ETV Bharat / city

Schools Reopened: రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభమైన పాఠశాలలు

author img

By

Published : Sep 1, 2021, 7:56 PM IST

Updated : Sep 1, 2021, 8:13 PM IST

దాదాపు ఏడాదిన్నర తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి(Schools Reopened). గతంలో పాఠశాలకు విద్యార్థులను పంపించేటప్పుడు వారి తల్లిదండ్రులు ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకున్నారో అలాంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను మంత్రి సందర్శించారు. రాజ్ భవన్ రోడ్​లోని ప్రభుత్వ పాఠశాలను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సందర్శించి.. విద్యార్థులకు కొవిడ్-19పై అవగాహన కల్పించారు.

Schools Reopened
పాఠశాలల ప్రారంభం

బడిగంటలు మోగాయి(Schools Reopened). పాఠశాలల్లో విద్యార్థుల సందడి మొదలైంది. దాదాపు 16 నెలల అనంతరం పునఃప్రారంభమైన పాఠశాలలకు తొలిరోజు 21.77శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ బడుల్లో 27.45, ప్రైవేట్ బడుల్లో 18.35 శాతం హాజరు నమోదయింది. జూనియర్‌ కళాశాలల్లో 15 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు పిల్లలందరిని మాస్క్ తప్పనిసరిగా ధరించేలా చూశారు. హాజరు సంఖ్య తక్కువే కావడంతో.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్​ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించి... అక్కడ మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, మూత్రశాలలు పరిశీలించారు. తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. చిన్నపిల్లలకు శానిటైజర్ వాడకాన్ని వివరించారు.

విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి

పాఠశాలల్లో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రిన్సిపాళ్లకు, డీఈవోలకు చెప్పామని మంత్రి తెలిపారు. జులై నుంచి నేటి వరకు ఒకటవ తరగతిలోనే సుమారు 1.25 లక్షల మంది విద్యార్థులు చేరారన్నారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల వరకు విద్యార్థుల ఉంటారని.. అందులో 30శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే వారే ఉన్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు.. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమయంలో కచ్చితంగా వెన్నంటి ఉండి చేతులు శుభ్రంగా కడుక్కునేలా చూడాలన్నారు.

కొవిడ్​ నిబంధనలు పాటించాలి

విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సూచించారు. రాజ్​భవన్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆమె కొద్దిసేపు విద్యార్థులతో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత స్కూల్​కి రావడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారని గవర్నర్ పేర్కొన్నారు. తోటి స్నేహితులతో మాట్లాడేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు. చాలారోజుల తర్వాత పాఠశాలలు ప్రారంభం కావడం.. తమ పిల్లలను పాఠశాలలకు పంపించడం సంతోషంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఆన్​లైన్ క్లాసులతో పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేసుకున్నారు.

విద్యార్థులు గదిలోకి వచ్చే ముందే వారికి శానిటైజ్​ చేస్తున్నాం. గదిలో భౌతిక దూరం పాటిస్తూ వారిని కూర్చోబెడుతున్నాం. ప్రతి ఒక్కరు మాస్కు ధరించేలా చూస్తున్నాం. విద్యార్థులను కరోనా నిబంధనలు పాటించేలా చేస్తున్నాం.

-ఉపాధ్యాయురాలు, హైదరాబాద్​

పాఠశాల ప్రారంభమైనందుకు సంతోషంగా ఉంది. ఆన్​లైన్​ తరగతులు అర్థం కాక ఇబ్బందిగా ఉండేది. భౌతిక దూరం పాటిస్తూ తరగతులు వింటున్నాం. మాస్కులు ధరిస్తున్నాం.

-విద్యార్థిని, హైదరాబాద్​

ఇదీ చదవండి: కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్

Last Updated : Sep 1, 2021, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.