ETV Bharat / bharat

దిల్లీ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం.. అవినీతి రహిత పాలన కోసమే చట్టమన్న అమిత్ షా

author img

By

Published : Aug 7, 2023, 10:10 PM IST

Updated : Aug 7, 2023, 10:56 PM IST

Delhi Bill Passed In Parliament : విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. 'దిల్లీ' బిల్లు పార్లమెంట్​లో ఆమోదం పొందింది. అయితే, ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధ చర్య అని కాంగ్రెస్​ విమర్శించింది.

Delhi Services Bill Passed In Rajya Sabha
Delhi Services Bill Passed In Rajya Sabha

Delhi Bill Passed In Parliament : విపక్షాల అభ్యంతరాల మధ్యే 'దిల్లీ' బిల్లుకు పార్లమెంట్​ ఆమోద ముద్ర వేసింది. సోమవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టిన 'దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు'పై చర్చ అనంతరం.. పెద్దల సభ పచ్చజెండా ఊపింది. దిల్లీ సర్వీసుల బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. సాంకేతిక సమస్య నేపథ్యంలో.. ఓటింగ్​ను స్లిప్పుల ద్వారా నిర్వహించారు. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఈ బిల్లు చట్టంగా మారనుంది. అంతకుముందు సభలో మాట్లాడిన షా.. ఈ బిల్లు సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదన్నారు. దిల్లీలో అవివీతి రహితమైన పాలనావ్యవస్థ తమ లక్ష్యమని పేర్కొన్నారు.

కాంగ్రెస్​కు ఆ హక్కులేదు : అమిత్ షా
'దిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్​లపై ఎలాంటి తగాదాలు లేవు, సీఎంలకు ఇబ్బందులు లేవు. 2015లో 'ఆందోళన్' ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేంద్రం అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుందని అంటున్నారు. భారత ప్రజలు అధికారం, హక్కును అందించినందున కేంద్రం అలా చేయవలసిన అవసరం లేదు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల నుంచి అందమైన, పొడవైన పదాలు చెప్పడం ద్వారా అసత్యం నిజం అయిపోదు. ఈ బిల్లు ఎమర్జెన్సీ విధించడానికి రాజ్యంగ సవరణ చేయలేదు. ప్రజల హక్కులపై ఈ బిల్లు ఎమర్జెన్సీ విధించదు. వారు హక్కులను హరించదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్​కు లేదు. ప్రజలు హక్కులను రక్షించడానికే మేము ఈ బిల్లును తీసుకొచ్చాము. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకే దిల్లీ సర్వీస్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది' అని విపక్షాలపై అమిత్​ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  • #WATCH | They (AAP govt) transferred officers in Vigilance Department because files related to 'excise scam' were lying there...: Union Home Minister Amit Shah on the National Capital Territory of Delhi (Amendment) Bill, 2023 in the Rajya Sabha. pic.twitter.com/vWHDiNF0sQ

    — ANI (@ANI) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ఈ బిల్లు పూర్తిగా, చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని మాజీ సీజేఐ, రాజ్యసభ ఎంపీ రంజన్ గగోయ్​ అన్నారు. ఈ దిల్లీ బిల్లుపై చర్చకు మాజీ ప్రధాన మంత్రి మన్​మోహన్ సింగ్ హాజరయ్యారు.
  • #WATCH | "...To me the bill is correct, right...," says Rajya Sabha MP and former CJI Ranjan Gogoi on The Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023. pic.twitter.com/uDZYZMbLdM

    — ANI (@ANI) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Monsoon session of Parliament | Former Prime Minister Dr Manmohan Singh attends the Rajya Sabha session during a discussion on The Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023. pic.twitter.com/d9IVdU5Cka

    — ANI (@ANI) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బీజేపీపై కాంగ్రెస్, ఆప్ ఫైర్​.. బీజేడీ, వైఎస్​ఆర్​సీపీకి హెచ్చరిక..
వివాదాస్పదమైన దిల్లీ బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్‌, ఆప్‌ తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని 'కంట్రోల్‌ ఫ్రీక్ సర్కార్‌(నియంతృత్వ ధోరణి)' అంటూ విమర్శించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నేత అభిషేక్ సింఘ్వి.. మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. 'మనమంతా కలిసికట్టుగా ఈ బిల్లును వ్యతిరేకించాలి. ఎందుకంటే ఈ తరహా ఫెడరలిజం ఏదో ఒక రోజు మీ (ఇతర రాష్ట్రాలు) ఇంటి తలుపు కూడా తట్టొచ్చు' అని సింఘ్వి బిల్లుకు మద్దతు ఇచ్చిన వైఎస్​ఆర్​సీపీ, బీజేడీ పార్టీలను హెచ్చరించారు. ఈ సందర్భంగా జర్మన్ థియోలాజియన్ మార్టిన్ నీమొల్లర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 'క్లిష్టసమయంలో మనం ఎవరి తరఫున నిల్చోకుండా తప్పించుకుంటే.. మనకు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన తరఫున నిల్చొని మాట్లాడటానికి ఎవరూ ఉండరు' అని అన్నారు.

'ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం'
దిల్లీ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం అన్నారు. ఈ విషయం వారికి, న్యాయ శాఖకు తెలుసునన్నారు. ఈ బిల్లుకు బీజేపీ ఎలాగైనా మద్దతు ఇస్తుందని.. కానీ బీజేడీ, వైఎస్​ఆర్​సీపీ అర్ధ హృదయంతో మద్దతు ఎందుకు ఇచ్చారో తనకు అర్థం కావడం లేదన్నారు. 'ఈ బిల్లు కోసం ప్రభుత్వం ఒకసారి ప్రయత్నించింది.. విఫలమైంది. రెండోసారి ప్రయత్నించి విఫలమైంది. మూడోసారి కూడా ప్రయత్నిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు.

  • VIDEO | "I appeal to the House not to proceed with this bill because this bill (Delhi services bill) is unconstitutional. Law ministry knows it is unconstitutional. This government will face a spectacular failure when this bill is taken up," says Congress MP @PChidambaram_IN on… pic.twitter.com/KNJN6cnijZ

    — Press Trust of India (@PTI_News) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదు : కేజ్రీవాల్
పార్లమెంట్​ ఆమోదించిన దిల్లీ సర్వీసుల బిల్లుపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిచారు. 'సుప్రీంకోర్టు ఆదేశాలను మోదీ పాటించడం లేదు. బీజేపీని ఓడించి దిల్లీలో జోక్యం చేసుకోవద్దని ప్రజలు స్పష్టంగా చెప్పారు. కానీ ప్రధాని ప్రజలు చెప్పింది వినడానికి ఇష్టపడడం లేదు. పార్లమెంట్‌లో అమిత్‌షా మాట్లాడుతూ.. చట్టాలు చేసే అధికారం వారికే ఉందన్నారు. ప్రజల కోసం పని చేయమని మీకు అధికారం ఇచ్చారు. వారి హక్కులను హరించడానికి కాదు. దిల్లీ ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు. ఎన్నికల్లో నన్ను గెలిపించి తమ మద్దతును చూపించారు. మేము చేసే మంచి పనిని బీజేపీ అడ్డుకోడానికి ప్రయత్నిస్తోంది. అభివృద్ధి పనులకు అడ్డుపడుతోంది. నన్ను పని చేయకుండా ఆపాలని చూస్తున్నారు. ఈసారి వారిని ఒక్క సీటు కూడా ప్రజలు గెలవనివ్వరు' అని కేజ్రీవాల్ మండిపడ్డారు.

'డేటా ప్రొటెక్షన్‌' బిల్లుకు లోక్‌సభ ఆమోదం..
Digital Personal Data Protection Bill 2023 Passed In Lok Sabha : దేశ పౌరుల డిజిటల్‌ హక్కులను బలోపేతం చేయడం.. దీంతోపాటు వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా ఝుళిపించేందుకు వీలుగా తీసుకొచ్చిన 'డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు 2023'కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. గతవారం ఈ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టంది. అయితే, సోమవారం దీనిపై చర్చ చేపట్టగా.. విపక్షాలు నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. భద్రతా కారణాలరీత్యా పౌరుల డేటాను వినియోగించుకునే అధికారం కేంద్ర సంస్థలకు ఉంటుంది. వ్యక్తిగత సమాచార గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, ఆన్‌లైన్‌ వేదికలు పౌరుల డేటాను అనుమతి లేకుండా వినియోగించుకోవడాన్ని నిషేధించేలా చట్టం చేయాలని అత్యున్నత న్యాయస్థానం 2017లో ఆదేశించింది. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది.

Data Protection Bill 2023 : ఈ బిల్లు ప్రకారం.. డిజిటల్‌ వినియోగదారుల డేటా గోప్యతను కాపాడలేకపోయినా.. సమాచార దుర్వినియోగానికి పాల్పడినా సదరు కంపెనీలపై కనిష్ఠంగా రూ.50కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించాలనే నిబంధనను తీసుకొచ్చారు. ఈ డేటా ప్రొటెక్షన్ చట్టం అమలు కోసం 'డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా'ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ బోర్డు, దాని సభ్యులు, ఉద్యోగులు, అధికారులు తీసుకునే నిర్ణయాలపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు ఉండవని బిల్లులో తెలిపారు. అయితే, కొన్ని ప్రత్యేక కేసులలో వ్యక్తిగత గోప్యత రక్షణ నుంచి మినహాయింపులు ఉంటాయి. దేశ సార్వభౌమత్వం, సమైక్యత విషయంలో ఇది వర్తించదు. దేశ రక్షణ, విదేశీ సంబంధాల విషయాల్లోనూ ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంటుంది. తీవ్రమైన నేరాలు, కోర్టు ఆదేశాల్లోనూ కూడా వర్తించదు.

లోక్​సభ ముందుకు 'దిల్లీ బిల్లు'.. చట్టం చేసే హక్కు ఉందన్న షా.. ప్రజాస్వామ్యంపై దాడి అంటూ ఆప్ ధ్వజం

వివాదాస్పద 'దిల్లీ' బిల్లుకు లోక్​సభ ఆమోదం

Last Updated : Aug 7, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.