బెజవాడ కొండపై దుర్గమ్మ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 1:34 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2023/640-480-20164419-thumbnail-16x9-special-arrangements-on-indrakeeladri.jpg)
Special Arrangements on Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో దీక్ష విరమించేలా ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరు క్యాంప్ కార్యాలయంలో భవానీ దీక్ష విరమణలకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవదాయ, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, నగరపాలక సంస్థ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మత్స్యశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి 3 నుంచి ఏడో తేదీ వరకు జరగనున్న దీక్ష విరమణల కార్యక్రమానికి ప్రణాళికాయుత ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తెలిపారు.
NTR District Collector Ordered to Make Arrangements for Devotees: బెజవాడ కొండపై గత నెల 23 నుంచి 27 వరకు అమ్మవారి మండల దీక్షలు, ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు అర్ధమండల దీక్షలు భక్తులు తీసుకుంటున్నారని రామరావు తెలిపారు. జనవరి 3 నుంచి ఏడో తేదీ వరకు వరకూ ఐదు రోజులు భవానీ దీక్షా విరమణలు ఉంటాయని, రోజుకు సుమారు 50 వేల నుంచి లక్ష మంది వరకు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. చివరి రెండు రోజుల్లో దాదాపు లక్ష నుంచి 1.5లక్షల మంది భవానీ భక్తులు రానున్నదృష్ట్యా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 26వ తేదీన సాయంత్రం ఆరున్నర గంటల నుంచి కలశజ్యోతి ఉత్సవం జరుగుతుందని, ఈ ఉత్సవానికి దాదాపు 10 వేల మంది జ్యోతులు తీసుకొని ఆలయానికి చేరుకునే అవకాశమున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని ఢిల్లీరావు అధికారులకు సూచించారు.
దసరా ఉత్సవాలను విజయవంతం చేసిన తరహాలో భవానీ దీక్షా విరమణల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయం చుట్టుపక్కల మాత్రమే కాకుండా నగరానికి వచ్చే వివిధ రహదారుల్లోనూ వైద్య శిబిరాలతో పాటు విశ్రాంతి ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భక్తుల అవసరం మేరకు బస్సులను సిద్ధంగా ఉంచాలన్నారు. ఘాట్ల వద్ద స్నానానికి, గిరిప్రదక్షిణ, అమ్మవారి దర్శనం, హోమ గుండం ఏర్పాట్లు, ఇరుముళ్ల విరమరణ, లడ్డూ ప్రసాదం పంపిణీ, అన్నప్రసాదం తదితర ఏర్పాట్లపై చర్చించారు.