YCP Followers Encroachment of Plots at Gunadala: గుణదలలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. స్థలాల కబ్జాకు యత్నం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2023, 7:43 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-08-2023/640-480-19329833-thumbnail-16x9-encroachment-of-plots-in-vijayawada.jpg)
Encroachment of Plots in Vijayawada: విజయవాడ శివారు ప్రాంతమైన ఒకటో డివిజన్లో ఓ స్థల వివాదం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గుణదల ఒకటో డివిజన్లోని సర్వే నెంబరు 117/2లో 15 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన 16 ప్లాట్లను.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకుల పేరు చెప్పి.. ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు వాపోయారు. తమ ప్లాట్లలోకి వెళ్లకుండా వారు కంచె అడ్డుగా ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితులు అంతా కలిసి వారి ఫ్లాట్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని వైసీపీకి చెందిన కొందరు నాయకులు, ఓ మహిళ అడ్డుకుంటూ ఆ ప్రాంతమంతా హల్చల్ చేశారు. అడ్డొచ్చిన వారిపై దాడికి యత్నించారు. ఈ విషయంలో బాధితులకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు మద్దతు పలుకగా.. అక్రమణ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి దేవినేని అవినాష్ వర్గీయులు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ ఇరు వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కావడంతో.. గుణదల పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ విషయం పట్ల అసలు అక్కడ గొడవే జరగలేదని తొలుత బుకాయించిన పోలీసులు.. అందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావటంతో కంగుతిన్నారు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.