Red Sandalwood Smuggling Gang Arrested: శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచందనం.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్..
Red Sandalwood Smuggling Gang Arrested: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు లక్షల 50 వేల రూపాయలు విలువైన ఎర్రచందనం దుంగలను, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చంద్రగిరి సీఐ రాజశేఖర్ తెలిపారు. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ.. శ్రీవారి మెట్ల మార్గంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఆ ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ కారును పట్టుకున్నామని తెలిపారు. అందులో ఇద్దరు స్మగ్లర్లు పట్టుబడగా.. మరో ముగ్గురు పారిపోయినట్లు సిఐ రాజశేఖర్ వెల్లడించారు. కారుతో పాటుగా 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శివకుమార్, కడప జిల్లాకు చెందిన మహేంద్రను అరెస్టు చేశామని తెలిపారు. మరో ముగ్గురు పరారైనట్లు వివరించారు. ఈ ఎర్రచందనం దుంగలను తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ సత్తిరాజు గోడౌన్కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది అన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.