Janasena Leaders on Volunteer: వాలంటీర్ నిర్వాకం.. పింఛన్ అడిగితే ఇంటికి నిప్పు పెట్టాడు
Janasena Leaders Complaint on Volunteer: గత కొద్ది రోజులుగా వాలంటీర్లు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆములూరులో వాలంటీర్ దౌర్జనానికి పాల్పడుతున్నాడంటూ జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు. పింఛన్ రావడం లేదని, సమస్యలపై ప్రశ్నించినందుకు ఓ ఇంటికి వాలంటీర్ నిప్పంటించాడని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఆములూరు గ్రామానికి చెందిన శీనయ్య అనే వ్యక్తి గుడిసెను.. వాలంటీర్ సుబ్రమణ్యం నిప్పంటించాడని జనసేన నేత షాన్ వాజ్ తెలిపారు. అర్హులకు పింఛన్లు రావడం లేదని.. నిలదీస్తున్నందుకే ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నచ్చిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. నచ్చని వారిపై దాడులు చేస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. వైసీపీ కార్యకర్తలను.. వాలంటీర్లుగా దూరం చేయాలని సూచిస్తున్నారు. వాలంటీర్లను రాజకీయాలకతీతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై తోటపల్లి గూడూరు పోలీసులకు.. జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.