న్యాయ ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు ఐపీసీ, సీఆర్పీసీ శిక్షాస్మృతిలో మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అత్యాచారం వంటి ఘోరమైన నేరాల్లో న్యాయం వేగంగా జరిగేలా ప్రకియలో మార్పులు తెస్తామని ఆయన స్పష్టం చేశారు.
సలహాలు ఇవ్వండి..
ఐపీసీ, సీఆర్సీపీ శిక్షాస్మృతుల సమగ్ర పరిశీలనకు సలహాలు పంపాలని కేంద్ర హోంశాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలను కోరింది. మహారాష్ట్రలోని పుణెలో నిర్వహించిన డీజీపీ, ఐజీ 54 వార్షిక సదస్సులో పాల్గొన్న షా.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శిక్షాస్మృతుల్లో మార్పులు తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని వెల్లడించారు.
రాష్ట్రాల్లో అఖిల భారత పోలీస్ విశ్వవిద్యాలయం, అఖిల భారత ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తుందని అమిత్ షా వెల్లడించారు. దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరును ప్రశంసించిన షా.. పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ పోలీస్ స్టేషన్లకు హోంమంత్రి ట్రోఫీలను బహూకరించారు.
ఇదీ చూడండి: సోనియా పుట్టిన రోజు వేడుకలు రద్దు.. కారణమిదే!