Dead Body In Front Secretariat: అగ్రహారంలో శ్మశాన వాటిక లేదని శవాన్ని సచివాలయం ముందు ఉంచి..
Dead Body Tried To Bury In Front Of The Secretariat : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని బి.అగ్రహారంలో ఆదెమ్మ అనే వృద్ధురాలు వయోభారంతో మృతి చెందింది. కానీ గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో మృతురాలి కుటుంబ సభ్యులు ప్రజా సంఘాలు గ్రామ సచివాలయం ముందు శవాన్ని పూడ్చేందుకు పూనుకున్నారు. గ్రామంలో చనిపోతే ఆరు అడుగులు స్థలం లేక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో కేటాయించిన శ్మశాన స్థలం పట్టా భూమి కావడంతో పూడ్చేందుకు రైతు అభ్యంతరం తెలిపారు. ప్రత్యామ్నాయ శ్మశాన స్థలాన్ని అధికారులు చూపక శవాన్ని పూడ్చేందుకు స్థలం లేక గ్రామస్థులు అగచాట్లు పడుతున్నారు. రెవిన్యూ మొద్దు నిద్రపై ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజా సంఘాల నాయకులు సచివాలయం ముందు గడ్డపారాలతో కొంత మేర గుంత తవ్వారు. చివరికి రెవిన్యూ అధికారులు పోలీసులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ స్థలంలో శవాన్ని ఖననం చేయించారు. ఇటీవల గ్రామంలో ఇద్దరు మృతి చెందగా శవాన్ని పూడ్చేందుకు స్థలం లేక ఆందోళన బాట పట్టారు. రెవిన్యూ అధికారులు ఈ సమస్యకు శాశ్వత మార్గం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.