రైతులకు నిధులు, ఉచిత కరెంట్పై జగన్ ప్రభుత్వం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: సోమిరెడ్డి
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 7:23 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-11-2023/640-480-19967871-thumbnail-16x9--somireddy-fire-on-ysrcp-govt.jpg)
TDP Leader Somireddy Fire on YSRCP Govt: రైతులకు నిధులు, ఉచిత కరెంట్ అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతుందని.. మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షిర్డీసాయి, అదానీ కంపెనీలకు దోచిపెట్టడం తప్ప.. జగన్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. గత నాలుగున్నరేళ్లలో రైతుల కోసం లక్షా 75 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వైసీపీ ప్రభుత్వం అబద్ధపు ప్రకటనలు చేస్తోందని సోమిరెడ్డి విమర్శించారు.
Somireddy Comments: ''రైతుల విషయంలో జగన్ ప్రభుత్వం అబద్ధపు ప్రకటనలు చేస్తోంది. వాస్తవం ఏంటంటే.. రూ.36 వేల కోట్లు కూడా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ధాన్యం కొనుగోలుకు రూ.66వేల కోట్లు, ఉచిత విద్యుత్కు రూ.56 వేల కోట్లు ఖర్చు చేశామనడం బూటకం. ప్రభుత్వం ఇంత మొత్తంలో ఖర్చు చేస్తుంటే.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రాలో రైతు తలసరి అప్పు రూ.2.45 లక్షలు ఎందుకుంది..? ఆత్మహత్యల్లోనూ మన రాష్ట్రం మొదటి స్థానంలో ఎలా ఉంది..? రాష్ట్రంలో కరవు ఎందుకు తీవ్రంగా ఉంది..? 470 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. కేవలం 103 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడం దారుణం. రైతుల వద్దకు వెళ్లి వారి పరిస్థితి తెలుసుకునే దమ్ము వైసీపీ మంత్రులకు లేదు. ముఖ్యమంత్రి జగన్, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలకు నిజాయితీ ఉంటే.. రైతుల కోసం వెచ్చించిన మొత్తాన్ని వాస్తవాలతో వైట్ పేపర్ రిలీజ్ చేయాలి'' అని నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి నిలదీశారు.