ETV Bharat / business

రుణగ్రహీతకు ఊరట- వైద్య రంగానికి ఊతం!

author img

By

Published : May 5, 2021, 8:11 PM IST

కరోనా సమయంలో రుణాలు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న చిన్న సంస్థలకు అండగా నిలిచింది ఆర్​బీఐ. తీసుకున్న అప్పు చెల్లించేందుకు మరింత సమయాన్ని ఇచ్చింది. కొవిడ్​పై పోరాటం చేస్తున్న భారత వైద్య ఆరోగ్య రంగానికి రూ. 50 వేల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

rbi, shaktikanta das
సంక్షోభ సమయంలో వైద్య రంగానికి ఆర్‌బీఐ అండ

కరోనా కాలంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు ఊరట కలిగించేలా, వ్యాక్సిన్ తయారీదారులు, ఆస్పత్రులకు ఊతం అందించేలా భారతీయ రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయాలు తీసుకుంది. చిన్న రుణగ్రహీతలు అప్పులు చెల్లించేందుకు మరింత సమయం ఇచ్చింది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు టీకా తయారీదారులు, ఆస్పత్రులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు వెసులుబాటు కల్పించింది.

రెండేళ్ల ఊరట..

రూ.25 కోట్ల వరకు రుణం తీసుకున్నవారు ఆ అప్పును తిరిగి చెల్లించే సమయాన్ని రెండేళ్ల మేర పెంచింది ఆర్​బీఐ. 2020లో రుణ పునర్​వ్యవస్థీకరణకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారికే తాజా నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఆర్​బీఐ నిర్ణయంతో మొత్తం రుణగ్రహీతల్లో 90శాతం మందికి రుణవ్యవస్థీకరణకు అవకాశం లభిస్తుందని భారతీయ బ్యాంకుల సంఘం తెలిపింది.

వైద్య రంగానికి ఊతం..

వైద్య రంగానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు రూ.50వేల కోట్ల మేర ద్రవ్యసాయం చేస్తామని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఈ నిధుల నుంచి టీకా తయారీదారులు, ఆస్పత్రులు, ఇతర వైద్య రంగ సంబంధిత సంస్థలకు రెపో రేటుపై మూడేళ్ల కాలవ్యవధితో రుణాలు ఇవ్వొచ్చని వివరించింది.

మరికొన్ని..

  • సెప్టెంబర్ 30 వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఓవర్​డ్రాఫ్ట్ సదుపాయం ఉపయోగించుకునేలా నిబంధనలు సడలింపు.
  • రెండు వారాల్లో రూ.35వేల కోట్లు విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు చేయనున్న ఆర్​బీఐ.
  • కేవైసీ నిబంధనలు సడలింపు- కొన్ని విభాగాల్లో వీడియో కేవైసీ విధానం అమలు.

అంతా తారుమారు!

కొవిడ్ తొలి దశ సంక్షోభం తర్వాత కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మరో సవాలును ఎదుర్కొంటోందని ఆర్​బీఐ పేర్కొంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ... ప్రజలపై ఒత్తిడి తగ్గించేలా అవసరమైన చర్యలు చేపడతామని భరోసా ఇచ్చింది.

స్వాగతించిన పరిశ్రమ వర్గాలు..

ఆర్​బీఐ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. రూ.50వేల కోట్లతో వైద్య రంగానికి ఊతమివ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్​ జాయింట్​ ఎండీ సంగీతా రెడ్డి చెప్పారు.

ఇదీ చూడండి: ఆ రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం: ఆర్​బీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.