కుమార్తె తప్పిపోయిందని సాయం కోసం వెళ్తే - కోరిక తీర్చమన్న ఖాకీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 4:56 PM IST
Police Harassed Women in Annamayya District: కుమార్తె తప్పిపోయిందన్న బాధలో ఉన్న ఓ తల్లిని తన కోరిక తీర్చమని.. ఓ పోలీసు వేధించిన అమానవీయ ఘటన ఇది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసు స్టేషన్లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ దాసరి భాస్కర్.. బాధిత మహిళ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యవహారంపై బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కుమార్తెను వెతికేందుకు హెడ్ కానిస్టేబుల్ దాసరి భాస్కర్, మరో మహిళా కానిస్టేబుల్ రేవతిని ఆమెకు తోడుగా పంపారు. అయితే, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ తన పట్ల తప్పుగా ప్రవర్తించారని బాధిత మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో.. వేధింపుల వ్యవహారం బయటపడింది.
తోడుగా వచ్చిన మహిళా కానిస్టేబుల్ సైతం.. భాస్కర్కు సహకరించాలని చెప్పడం బాధ కలిగిస్తుందని, తాను పోలీసుల వద్దకు రక్షణ కోసం వెళ్తే.. వాళ్లే ఇలా ప్రవర్తిస్తే తాను ఎవరికి చెప్పుకోవాలంటూ ఆ మహిళ వాపోతోంది. అయితే, మహిళ ఆవేదనతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఇంకా స్పందించలేదు. ఓబులవారిపల్లి ఎస్సై శ్రీకాంత్ రెడ్డిని వివరణ కోరగా ఆ మహిళ కుమార్తె రెండు నెలల క్రితమే మిస్ అయిందని తమ దృష్టికి తీసుకుని వస్తే.. ఆమెను ట్రేస్ చేసి హైదరాబాద్లో పట్టుకుని అప్పగించామన్నారు. కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తమకు తెలియదన్నారు.