Villagers are Objecting to road Repairs: రాత్రికి రాత్రే వెలిసిన రోడ్డు.. గవర్నర్ వస్తే తప్ప మా బాధలు పట్టవా? అని గ్రామస్థుల ఆగ్రహం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 3:43 PM IST
Villagers are objecting to road repairs in Kuragallu: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో రోడ్లను అధికారులు రాత్రికి రాత్రే మరమ్మతు చేశారు. హడావుడిగా మరమ్మతు చేయడంపై గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. ఈ నెల 2న తెలంగాణ గవర్నర్ తమిళసై ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి ఈ గ్రామం మీదుగా వెళ్లనున్నారు. గవర్నర్ రాక సందర్భంగా కురగల్లు గ్రామంలో అధికారులు రాత్రికి రాత్రి గుంతలను పూడ్చారు. దీనిపై గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. ఎన్నో సార్లు రోడ్డు వేయాలని అడిగినా కనీసం స్పందించలైదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండేది అంతా పేదలు అందుకనే ఈ రోడ్డు వేయలేదని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా గత నాలుగేళ్లుగా రోడ్డు వేయాలని అధికారులకు, ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డికి అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్ర గవర్నర్ వస్తున్నారని రాత్రికి రాత్రి ఆగమేఘాల మీద స్పందించిన అధికారులు ఇన్ని రోజులు తమను ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు.