ETV Bharat / city

తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

author img

By

Published : Apr 10, 2020, 1:26 AM IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 471 కి చేరింది. గురువారం నాడు కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 45 మంది డిశ్చార్జ్​ కాగా... 12 మంది మృతి చెందారు. మరో 60 మంది ఇవాళ డిశ్చార్జ్​ కానున్నారు. మర్కజ్​కు వెళ్లిన వచ్చినవారు, వారికి సంబంధించిన వారికి పరీక్షలు పూర్తైనందున ఈ నెల 22 వరకు కరోనా రహిత తెలంగాణగా మారనున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

corona cases update in telangana
తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

రాష్ట్రంలో మరో కరోనా మరణం చోటు చేసుకుంది. ఫలితంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 12 కి చేరింది. ఇక తాజాగా రాష్ట్రంలో 18 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 471కి చేరాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో మొత్తం 101 హాట్ స్పాట్​లు గుర్తించి... ఆయా ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాకుండా ఉండాలని, వారికి కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని మంత్రి ఈటల రాజేందర్ హమీ ఇచ్చారు. త్వరలో రాష్ట్ర ప్రజలకు టెలీ మెడిసిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు.

ఏప్రిల్ 22 నాటికి కరోనా రహిత రాష్ట్రం!

ప్రస్తుతం 45 మంది కోలుకొని డిశ్చార్జ్​ అయ్యారు. 414 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కేవలం ఒకరు మాత్రమే వెంటిలేటర్​పై ఉన్నట్టు మంత్రి ఈటల వెల్లడించారు. మరో 60 మంది కోలుకున్నారు. వారికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని, శుక్రవారం నాడు డిశ్చార్జ్​ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 388 మంది మర్కజ్ వెళ్లి వచ్చినవారు, వారితో సంబంధం ఉన్నవారేనని వైద్యారోగ్య శాఖ వివరించింది. ఈ నెల 22 నాటికి మర్కజ్​ నుంచి వచ్చిన వారు కూడా దాదాపుగా కోలుకునే అవకాశం ఉన్నందున త్వరలో తెలంగాణ రహితం అవుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

రక్తదానానికి ముందుకు రావాలి

కరోనా నివారణలో భాగంగా 70కోట్ల విలువైన వైద్య పరికరాలు కొనుగోలు చేయనున్నట్టు మంత్రి ఈటల స్పష్టం చేశారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కరోనాకు వినియోగిస్తున్నందున... ఓపీ సేవలు కింగ్ కోఠీ ఆసుపత్రికి మార్చినట్టు తెలిపారు. క్యాన్సర్ రోగులు, డయాలసిస్ పేషెంట్లకు కావాల్సిన పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గుతున్నాయన్న ఈటల... రక్తదానానికి ముందుకు రావాలని... అలాంటి వారికి వాహన సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు.

అంత్యక్రియలకు అయిదుగురే..

కరోనా నివారణకు వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్న సర్కారు... ఇప్పటికే మర్కజ్​కి సంబంధించిన కేసుల్లో దాదాపు వైద్య పరీక్షలు పూర్తైనందున ఇకపై కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. మరోవైపు కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల తరలింపునకు సంబంధించిన గైడ్​లైన్స్ విడుదల చేసింది. శవాలను పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత ప్రభుత్వమే నేరుగా శ్మశాన వాటికకు తరలిస్తుందని తెలిపారు. కేవలం ఐదుగురిని మాత్రమే అంత్యక్రియలకు అనుమతించనున్నట్టు స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి ఈటల విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.