టీడీపీ నేత కిలారు రాజేశ్​ను అనుసరించిన దుండగులు - ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 12:45 PM IST

thumbnail

TDP Leader Kilaru Rajesh Complained to Police there was a Threat to his Life: గుర్తుతెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారంటూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో నిందితుడిగా ఉన్న కిలారు రాజేశ్ హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్​లో నివసించే రాజేశ్.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలు 15 నిమిషాలకు.. ప్రశాసన్‌నగర్ బస్ స్టాప్ వద్ద ఉన్న తన కుమారుడిని తీసుకొచ్చేందుకు కారులో బయలుదేరారు. ఆ సమయంలో కొంతమంది తెలుపు రంగు ఫార్చ్యునర్ కారులో తనను అనుసరిస్తున్నట్లు గ్రహించారు. వెంటనే భార్యకు ఫోన్ చేసి కుమారుడిని తీసుకురావాలని సూచించారు. తరువాత కారును ఆపకుండా ముందుకు సాగగా వెనుక కారుతోపాటు మరో రెండు ద్విచక్రవాహనాలు వెంబడిస్తుండటాన్ని రాజేశ్ గమనించారు. 

రాజేశ్ రాయదుర్గం, ముంబై హైవే, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, నానక్ రాంగూడ జంక్షన్, మణికొండ, ఫిల్మ్ నగర్, బీఆర్​ఎస్, టీడీపీ కార్యాలయాలు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా ప్రయాణించగా.. వారూ అనుసరించారు. ఇంతలో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36 వద్ద ఒక ద్విచక్రవాహనదారుడు ముందుకు వచ్చి కారును ఆపాడు. తనను ఎందుకు అనుసరిస్తున్నారని రాజేశ్ ప్రశ్నించగా.. 'మా సార్ మిమ్మల్ని ఏమి చేయమని అడిగారో దానిని చేయడం మంచిది' అంటూ సమాధానం ఇచ్చారు. 'సార్ ఎవరు.. మీరు ఎవరు.. ఎందుకు వెంబడిస్తున్నారు' అని రాజేశ్ ప్రశ్నించగా.. 'నీకు అంతా తెలుసు' అని బెదిరిస్తూ ఆగంతకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు రాజేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు తాను తీసిన ఆగంతకుల ఫొటోలను అందజేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు ద్విచక్రవాహనం నంబరును పరిశీలించగా నకిలీదని తేలింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.