శ్రీశైలంలో ఘనంగా ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 7:04 PM IST

thumbnail

Sankranthi Brahmotsavalu in Srisailam: శ్రీశైలం మల్లన్న క్షేత్రం సంక్రాంతి ఉత్సవాలకు ముస్తాబైంది. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో దేవస్థానం ఈవో పెద్దిరాజు, అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అనంతరం ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. చండీశ్వరునికి మంగళ హారతులతో పూజలు చేశారు. 

సాయంత్రం 5 గంటలకు అగ్నిప్రతిష్ఠాపన చేసి, ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఈరోజు రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. నేటి నుంచి ఈనెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. 14న భోగి సందర్భంగా సామూహిక భోగి పండ్ల కార్యక్రమం ద్వారా చిన్నారులను అర్చకులు, వేదపండితులు దీవించనున్నారు. 15న ఉదయం మహిళలకు సామూహిక ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. సంక్రాంతి నాడు పార్వతీ సమేత మల్లికార్జున స్వామికి బ్రహ్మోత్సవ కల్యాణం జరపనున్నారు. 17న పూర్ణాహుతి, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి క్రతువులు నిర్వహిస్తారు. 18న స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవ, శయనోత్సవం, ఏకాంత సేవ నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం నుంచి 18 వరకూ పరోక్ష, ఆర్జిత రుద్ర, చండీ, మృత్యుంజయ, గణపతి హోమాలతో పాటు సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, స్వామి అమ్మ వార్ల లీలా కల్యాణాలు, ఏకాంత సేవను నిలుపుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.