వైసీపీ 'సామాజిక తుస్సు యాత్ర' - ఫ్లెక్సీలు చించుకుని మరీ సభ నుంచి వెళ్లిపోయిన జనం
No Response to YCP Samajika Sadhikara Bus Yatra: సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలు (YCP Public Meetings) జనం లేక ఎలా వెలవెలబోతున్నాయి. భయపెట్టి, డబ్బు వెదజల్లి ప్రజలను తీసుకువచ్చినా సభ ముగిసే వరకూ వారు అక్కడ ఉండడం లేదు. ఖాళీ కుర్చీలను ఉద్దేశించే నాయకులు ప్రసంగించి వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురించింది.
తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ సామాజిక సాధికార బహిరంగ సభ (YCP Bus Yatra) జనాలు లేక వెలవెల బోయింది. సభలో మంత్రులు ప్రసంగం ప్రారంభించగానే జనాలు చిన్నగా ఇళ్లకు జారుకున్నారు. వైసీపీ నేతలు భారీగా జన సమీకరణ చేసినప్పటికీ సభలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతున్నప్పుడు మహిళలు ఏకంగా ఫ్లెక్సీలు చించుకుని సభ నుంచి వెళ్లిపోయారు. మంత్రుల ప్రసంగం చప్పగా సాగడంతో ఉన్న కొద్దిపాటి వైసీపీ శ్రేణులు సైతం సభ నుంచి వెళ్లిపోయేందుకు ఆసక్తి చూపించారు. దీంతో వైసీపీ బస్సుయాత్ర కాస్త తుస్సు యాత్రగా మారిపోయింది.