ETV Bharat / breaking-news

TSPSC Paper Leak Case: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్టు

author img

By

Published : May 5, 2023, 8:31 AM IST

Updated : May 5, 2023, 9:30 AM IST

TSPSC
TSPSC

08:23 May 05

TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్టు

TSPSC Paper Leak Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల కొనుగోలు కేసులో ఓవైపు సిట్, మరోవైపు ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్టు చేసి విచారించిన సిట్ కీలక విషయాలను వెల్లడించింది. తాజాగా ఇవాళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లు కొనుగోలు చేసిన కేసులో భగవంత్, రవి కుమార్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. భగవంత్ తన తమ్ముడు రవి కుమార్ కోసం డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో భగవంత్ పని చేస్తున్నాడని చెప్పారు. డాక్యా నాయక్​ బ్యాంకు ఖాతాలో లావాదేవీల విచారణలో ఈ విషయం బయటపడినట్లు చెప్పారు.

TSPSC Paper Leakage Case Update: మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితులకు రూ.33.4 లక్షలు ముట్టినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. అయితే కొందరు నిందితులు నగదు తీసుకోగా.. మరికొందరు బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించుకున్నట్లు తేలిందని చెప్పారు. ఇందులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ కుమార్‌కు రూ.16 లక్షలు మేర ముట్టినట్లు వెల్లడైంది. ఏఈ సివిల్‌ ప్రశ్నపత్రాన్ని నిందితుడు.. గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుకా రాథోడ్‌, ఆమె భర్త డాక్యాకు ఇచ్చేందుకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. రేణుక తన సోదరుడు కేతావత్‌ రాజేశ్వర్‌ కోసం ఆ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసింది. తర్వాత కేతావత్‌ రాజేశ్వర్‌, డాక్యాలు ఆ పేపర్ని అయిదుగురికిగానూ రూ.10 లక్షల చొప్పున విక్రయానికి బేరం పెట్టారు. కానీ అనుకున్నంతలో మొత్తంలో అందరూ ఇవ్వలేదు.

SIT Inquiry in TSPSC Paper Leak Case : గోషాల్​నాయక్​ రూ.8 లక్షలు, ప్రశాంత్​రెడ్డి రూ.7.5 లక్షలు, రాజేంద్రకుమార్​ రూ.5 లక్షలు, నీలేశ్​నాయక్​ రూ.4.95 లక్షలు వెంకటజనార్దన్​ రూ.1.95 లక్షలు ఇవ్వగా.. మొత్తం రూ.27.4 లక్షలు వచ్చాయి. అయితే వెంకటజనార్దన్​ ఒక్కడే నగదును డాక్యా బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. మిగతావారు నగదును ఇచ్చారు. ఇందులో రూ.10 లక్షలను ప్రవీణ్​ కుమార్​కు ఇవ్వగా.. వారికి ఇంకా రూ.17.4 లక్షలు మిగిలాయి.

పేపర్​ లీకేజీ కేసు.. చేతులు మారిన రూ.33.4 లక్షలు: మరోవైపు డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో) ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌ కుమార్‌.. సాయిలౌకిక్‌, సాయిసుస్మిత దంపతులకు విక్రయించాడు. ఇందుకోసం వారు ప్రవీణ్​ కుమార్​కు రూ.6 లక్షలు ఇచ్చారు. అలా ఈ ప్రశ్నపత్రాల కేసులో ప్రవీణ్​ కుమార్​కు రూ.16 లక్షలు, డాక్యా, రాజేశ్వర్​లకు రూ.17.4 లక్షలు కలిపి ఈ మొత్తం వ్యవహారంలో రూ.33.4 లక్షలు చేతులు మారాయని కోర్టుకు సిట్ నివేదించింది.

బ్యాంకు ఖాతాల స్తంభన.. సొమ్ము జప్తు: డీఏవో పేపర్​ అమ్మడంతో వచ్చిన సొమ్మును ప్రవీణ్‌ కుమార్‌ బ్యాంకులోనే దాచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాలాపూర్‌ క్రాస్‌రోడ్డు ఎస్‌బీఐ శాఖలోని అతని ఖాతాలో ఉన్న ఆ సొమ్మును సిట్‌ స్తంభింపజేసింది. రేణుక దంపతుల నుంచి తనకు వచ్చిన రూ.10 లక్షల్లో.. రూ.3 లక్షల్ని ప్రవీణ్‌ కుమార్‌ తన మేనమామ శ్రీనివాసరావుకు అవసరం నిమిత్తం ఇచ్చాడు. ప్రవీణ్‌పై కేసు నమోదైన అనంతరం.. శ్రీనివాసరావు గత మార్చి 28వ తేదీన ఆ డబ్బును సిట్​కు అప్పగించాడు.

ఆ సొమ్ముతో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు: ఏఈ సివిల్‌ ప్రశ్నపత్రాల అమ్మడంతో వచ్చిన సొమ్ములో నుంచి కొంత మొత్తంతో రాజేశ్వర్‌ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేశాడు. మన్సూర్‌పల్లి తండాలో రూ.3 లక్షలతో హైమాస్ట్‌ లైట్ల బిగింపు పనులు, రూ.1.8 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పైపుల పనులు చేపట్టాడు. అప్పులు తీర్చేందుకుగానూ రూ.4.5 లక్షలు వెచ్చించాడు. డాక్యా బ్యాంకు ఖాతాలో రూ.3.95 లక్షలున్నట్లు గుర్తించి సిట్​ అధికారులు స్తంభింపజేశారు.

గ్రూప్‌-1 ప్రశ్నపత్రం ఉచితంగానే!: గ్రూప్‌-1 పేపర్‌ను నిందితుడు అట్ల రాజశేఖర్‌రెడ్డి.. న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ సానా ప్రశాంత్‌తో పాటు టీఎస్‌పీఎస్సీలో ఏఎస్‌వోగా పనిచేసిన షమీమ్‌కు ఉచితంగా ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అలాగే ప్రవీణ్‌ కుమార్‌ సైతం గ్రూప్‌-1 పేపర్ని కమిషన్‌లో డేటాఎంట్రీ ఆపరేటర్‌ రమేశ్‌కుమార్‌, టీఎస్‌పీఎస్సీ మాజీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి సురేశ్‌కు ఉచితంగా వెల్లడైంది.

ఇవీ చదవండి:

Last Updated : May 5, 2023, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.