కరెంట్ స్తంభం ఎక్కిన కొండచిలువ - 'ట్రిపుల్ ఐటీలో మంచం కింద దాక్కుని'
Python on Electricity Pole in Poranki of Krishna District : కృష్ణా జిల్లా పోరంకిలో కొండచిలువ కలకలం రేపింది. కరెంట్ స్తంభంపై కొండచిలువ దర్శనమివ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పామును గమనించిన స్థానికులు పెనమలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు..స్నేక్ క్యార్ను పిలిపించి అతని సహాయంతో సురక్షితంగా కొండచిలువ పట్టివేసారు. కొండచిలువ దాదాపు ఎనిమిది అడగుల పొడవు, 13 కిలోల వరకు బరువు ఉంటుందని తెలిపారు. మూలపాడు అటవీ ప్రాంతంలో విడిచిపెడతాం అని అధికారులు తెలిపారు.
మరో ఘటనలో.. ఇటీవల వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని బాయ్స్ హాస్టల్-2లో.. ఓ మంచం కింద దాక్కున్న కొండచిలువను చూసిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టరు సంధ్యారాణి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. వేంపల్లె అటవీ అధికారులకు ఆమె సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అధికారులు.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అటవీ అధికారులు కొండచిలువను గోనె సంచిలో బంధించి.. సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కొండచిలువను అధికారులు బంధించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.