Passengers Problems: గుంటూరులో సీఎం జగన్ సభ.. బస్టాండ్లలో ప్రయాణికులకు తప్పని అగచాట్లు
Passengers Problems Due to CM Meeting: గుంటూరు జిల్లా తుళ్లూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. తుళ్లూరులో ఇళ్ల పట్టాల పంపిణీ నేపథ్యంలో బస్సులన్నీ సీఎం సభకు తరలించడంతో.. గుంటూరు జిల్లా ఎన్టీఆర్ బస్స్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులన్నింటినీ సీఎం సభ కోసం కేటాయించడంతో బస్సులు లేక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్లో ఒక్క బస్సు కూడా లేకపోవడంతో స్టూడెంట్స్, ఉద్యోగులు, గమ్యస్థానాలకు వెళ్లేందుకు జనం అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి బస్టాండ్లో బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. బస్సులు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి, సచివాలయం, క్రోసూర్ వైపు వెళ్లే ప్రయాణికులు.. గంటల తరబడి బస్ స్టేషన్లో వేచి ఉండే పరిస్థితి నెలకొంది. బస్సుల కోసం ఎంత సేపు వేచి వుండాలో తెలియక.. ఇంటికి తిరుగు ముఖం పట్టారు.
"రెండు గంటలు అయ్యింది బస్సు కోసం వచ్చి ఇంతవరకూ ఒక్క బస్సు రాలేదు. తుళ్లూరు బస్సు వస్తుంది.. వెయిట్ చేయమంటున్నారు. మరికొద్దిసేపు చూసి వెళ్లిపోతాం. బస్సులన్ని సభకు పెట్టాం.. కొద్దిసేపటి వరకూ రావని చెప్పారండి"-ప్రయాణికులు