TDP Varla Ramaiah on Bhuvaneshwari Yatra భువనేశ్వరి యాత్రపై ఈనెల 21నే డీజీపీకి లేఖ రాశాం! జగన్, సజ్జల చేతిలో ఆటబొమ్మ కావొద్దు..: వర్ల రామయ్య
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 4:52 PM IST
|Updated : Oct 24, 2023, 5:39 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-10-2023/640-480-19846433-thumbnail-16x9-varla-comments.jpg)
Varla Comments on nijam gelavali yatra permission: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి చేపట్టనున్న నిజం గెలవాలి యాత్రపై ఈ నెల 21న డీజీపీ (DGP) కి లేఖ రాశామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. అయినా డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి... యాత్ర గురించి తెలియదని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. యాత్రలో భువనేశ్వరికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మంత్రి రోజా వ్యవహరించిన తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని.. ఆమె ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు.
నారా భువనేశ్వరి గారి యాత్ర కోసం అనుమతి కోరుతూ... తానే స్వయంగా డీజీపీకి మెయిల్ పెట్టానని తెలిపారు. ఆ లేఖలో ఈ నెల 25వ తేదీ నుంచి యాత్ర చేపట్టనున్నట్లు డీజీపీకి తెలిపామని పేర్కొన్నారు. డీజీపీ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో ఆటబొమ్మా అంటూ వర్ల ప్రశ్నించారు. మళ్లీ లేఖ పంప మంటే పంపిస్తామని తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను ప్రజలకు తెలియజేయడానికే భువనేశ్వరి ప్రజల్లోకి వస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యంగాన్ని ఉల్లంగిస్తూ ఏపీలో వైసీపీ నేతలు మానవ హక్కులను కాలరాస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల ఛైర్మన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీలో ఓ ప్రాంతంలో ఉన్న వ్యక్త మరో ప్రాంతానికి వెళ్లాలంటే వైసీపీ నేతల పర్మిషన్ అవసరమా అంటూ ఎద్దేవా చేశారు.