ్లి గట్టిగా ఏడుస్తూ తనమీద అత్యాచారం జరిగిందని ఫిర్యాదుచేసింది. ఇంకేముందీ పోలీసులొచ్చి సంకెళ్లు వేశారు. దేశం పరువు తీసినందుకు తక్షణం ఉద్యోగం ఊడింది. అందుకే ‘తప్పు మీది కాదని తర్వాతెప్పుడో రుజువవడం వల్ల లాభంలేదు... ఆ పరిస్థితులకు దూరంగా ఉంటేనే మీకూ దేశానికీ కూడా గౌరవం’ అని ఫ్లైట్‌ ఎక్కేముందు అధికారులకు మరోసారి గుర్తుచేస్తారట. కీలక పదవుల్లో ఉన్న అధికారులను వలలో వేసుకుని రహస్యాలు రాబట్టడానికి శత్రుదేశాలే కానక్కరలేదు, మిత్రదేశాలూ అందుకు వెనకాడటం లేదట.ఇలా అందాన్ని వలగా వేసి తమకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకోవడమనేది కొత్త కళేమీ కాదు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనే ఉంది. మౌర్యుల కాలంలోనే అందమైన యువతులనూ వేశ్యలనూ గూఢచర్యం కోసం వాడుకునేవారట. ఆ తర్వాత కాలంలో గూఢచారులు మారువేషాలతో ఆ పనిచేస్తే ఈ డిజిటల్‌ యుగం గూఢచర్యాన్ని మరింత తేలిక చేసింది. స్మార్ట్‌ఫోన్లూ సోషల్‌మీడియా మంచి సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. దాంతో గత కొద్ది సంవత్సరాలుగా మన మిలిటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఈ ‘హనీ ట్రాప్‌’ వ్యవహారం. నిరంతర పోరాటం ‘కనిపించని శత్రువుని తూటాతో చంపలేము’ సైనిక శిబిరంలో పెద్ద అక్షరాలతో గోడమీద రాసి పెట్టుకున్న హెచ్చరిక ఫోను ముట్టుకున్నప్పుడల్లా గుర్తొస్తుంటుంది జవాన్లకి. రావాలనే అలా రాసిపెట్టుకున్నారు మరి.

సరిహద్దుల్లో కాపలా కాసేటపుడూ యుద్ధరంగంలో శత్రువుతో తలపడేటపుడూ ప్రాణాల్ని కాపాడుకోవడానికి సైనికులు బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లూ హెల్మెట్లూ వాడతారు. కానీ ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న పెద్ద శత్రువు సరిహద్దులకు అవతల లేదు... కంటోన్మెంట్‌ శిబిరాల్లో, సైనికుల చేతుల్లోనే ఉంది. తెరల మీద అందాలను ఆరబోస్తూ తీయని మాటలతో మత్తెక్కిస్తూ ఏవో లోకాల్లో తేలిపోయేలా చేసే వర్చువల్‌ శత్రువది. ఆ మత్తులో కూరుకుపోయి తమను తాము మర్చిపోయి శత్రువు చేతిలో దేశ రహస్యాల్ని పెట్టేస్తున్నారు కొందరు అమాయకులు. ఈ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలీక, నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండే జవాన్లను స్మార్ట్‌ఫోన్లు వాడొద్దని చెప్పలేక సతమతమవుతున్నారు అధికారులు. అప్పటికీ డేటింగ్‌, సోషల్‌ మీడియాకి సంబంధించి పలు ఆప్స్‌ని నిషేధించిన సైన్యం సామాజికమాధ్యమాలను వాడకూడదని సిబ్బందిని కట్టడి చేసింది. అయినా కొంతమంది నియమాలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. జూనియర్లే ఎక్కువగా ఈ వలలో పడుతున్నట్లు గుర్తించారు అధికారులు. దాంతో మిలిటరీ ఇంటెలిజెన్స్‌ విభాగం హనీట్రాప్స్‌ని గుర్తించడానికి తీవ్రంగా కృషిచేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘మాయాజాల్‌’ విభాగం ద్వారా సోషల్‌ మీడియాని జల్లెడ పడుతోంది.


వెలుగులోకి వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే, ఐఎస్‌ఐ- మన దళాల కదలికలూ మోహరింపునకు సంబంధించిన విషయాల్నీ, షిఫ్ట్‌ సమయాలూ ఉపయోగిస్తున్న వాహనాల వివరాలూ అవి వెళ్లే దారులూ.... తదితర సమాచారాన్నీ ఎక్కువగా సేకరిస్తోందని తెలుస్తోంది. పైకి ఇవన్నీ చిన్న విషయాలుగా అన్పిస్తాయి కానీ అవే చాలా పెద్ద సమస్యలకు దారితీస్తాయంటారు విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ డిబి శెకట్కర్‌. శత్రువు ఎప్పుడూ చిన్నగానే మొదలుపెడతాడు. మెల్లగా సమయం తీసుకుని నమ్మకమైన కాంటాక్టుని సంపాదించాకే వాళ్లకి పెద్ద టార్గెట్‌లు ఇస్తాడు. కాబట్టి అక్కడిదాకా వెళ్లకముందే సమస్యని మొదట్లోనే తుంచేయాలి... అంటారాయన.

ఎన్నో రకాలు!.. మన సైనిక రహస్యాలను తెలుసుకోడానికి పొరుగుదేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇన్నీ అన్నీ కావు. ‘పాకిస్తానీ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌(పీఐవో)’ పేరుతో ఓ ప్రత్యేక సంస్థే ఉంది. ఐఎస్‌ఐకి సాయంగా ఈ సంస్థ కాల్‌ సెంటర్లు నిర్వహిస్తోంది. అక్కడ పనిచేసే యువతులు భారతీయ పేర్లకు అందమైన అమ్మాయిల ఫొటోలు జతచేసి సోషల్‌ మీడియాలోనూ డేటింగ్‌ వెబ్‌సైట్లలోనూ ఖాతాలను తెరుస్తారు. కీలకమైన విభాగాల్లో పనిచేసేవారిని వెతికి ఫ్రెండ్‌ రిక్వెస్టులు పెడతారు. వారి పోస్టుల దగ్గర ‘జైహింద్‌’ అనో ‘మాకోసం మీరు కష్టపడుతున్నందుకు ధన్యవాదాలు’ అనో కామెంట్లు పెడతారు. అవి చూసి సైనికులు ఉప్పొంగిపోతారు. ఆనందంగా స్నేహహస్తం చాస్తారు. ఒక్కో ఏజెంటూ రోజూ కనీసం 50 ఖాతాలను నిర్వహిస్తూ ఇలా సైనికులకు వల వేసే పనిలో ఉంటారని అంచనా. స్నేహం చాటింగ్‌లోకీ అక్కడినుంచి మాటల్లోకీ మారుతుంది కాబట్టి వారికి భారతీయ భాషల్లోనూ, ఉచ్చారణలోనూ శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు ఒక యువతి తాను మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో ఉన్నట్లు నర్సు దుస్తుల్లో ఫొటోలు పెడుతుంది. సరదా కబుర్లతో నవ్విస్తూ పరిచయం పెంచుకుంటుంది. ఆత్మీయంగా కుటుంబ వివరాలు కనుక్కుంటుంది. ముఖాన బొట్టూ, చేతికి పసుపుతోరంతో వెనకాల గాంధీ బొమ్మో, త్రివర్ణపతాకమో ఉండేలా తీసుకున్న డీపీలతో ఏమాత్రం అనుమానం రాకుండా ఉంటాయి వాళ్ల ఫొటోలు. వీడియోలో కన్పించేటపుడు కూడా ఈ నేపథ్యం ఉండేలా జాగ్రత్తపడతారు. ఫొటోలు అవే... పేర్లు మాత్రం మారుతూ ఉంటాయి. ఎవరిని టార్గెట్‌ చేస్తున్నారో వారికి తమ ప్రాంతం వారే అనిపించేలా ఇంటిపేర్లూ పెట్టుకుంటారు. దాంతో ఏమాత్రం సందేహించకుండా వలలో పడిపోతున్నారు సిబ్బంది. ఏటికేడాదీ ఈ ఫేక్‌ ప్రొఫైల్స్‌ సంఖ్య పెరిగిపోతోందంటున్నారు అధికారులు. ఇక, మనదేశంలో వివాహ సంబంధాలకోసం వెబ్‌సైట్లమీద ఆధారపడే అలవాటు ఉందని తెలుసుకున్న ఐఎస్‌ఐ- పెళ్లికొడుకులుగానూ తమ ఏజెంట్లను ప్రవేశపెడుతోంది. శిక్షణ పొందిన ఈ ఏజెంట్లు మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో దొంగపేర్లతో నమోదు చేసుకుని సైనిక నేపథ్యం ఉన్న అమ్మాయిలతో స్నేహం పెంచుకుంటారు. వారి దగ్గర్నుంచీ సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు. వీళ్లంతా సోషల్‌ మీడియా ద్వారా వీడియో కాల్స్‌ చేయమంటారు. వాటిని రికార్డు చేసుకుని పరిసరాలను గమనిస్తూ తమకు పనికొచ్చే సమాచారాన్ని గ్రహిస్తారు. ఇటీవల యుద్ధవిద్యలు నేర్పే కళాశాల ఉన్న మధ్యప్రదేశ్‌లోని మహూలో ఇద్దరు యువతులు ఇలాంటి పెళ్లి సంబంధం బారినపడ్డారు. ఐదారేళ్ల క్రితం సైన్యంలో ఏడాదికి ఒకటీ రెండూ హనీట్రాప్‌ కేసులు బయటికొచ్చేవని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అలాంటిది గత ఏడాది ఏకంగా 200 మందిని అధికారులు అరెస్టు చేశారు.

డబ్బు కోసం... హనీట్రాప్‌ని సైనిక రహస్యాల కోసమే వాడతారనుకుంటే పొరపాటే. సామాన్య పౌరులనుంచి డబ్బు గుంజడానికీ ఇప్పుడిదో ఆయుధంలా మారింది. మధ్యప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం ఒక కేసు రాజకీయ, అధికార వర్గాలను తీవ్రంగా కుదిపేసింది. అశ్లీల వీడియోలను అడ్డం పెట్టుకుని కొందరు యువతులు ఓ ప్రభుత్వాధికారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ రూ.3 కోట్లు డిమాండ్‌ చేయడమే కాక, ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు చేసిపెట్టమనీ ఒత్తిడి తేవడంతో ఆ అధికారి భయపడి పోలీసుల సాయం తీసుకున్నాడు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టగా ఇంకెందరో రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు అందులో ఉన్నట్లు తెలిసింది.

మూణ్ణెల్లక్రితం చిక్‌మంగళూరులో ఒక వ్యక్తిని తెలిసిన మహిళ కుటుంబసభ్యుల వైద్యానికి ఆర్థికసాయం చేయమని కోరింది. అతడు నాలుగు రోజుల్లో ఏర్పాటుచేస్తానన్నాడు. డబ్బు తీసుకుని ఇంటికి రమ్మని అడ్రసు చెబితే స్నేహితుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు. గదిలోకి వెళ్లగానే తలుపులు వేసి అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అమ్మాయిలను అతని చుట్టూ నిలబెట్టి ఫొటోలు తీసి అతను తెచ్చిన డబ్బే కాక మరో 20లక్షలు ఇవ్వమని డిమాండ్‌ చేశారట. అతడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మొత్తం 13 మంది గ్యాంగ్‌ని అరెస్టు చేశారు. వారి దగ్గర చాలా ఫోన్లూ, వాటిల్లో మార్ఫింగ్‌ చేసిన అశ్లీల వీడియోలూ ఉన్నాయట. ఇలాంటి పలు సంఘటనలు గత కొన్ని నెలల్లోనే వేర్వేరు రాష్ట్రాల్లో జరిగాయి. ఒక రంగం అని లేదు, స్త్రీలా పురుషులా అన్న తేడా లేదు, వయసుతో సంబంధం లేదు... తమకు కావలసింది ఎవరి దగ్గర దొరుకుతుందో వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. బలహీనత కనిపెట్టి వల వేస్తున్నారు. అందుకే, చేతిలోని ఫోనులో కనిపించే బొమ్మ చేతికందుతుందని భ్రమపడవద్దు. కవ్వించి కబళించే ఆ బొమ్మలకు దూరంగా ఉంటేనే ఇంటికీ ఒంటికీ మంచిది... అని సూచిస్తున్నారు అధికారులు. అది గుర్తుంచుకుంటే వలలో చిక్కకుండా తప్పించుకోవచ్చు!

ఎన్నో కేసులు...

ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన కొన్ని కేసులు చూస్తే బాధితులు ఎంత తేలిగ్గా ఈ హనీ ట్రాప్‌లో చిక్కుకుంటున్నారో అర్థమవుతుంది.

  • ఒక కంపెనీలో మేనేజరు నుంచి ఉద్యోగికి ఈ-మెయిల్‌ వచ్చింది. తాను సమావేశంలో ఉన్నందున ఆస్పత్రిలో ఉన్న తన బంధువుకి అర్జెంటుగా యాభైవేలు పంపమనీ, మర్నాడు తాను చెల్లిస్తాననీ పై అధికారి మెయిల్‌లో చెప్పేసరికి మరో ఆలోచన లేకుండా ఆ మెయిల్‌లో ఇచ్చిన ఖాతాకి వెంటనే డబ్బులు వేసేశాడు ఉద్యోగి. మర్నాడు ఆఫీసుకు వెళ్లాక మేనేజరుకి ఆ విషయం చెప్పాడు. అది విని ఆయన ‘నేను నీకు అలాంటి మెయిల్‌ ఇవ్వలేదే, మావాళ్లు ఎవరూ ఆస్పత్రిలోనూ లేరు’ అన్నారు. అప్పుడొచ్చింది
    ఇద్దరికీ సందేహం. పరిశీలిస్తే తనకొచ్చిన మెయిల్‌ ఐడీలో ఒక్క అక్షరం తేడా ఉంది. దాన్ని ఉద్యోగి గమనించలేదు. మోసపోయానని అర్థమవగానే పోలీసులకు చెప్పాడు. హైదరాబాద్‌లో రెండు యూనివర్సిటీ వీసీల పేర్ల మీద ఇలా జరిగింది.
  • నిశాంత్‌ అగర్వాల్‌ భారత సైన్యానికి అవసరమైన సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్స్‌ తయారుచేసే బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌లో ఇంజినీరు. ఆ మిస్సైల్‌ సమాచారాన్ని లీక్‌ చేశాడన్న అభియోగంతో అఫీషియల్‌ సీక్రెట్స్‌ యాక్ట్‌ కింద అరెస్టై ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సదరన్‌ కమాండ్‌కి సంబంధించి పుణెలో ఉన్న మిలిటరీ ఇంటెలిజెన్స్‌ విభాగం గత రెండు నెలల్లోనే ఇలాంటి పది కేసులు వెలికితీసింది.
  • ఒకామె రాజకీయాల్లో పైకి ఎదగాలనుకుంది. డబ్బున్న కంట్రాక్టరుతో స్నేహం చేసింది. రిసార్టుల్లో గడిపింది. ఆ వీడియోలతో అల్లరి పెట్టకుండా ఉండాలంటే కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అతడు పోలీసు రిపోర్టు ఇవ్వడంతో ఇప్పుడు జైల్లో ఉంది.
  • ఎంబీఏ చదివి ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో తనతో స్నేహం చేసిన మహిళల చిత్రాలను సేకరించి వాటిని అశ్లీల వెబ్‌సైట్లకు అమ్ముతుండగా దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతని లాప్‌టాప్‌లో కొన్ని వేల ఫొటోలు ఉన్నాయట.
  • వికాస్‌కుమార్‌ రక్షణ శాఖకు చెందిన ఆయుధాల డిపోలో పనిచేసేవాడు. అతని ఖాతాలో తరచూ డబ్బు జమ అవడాన్ని గమనించిన అధికారులు విచారణ జరిపితే- కొన్ని ఫోన్‌ నంబర్లను సైనికుల వాట్సప్‌ గ్రూపుల్లో చేర్చినందుకు గూఢచారులనుంచి అందిన ప్రతిఫలమని తేలింది. వాట్సప్‌ సంభాషణల ద్వారా సమాచారం సేకరించడానికి గూఢచారులు ఏర్పాటుచేసుకున్న పద్ధతి అది.
  • నేవీలో పనిచేస్తూ ఫేస్‌బుక్‌, డేటింగ్‌ సైట్ల ద్వారా హనీట్రాప్‌లో ఇరుక్కుని భారతీయ నౌకలూ జలాంతర్గాములకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్‌ గూఢచారులకు చేరవేసిన 13 మందిని ఆ మధ్య పోలీసులు అరెస్టు చేశారు. ‘ఆపరేషన్‌ డాల్ఫిన్స్‌నోస్‌’ పేరుతో నిర్వహించిన ఇన్వెస్టిగేషన్‌లో ఇది బయటపడింది. అప్పటినుంచి నేవీ సిబ్బంది స్మార్ట్‌ ఫోన్లూ సోషల్‌ మీడియా వాడకుండా నిషేధం విధించారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.