YCP leaders attacked on TDP leaders: అధికారుల సమక్షంలోనే రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ నాయకులపైకి కుర్చీలు ఎత్తి..
YCP leaders attacked on TDP leaders: ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, అధికార పార్టీ నేతలను, ముఖ్యమంత్రిని విమర్శించినా భౌతిక దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు.. ఇపుడు సమావేశాల్లోనూ గందరగోళం సృష్టిస్తున్నారు. సమస్యలను అధికారులకు వివరించే ప్రయత్నాలనూ సహించడం లేదు. తోటి ప్రజాప్రతినిధులపై దాడిచేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాజకీయ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకులు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ నేతలు గందరగోళం సృష్టించారు. ఓట్ల తొలగింపు అంశంపై తెలుగు దేశం నాయకులు జడ్పీ సీఈఓకు వివరిస్తున్న సమయంలో అడ్డుగా మాట్లాడుతూ సమావేశాన్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఒక దశలో టీడీపీ నాయకులపైకి కుర్చీలు ఎత్తి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు, అధికారులు, రాజకీయ పార్టీల మధ్య ఎంపీడీవో కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఓట్ల తొలగింపుపై జడ్పీ సీఈఓకు సమస్యను చెప్తుతున్నప్పుడు అడ్డుగా వచ్చి కుర్చీలతో దాడికి యత్నించారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.