YSR SUNNA VADDI FUNDS RELEASE: అమలాపురంలో 'వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం' నిధులు విడుదల చేయనున్న సీఎం
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-08-2023/640-480-19237728-550-19237728-1691730995769.jpg)
CM YS JAGAN WILL RELEASE YSR SUNNA VADDI SCHEME FUNDS TODAY : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు రుణాలకు సంబంధించి బ్యాంకులకు చెల్లించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తిరిగి మహిళలకు చెల్లించనుంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది మహిళలకు బ్యాంకులకు చెల్లించిన 1,353.76 కోట్ల రూపాయల వడ్డీని రీయింబర్స్ చేయనుంది. శుక్రవారం డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి.. నేరుగా మహిళల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి మహిళలకు సున్నా వడ్డీ చెల్లించనున్నారు. నేడు అందిస్తున్న 1,353.76 కోట్ల రూపాయలతో కలిపి "వైఎస్సార్ సున్నావడ్డీ పథకం" కింద ఇప్పటి వరకు 4,969.05 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.