ETV Bharat / business

మీ ఆదాయంపై కరోనా ప్రభావం ఎంతో తెలుసా?

author img

By

Published : Aug 18, 2020, 6:00 PM IST

కరోనా వల్ల దేశ ప్రజల తలసరి ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం భారీగా తగ్గొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది ఎస్​బీఐ తాజా నివేదిక. గోవా, దిల్లీలో సగటు ఆదాయం ఎక్కువగా క్షీణించొచ్చని పేర్కొంది. ఇందులో టాప్- 5లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తలసరి ఆదాయం తగ్గుదలపై ఎస్​బీఐ తెలిపిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

corona impact on per Capitat
వ్యక్తిగత ఆదాయంపై కరోనా ప్రభావం

కరోనా సంక్షోభం వల్ల ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోనుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. చాలా నివేదికలు, పరిశోధనలు ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇటీవల ఓ సర్వే ప్రకారం... దిల్లీ, గోవా, తెలంగాణ, హరియాణాలో నివసించే వారి తలసరి ఆదాయంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలిసింది.

తలసరి ఆదాయాల్లో తగ్గుదల ఇలా..

ఎస్​బీఐ సోమవారం విడుదల చేసిన ఎకోరాప్​ నివేదిక ప్రకారం.. దేశ రాజధాని దిల్లీలో నివసించే వారు ఈ ఆర్థిక సంవత్సరంలో తమ సగటు ఆదాయంలో రూ.87,223 కోల్పోవచ్చని వెల్లడైంది. ఇది జాతీయ సగటు రూ.27,000తో పోలిస్తే చాలా ఎక్కువ.

ఈ ఆర్థిక సంవత్సరంలో గోవాలో నివసించే వారి తలసరి ఆదాయం అత్యధికంగా రూ.1,05,906 తగ్గొచ్చని ఎస్​బీఐ నివేదిక అంచనా వేసింది.

రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో తలసరి ఆదాయం నష్టం వరుసగా రూ.47,727, రూ.67,883గా ఉండొచ్చని పేర్కొంది.

బిహార్​, అసోంలో నివసించే వారి తలసరి అదాయం అత్యల్పంగా రూ.8,739, రూ.9,800 తగ్గొచ్చని నివేదిక వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా ఇలా..

per capita loss state wise
రాష్ట్రాల వారీగా సగటు ఆదాయం తగ్గుదల

జీఎస్​డీపీ క్షీణత రూ.38 లక్షల కోట్లు!

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల రాష్ట్రీయోత్పత్తి (జీఎస్​డీపీ) అంచనాల ఆధారంగానే తలసరి ఆదాయంపై ప్రభావాన్ని లెక్కించినట్లు ఎస్​బీఐ ఎకోరాప్​ తెలిపింది.
  • కరోనా సంక్షోభంతో రాష్ట్రాల జీఎస్​డీపీ రేటు 16.9 శాతం తగ్గొచ్చని పేర్కొంది ఎస్​బీఐ. ఇది దాదాపు రూ.38 లక్షల కోట్లకు సమానం.
  • ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ క్షీణతలో టాప్​ 10 రాష్ట్రాల వాటానే 73.8 శాతం ఉంటుందని ఎస్​బీఐ నివేదిక అంచనా వేసింది. అందులో మహారాష్ట్ర 14.2 శాతం, తమిళనాడు 9.2 శాతం, ఉత్తర్​ప్రదేశ్​ 8.2 శాతం చొప్పున వాటా ఉండొచ్చని పేర్కొంది.

నాలుగ త్రైమాసికాల్లోనూ ప్రతికూల వృద్ధే..

  • ఇదిలా ఉండగా.. మేలో విడుదల చేసిన అంచనాలతో పోలిస్తే.. తాజా నివేదికలో దేశ జీడీపీ వృద్ధి రేటు క్షీణత అంచనాను 20 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించింది ఎస్​బీఐ.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సం నాలుగు త్రైమాసికాల్లోనూ ప్రతికూల వృద్ధి.. పూర్తి సంవత్సరానికి రెండంకెల వృద్ధి క్షీణత నమోదు కావచ్చని ఎస్​బీఐ అంచనా వేసింది.
  • దీనితో ఆగస్టు 31న జాతీయ గణాంక కార్యాలయం(ఎన్​ఎస్ఓ) విడుదల చేయనున్న 2020-21 జీడీపీ వృద్ధి రేటు గణాంకాలపై ఆసక్తి పెరిగింది.

రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 6.9 శాతం (ఎన్​ఎస్​ఓ అధికారిక లెక్కల ప్రకారం) కన్నా ఎక్కువే ఉండొచ్చని ఎస్​బీఐ పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితుల్లో రిటైల్ ద్రవ్యోల్బణంపై ఎన్​ఎస్​ఓ ప్రకటించిన లెక్కలు అంచనాలు మాత్రమేనని తెలిపింది. వాస్తవ రిటైల్ ద్రవ్యోల్బణం 7.5 శాతానికిపైగా నమోదై ఉంటుందని అంచనా వేసింది.

జీడీపీ క్షీణత, వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో.. వినియోగం, రికవరీ ఆశలు ఆవిరవుతున్నాయని ఎస్​బీఐ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:క్యూ1లో జీడీపీ వృద్ధి రేటు 16.5 శాతం క్షీణత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.