ETV Bharat / business

Electric vehicles: ఆన్​లైన్​లో జోరుగా విద్యుత్ వాహన కొనుగోళ్లు!

author img

By

Published : Aug 22, 2021, 7:30 AM IST

ద్విచక్ర వాహన విభాగంలో విద్యుత్‌ వాహనాల(Electric vehicles) జోరు పెరిగింది. ఈ క్రమంలో అనేక అంకుర సంస్థలు ఈవీల తయారీకి ముందుకు రావడం ప్రారంభించాయి. దీంతో అనేక రకాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్‌ వాహన అంకుర సంస్థలు.. తమ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సంప్రదాయ డీలర్‌ మోడల్‌కు బదులు ఆన్‌లైన్‌లో విక్రయాలకే(electric vehicles buy online) ప్రాధాన్యం ఇస్తున్నాయి.

electric vehicle
విద్యుత్ వాహనాలు

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోలు ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. దీంతో సంప్రదాయ పెట్రోలు వాహనాలకు బదులు.. విద్యుత్‌ వాహనాలను(Electric vehicles) కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. విద్యుత్‌ కార్ల(Electric cars) విషయంలో ఈ మార్పు కాస్త నెమ్మదిగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ద్విచక్ర వాహన విభాగంలో విద్యుత్‌ వాహనాల జోరు పెరిగింది. అదీ ఆన్‌లైన్‌లోనే ఇ-బండి కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యక్తిగత వాహనం కొనడం అంటే.. ఒక పెద్ద ప్రక్రియ.. ముందుగా ఏ బండి కొనాలి అని నిర్ణయించుకోవాలి.. ఆ తర్వాత షోరూంకు వెళ్లి, అక్కడ బండి ఇచ్చే వరకూ ఓపిగ్గా ఎదురుచూడాలి.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ... ఇలా ఎంతో తతంగం ఉంటుంది. కానీ, విద్యుత్‌ వాహనాల రాకతో ఇదంతా మారిపోతోంది.

ఎన్నో మోడళ్లు...

ఏడాది క్రితం విద్యుత్‌ వాహనాలపై వినియోగదారులు అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ విభాగంలో కంపెనీలూ పెద్దగా మోడళ్లను విడుదల చేయలేదు. కొన్ని సంస్థలు మాత్రమే విద్యుత్‌ వాహనాల గురించి ఆలోచించాయి. కానీ, పెట్రోలు ధరలు ఒక్కసారిగా పెరిగి, లీటరు రూ.100 మించడంతో, విద్యుత్‌ స్కూటర్లకు గిరాకీ పెరిగిపోయింది. మరోవైపు కరోనా నేపథ్యంలో ఎంతోమంది సొంత వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొత్తగా వాహనాలను తీసుకోవాలనుకునే వారు తొలి ప్రాధాన్యంగా విద్యుత్‌ వాహనాలను పరిశీలిస్తున్నారు. దీంతో అనేక అంకుర సంస్థలు ఈవీ (విద్యుత్‌ వాహనాలు)ల తయారీకి ముందుకు రావడం ప్రారంభించాయి. దీంతో అనేక రకాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.

అందుబాటులోకి ఛార్జింగ్‌ స్టేషన్లు

విద్యుత్‌ వాహనాలకు ఛార్జింగ్‌ ఎలా అనేది ప్రధాన సమస్యగా ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని పెద్ద నగరాల్లో ఛార్జింగ్‌ పాయింట్లు అందుబాటులోకి వస్తున్నాయి.. కొన్ని ప్రైవేటు సంస్థలు, విద్యుత్‌ వాహన ఉత్పత్తి కంపెనీలు వీటిని విరివిగా ఏర్పాటు చేస్తున్నాయి. పెట్రోలు బంకుల్లోనూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి.. అందుకే, ఈవీల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అంతా ఆన్‌లైన్‌లోనే..

కొత్తగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్‌ వాహన అంకుర సంస్థలు.. తమ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సంప్రదాయ డీలర్‌ మోడల్‌కు బదులు ఆన్‌లైన్‌లో విక్రయాలకే(electric vehicles buy online) ప్రాధాన్యం ఇస్తున్నాయి. నేరుగా వినియోగదారుల దగ్గరకు చేరేందుకు ఇది సరైన మార్గం అని భావిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సంస్థలు కూడా ఆన్‌లైన్‌ పోర్టళ్లు ఏర్పాటు చేస్తుండగా, కొత్తగా వచ్చిన ఓలా ఎలక్ట్రిక్‌ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్కూటర్లను విక్రయించబోతోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ స్కూటర్‌ను ఇప్పటికే లక్ష మందికి పైగా రిజర్వు చేసుకున్నారు. ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ ఒక ట్వీట్‌లో ‘మీ స్కూటర్‌ను ఎలా కొనాలనుకుంటున్నారు’ అని అడిగిన ప్రశ్నకు 60.1శాతం మంది ఆన్‌లైన్‌, హోం డెలివరీ అని సమాధానం ఇవ్వగా.. 39.9శాతం మంది డీలర్‌ ద్వారా కొనాలని అనుకుంటున్నట్లు తేలింది.

రిజిస్ట్రేషన్‌ అవసరం లేకపోవడం వల్ల..

ప్రస్తుతం 250 వాట్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌, గరిష్ఠ వేగం 25 కిలోమీటర్లకన్నా తక్కువ ఉన్న విద్యుత్‌ స్కూటర్లకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. వీటిని నడిపేందుకు లైసెన్సూ అవసరం లేకపోవడంతో చాలామంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా విద్యుత్‌ వాహనాలకు ఆకుపచ్చ నెంబరు ప్లేటు ఉంటుంది. ఇందులో కొన్నింటిని 16 ఏళ్లలోపు వారు నడిపేందుకూ అనుమతి ఇవ్వడంతో.. పిల్లల కోసం వీటిని కొనేందుకు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు.

సర్వీసింగ్‌ ఇబ్బందులు లేకుండా..

డీలర్లు లేకుండా.. ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసిన వాహనాలను సర్వీసింగ్‌ చేయించడం ఎలా అనే సందేహం వాహనదారులకు వస్తోంది. దీనికీ ఆయా ఉత్పత్తి సంస్థలు పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. రిమోట్‌ సర్వీసింగ్‌ను అందించడంతోపాటు.. ఇంటికే వచ్చి సర్వీసింగ్‌ చేసే సేవలనూ అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా సర్వీసింగ్‌ స్టేషన్లతో ఒప్పందం కుదుర్చుకుని, సేవలను అందిస్తున్నాయి.

కార్ల పరిశ్రమ కూడా..

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల విక్రయాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రారంభం కాగా.. కార్ల కంపెనీలూ ఇదే పంథాలో ముందుకుసాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, హోండా, కియా, టయోటా, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, మెర్సిడెస్‌ బెంజ్‌ వంటి సంస్థలు డిజిటలీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. కొవిడ్‌ తర్వాత షోరూంలకు వస్తున్న వారి సంఖ్య తగ్గడంతో ఇవి డిజిటల్‌ బాటలోకి వెళ్తున్నాయి. అయితే, ఇంకా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయాలు సాగించే స్థాయికి ఇది చేరుకోలేదు. టెస్ట్‌ డ్రైవ్‌, డెలివరీలాంటివి మినహా, మిగతా ప్రక్రియలను డిజిటల్‌లోనే ముగిస్తున్నాయి.

ఇదీ చూడండి: 2025 నాటికి బైక్స్​లో 10 శాతం ఈవీలే!

ఇదీ చూడండి: విద్యుత్ వాహనాల మార్కెట్ ఏటా 26శాతం వృద్ధి!

ఇదీ చూడండి: రెండు సెకన్లకు ఒక ఈ-స్కూటర్‌ తయారీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.